ETV Bharat / city

సీసీఎంబీ: మరణాలకు దారితీస్తున్న వైరస్‌లేంటి?

author img

By

Published : May 24, 2021, 6:07 PM IST

కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతిలో మరణాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అందులోనూ మధ్య వయస్కులే ఎక్కువ మంది బలవుతుండడం మరింత భయపెడుతోంది. ప్రాణాలు పోవడానికి కొవిడ్‌తో పాటు ఇతరత్రా  అనారోగ్య సమస్యలు కారణమవుతున్నాయా? లేక ప్రత్యేకించి ఏదైనా వైరస్‌ రకం ప్రాణాంతకంగా మారిందా అనే దానిపై హైదరాబాద్​లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) అధ్యయనం చేయబోతోంది.

CCMB research on virus that causes deaths
వైరస్ మరణాలపై సీసీఎంబీ అధ్యయనం

ఇటీవల కరోనాతో చనిపోయిన వ్యక్తుల వైరస్‌ నమూనాలపై అధ్యయనం చేయాలని హైదరాబాద్​లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ నిర్ణయించింది. ప్రధానంగా రీ ఇన్‌ఫెక్షన్‌, బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌, మరణాల(మోర్టాలిటీ)కు దారితీస్తున్న రకాలపై పరిశోధించనుంది. కరోనా తొలి దశలో మరణాలపై, రెండోసారి ఇన్‌ఫెక్షన్‌ బారిన పడినవారిపై సీసీఎంబీ కొంత అధ్యయనం చేసింది. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్రలలోని ఆసుపత్రుల్లో మహమ్మారితో చనిపోయిన వారి నుంచి నమూనాలను సేకరించి వాటి జన్యు క్రమాలను విశ్లేషించనున్నారు.

  • వ్యాక్సిన్‌ వేసుకున్న తర్వాతా కొందరు మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ సంఖ్య స్వల్పంగానే ఉన్నా ఇలాంటి బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్లపై దృష్టి పెట్టాలని ఐసీఎంఆర్‌ సూచించింది. టీకా రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకోవడంపై ఆరా తీస్తారన్నమాట. ఇకపై పరీక్షలు చేసేటప్పుడే టీకా వేసుకున్నారో లేదో అడిగి వివరాలు నమోదు చేస్తారు. టీకా వేసుకున్నాక వైరస్‌ బారిన పడిన వారి నమూనాలను పరీక్షించి, ఏ రకం వైరస్‌.. టీకా రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటుందో గుర్తించి మరింత అధ్యయనం చేయనున్నారు.
  • కొందరికి కొవిడ్‌ రెండోసారీ సోకుతోంది. ఇలాంటి వారిలో వైద్య సిబ్బందే ఎక్కువ మంది. వారి నుంచి సేకరించిన నమూనాలలో జన్యు క్రమాలను కనుగొని ఏ వైరస్‌ రకాలు ఇందుకు కారణమవుతున్నాయో గుర్తించనున్నారు. వైరస్‌లో మార్పులు రీఇన్‌ఫెక్షన్‌కు దారితీస్తున్నట్లు ఇదివరకే ప్రాథమికంగా గుర్తించినా మరింత లోతుగా అధ్యయనం చేయనున్నారు.
  • ప్లాస్మా థెరపీతో కొవిడ్‌ బాధితులకు ఉపయోగం లేదని ఆ చికిత్సను ఇటీవలే ఐసీఎంఆర్‌ తొలగించింది. అయినా కొన్ని ఆసుపత్రుల్లో ఉపయోగిస్తున్నారు. దీనిపై శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని మహారాష్ట్ర హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీసీఎంబీ పరిశీలించనుంది.

ఇదీ చూడండి:

కరోనా మృతుల్లో.. 65% పురుషులే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.