ETV Bharat / bharat

లూడో గేమ్​లో తనను తానే బెట్టింగ్ పెట్టిన మహిళ.. ఓడిపోయి ఇంటి యజమాని వశం!

author img

By

Published : Dec 5, 2022, 10:00 AM IST

Woman put herself at stake after losing in Ludo
ఆటలో తనను తాను కోల్పోయిన మహిళ

కొందరు ఆటల్లో బెట్టింగ్​లు కాసి.. ఆస్తిని, ఉద్యోగాన్ని కోల్పోయి.. కుటుంబంతో సహా రోడ్డున పడిన సందర్భాలు చాలానే చూశాం. కానీ ఓ మహిళ తనని తానే పణంగా పెట్టి ఓ గేమ్​ ఆడింది. ఈ ఆటలో ఆమె ఓటమి పాలవగా వేరే వాళ్ల వశమైంది. ఈ వింత ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

ఉత్తర్​ప్రదేశ్​లో ఓ వింత ఘటన జరిగింది. ఓ మహిళ తనను తానే పందెంగా కాసి లూడో గేమ్​లో పాల్గొంది. తాను అద్దెకు ఉంటున్న ఇంటి యజమానితో లూడో గేమ్​ ఆడి ఓటమిపాలైంది. దీంతో అతడి వశమైపోయింది ఆ మహిళ. ఈ విషయం ఆమె భర్తకు తెలియడం వల్ల అతడు పోలీసులను ఆశ్రయించాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ప్రతాప్​గఢ్​ జిల్లాకు చెందిన ఓ మహిళ.. తాను అద్దెకు ఉంటున్న ఇంటి యజమానితో లూడో గేమ్ ఆడింది. అయితే ఇందులో పందెంగా తననే పెట్టింది. ఈ గేమ్​లో​ ఆమె ఓటమి పాలవగా.. ఇంటి ఓనర్​ వశమైపోయింది. ప్రస్తుతం ఆమె భర్త రాజస్థాన్​లోని ఓ ఇటుక బట్టీలో పనిచేస్తూ.. ఇంటికి డబ్బులు పంపిస్తున్నాడు. అయితే ఒకరోజు భార్యకు ఫోన్​ చేసి తాను ఇంటికి వస్తున్నట్లు చెప్పాడు. దీంతో అసలు విషయం భర్తకు చెప్పింది. తాను ఆటలో ఓడిపోయి ఇంటి యజమానికి సొంతం అయ్యానని.. మీరు ఇంటికి వస్తే తనను అతడు గొడ్డలితో నరికేస్తాడని చెప్పింది. మీరు ఇంటికి రాకుండా పోలీసులు వద్దకు వెళ్లాలని కోరింది.

దీంతో షాక్​కు గురైన భర్త వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యకు జూదం, ఆన్​లైన్ గేమ్స్​ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. ప్రస్తుతం తనకు ఇద్దరు పిల్లలు ఉన్నట్లు వెల్లడించాడు. ఇంటి యజమానికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిపాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.