ETV Bharat / city

'ఈ వ్యాజ్యంలో జోక్యం చేసుకోలేం'.. ఎంపీ రఘురామ పిటిషన్‌పై స్పష్టం చేసిన హైకోర్టు

author img

By

Published : Jun 16, 2022, 5:03 AM IST

High Court on MP Raghuram petition: మద్యం ద్వారా వస్తున్న ఆదాయాన్ని ప్రత్యేక మార్జిన్ పేరిట కార్పొరేషన్‌కు మళ్లించి దాన్ని ఆదాయంగా చూపుతూ ప్రభుత్వం రుణాలు పొందడాన్ని సవాల్ చేస్తూ ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించలేమన్న న్యాయస్థానం.. దీనిపై తగిన ఉత్తర్వులిస్తామని తెలిపింది. అప్పటికీ అభ్యంతరాలు ఉంటే సుప్రీంను ఆశ్రయించవచ్చని సూచించింది.

High Court
High Court

మద్యం ద్వారా వస్తున్న ఆదాయాన్ని ప్రత్యేక మార్జిన్‌ మనీ పేరుతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు మళ్లించడం, ఆ మొత్తాన్ని ఆదాయంగా చూపి ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు పొందడాన్ని సవాలు చేస్తూ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించలేమని, తగిన ఉత్తర్వులిస్తామని, వాటిపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సూచించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.

మద్యం ద్వారా వస్తున్న ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు మళ్లించి, దానిని ఆదాయంగా చూపి ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందేందుకు వీలుగా.. ఏపీ మద్యం చట్టానికి సవరణ చేస్తూ.. తీసుకొచ్చిన ‘సవరణ చట్టాలను’ (యాక్ట్‌ 31/2021, యాక్ట్‌ 9/2022) రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. ఎంపీ తరఫున న్యాయవాది అంబటి సుధాకరరావు వాదనలు వినిపించారు. పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని కన్సాలిడేటెడ్‌ ఫండ్‌కు(సంచిత నిధి) జమచేయాల్సి ఉందన్నారు. అందుకు భిన్నంగా మద్యం అమ్మకాల ద్వారా వచ్చే పన్నును బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు మళ్లించి దాన్ని ఆదాయంగా చూపి, హామీ ఇస్తూ రుణం పొందుతున్నారన్నారు.

ట్రెజరీకి చెందాల్సిన సొమ్మును బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు మళ్లిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కుతోందన్నారు. మద్యం రాబడిని హామీగా చూపి ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా తాజాగా రూ.8వేల కోట్లకుపైగా రుణం పొందినట్లు చెప్పారు. కేంద్రం నిర్దేశించిన రుణ పరిమితిని మించి రాష్ట్ర ప్రభుత్వం అప్పుచేస్తోందని వివరించారు. సంక్షేమ పథకాలను అడ్డుకోవాలనేది తమ ఉద్దేశం కాదని.. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడినప్పుడు న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని కోరుతున్నామని వివరించారు. పన్నుద్వారా వచ్చే ఆదాయాన్ని బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు మళ్లించడానికి వీల్లేదన్నారు.

ధర్మాసనం స్పందిస్తూ.. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో తాము ఏవిధంగా జోక్యం చేసుకోగలమని వ్యాఖ్యానించింది. ఫలానా రూపంలో రుణం పొందాలని ప్రభుత్వాన్ని ఆజ్ఞాపించడానికి మీరెవరని ప్రశ్నించింది. ఆర్థిక వ్యవహారాలు పరిశీలించేందుకు తాము కంపెనీ సెక్రటరీలం కాదని, హైకోర్టు న్యాయమూర్తులమని తెలిపింది. రుణం తెచ్చినా సంక్షేమ పథకాల కోసమేనని వ్యాఖ్యానించింది. సంక్షేమ పథకాలు చేపట్టవద్దనేది మీ ఉద్దేశమా? అని ప్రశ్నించింది. ఇది ప్రజాహిత వ్యాజ్యం కాదని.. నిరర్థక పిల్‌ అని, విచారణకు స్వీకరించబోమని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సక్రమంగా ఉందా? లేదా? అనే విషయాన్ని ఆర్బీఐ, కాగ్‌ చూసుకుంటాయంది. రుణం పొందడం, దానిని తిరిగి ఎలా చెల్లిస్తారు? అనే విషయాలు తీసుకునేవారికి, ఇచ్చేవారికి సంబంధించినవని, ఈ వ్యవహారంలో న్యాయస్థానం జోక్యం ఏవిధంగా ఉంటుందని వ్యాఖ్యానించింది. తాము జోక్యం చేసుకుంటే.. భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లను అధికరణ 226కింద హైకోర్టులో సవాలు చేస్తారని తెలిపింది. ప్రభుత్వాలను న్యాయస్థానాలు నడపలేవని, ఇదే విషయాన్ని గత విచారణలోనూ చెప్పామని గుర్తుచేసింది. ఈ వ్యాజ్యంలో తాము జోక్యం చేసుకుంటే ప్రజాహితం కోసం ఉద్దేశించిన సంక్షేమ పథకాలు ప్రభావితం అవుతాయని తెలిపింది.

ప్రజల తరఫున సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా: భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టుపెట్టి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అప్పులు చేయడాన్ని సవాల్‌ చేస్తే అందులో ప్రజాప్రయోజనం ఏముందని హైకోర్టు ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉందని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దిల్లీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యాజ్యాన్ని సాగదీయకుండా హైకోర్టు ఒకేసారి ఉత్తర్వులు ఇవ్వడం సంతోషకరమన్నారు. తనకు వ్యయం అయినప్పటికీ ప్రజల కోసమే పిటిషన్‌ దాఖలు చేశానని తెలిపారు. ముఖ్యమంత్రి తన భవిష్యత్తు కోసమే చూస్తున్నారని.. తాను మాత్రం ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించి న్యాయస్థానాన్ని ఆశ్రయించానని చెప్పారు. హైకోర్టులో ఊహించినట్టే జరిగిందని.. ప్రజల తరఫున సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని వెల్లడించారు.

ఇదీ చదవండి:

హైకోర్టును ఆశ్రయించిన రాజధాని రైతులు.. నేడు విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.