ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు

author img

By

Published : Apr 25, 2020, 8:15 PM IST

rain in ap
rain in ap

రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులు, వర్షాలు బీభత్సం సృష్టించాయి. రహదారులు, పంటపొలాలు నీటమునిగాయి. పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షం తమ ఆశలపై నీళ్లు చల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉరుములు, మెరుపులతో వర్షాలు

విశాఖ, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాలతోపాటు... రాష్ట్రంలో అనేక చోట్ల ఏకధాటిగా కురిసిన వర్షాలకు రహదారులు, పంటపొలాలు నీటమునిగాయి. విశాఖలో పట్టపగలే చీకటి ఆవరించింది. నగరవ్యాప్తంగా భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో... పల్లపు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఎంపీవీ కాలనీ సత్యసాయి విద్యావిహార్‌ సమీపంలో వర్షం నీరుకు ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి మంటలు ఎగిసిపడ్డాయి. గాజువాక రహదారులు జలమయమయ్యాయి. హఠాత్తుగా వాతావరణం మారటంతో అప్రమత్తం కాలేకపోయిన పోలీసులు, పర్యవేక్షక సిబ్బంది లాక్‌డౌన్‌ విధుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

విశాఖ జిల్లా చోడవరం, నర్సీపట్నంలో దాదాపు గంటన్నరసేపు కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. యలమంచిలిలో చెట్ల కొమ్మలు, స్తంభాలు విరిగిపడి నిలిచిన విద్యుత్‌ సరఫరాను అధికారులు పునరుద్ధరిస్తున్నారు. విశాఖ మన్యం డుంబ్రిగుడలో సంపంగి గెడ్డ ఉప్పొంగి, రాకపోకలు నిలిచిపోయాయి. దేవరాపల్లిలో పిడుగులతో కూడిన వర్షం పడింది. అనకాపల్లిలోని దొంగ గెడ్డ ఉద్ధృతంగా ప్రవహించింది. చినబోయిగూడెం వద్ద ఈదురుగాలులకు తాటిచెట్టు విరిగి విద్యుత్‌ తీగలతోపాటు... రెండు ఇళ్లపై పడటంతో స్థానికులు భయాందోళనలు చెందారు.

అనంతపురం జిల్లా గుత్తి మండలంలో కురిసిన వడగండ్ల వానకు... అన్నదాత కుదేలయ్యాడు. పెద్దపెద్ద వృక్షాలు నేలకూలి.. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. సుమారు 15ఎకరాల మామిడి తోటలో కాయలు నేలరాలాయి. చిత్తూరు జిల్లా... ఏకధాటిగా కురిసిన వర్షాలు, భారీ గాలులకు అనేకచోట్ల విద్యుత్‌ స్తంభాలు, వృక్షాలు నేలకొరిగాయి. తిరుపతిలో ఈదురుగాలులుతో కూడిన వర్షానికి... రోడ్లన్నీ జలమయమయ్యాయి.

శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం... సాగుపై ప్రభావం చూపాయి. రబీ ధాన్యం పొలాలు కళ్లాల్లోనే తడిసిముద్దయ్యాయి. నరసన్నపేటలో రోడ్లపై ఆరబోసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలుమూరు మండలం చెన్నవలసలో..పిడుగుపాటుకు ఇద్దరు కాపరులకు చెందిన 34 గొర్రెలు మరణించాయి.

ఇవీ చవదవండి: కరోనా కలవరం: దేశంలో 779కి పెరిగిన మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.