ETV Bharat / bharat

'వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వం మేలు'

author img

By

Published : Jul 23, 2021, 6:38 AM IST

వివాదాల పరిష్కారంలో 'మధ్యవర్తిత్వం' అత్యుత్తమ అనుసరణీయ విధానాల్లో ఒకటని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. బ్రిటిష్‌ వారి రాకకు ముందునుంచే దేశంలో ఈ విధానం ఉందని చెప్పారు. సులువుగా, వేగంగా, తక్కువ ఖర్చులో మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలు పరిష్కరించవచ్చని అభిప్రాయపడ్డారు.

cji, justice nv ramana
సీజేఐ, జస్టిస్​ ఎన్​వీ రమణ

వివాదాల పరిష్కారానికి అందుబాటులో ఉన్న అత్యుత్తమ అనుసరణీయ విధానాల్లో 'మధ్యవర్తిత్వం' ఒకటని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌వీ రమణ అభిప్రాయపడ్డారు. బ్రిటషర్లు, వారి కోర్టుల వ్యవస్థ రాక ముందునుంచే మన దేశంలో ఈ విధానం ఉందని గుర్తుచేశారు. భవిష్యత్తులో అది మరింత ఆదరణ పొందబోతోందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు వద్ద శిక్షణ పొందిన మధ్యవర్తుల (నివారణ్‌) ఆధ్వర్యంలో నడుస్తున్న 'ఇంటర్నేషనల్‌ వర్చువల్‌ మీడియేషన్‌ సమ్మర్‌ స్కూల్‌-2021'ను ఉద్దేశించి సీజేఐ గురువారం ప్రసంగించారు.

"బ్రిటిష్‌ పాలకులు ఆధునిక భారత న్యాయవ్యవస్థకు రూపకల్పన చేశారు. అదే సమయంలో.. వివాద పరిష్కారానికి, న్యాయం పొందేందుకు విస్తృత వాదనలు అవసరమన్న అపోహ అవతరించడానికీ వారు కారకులయ్యారు. భారత్‌లో అత్యధిక మంది కక్షిదారులు పలు సామాజిక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. వేగంగా, తక్కువ ఖర్చులో, అనువైన మార్గంలో వివాదాలు పరిష్కారమవడం వారికి కావాలి. అందుకు మధ్యవర్తిత్వం ఉత్తమమైనది. కోర్టులను ఆశ్రయించినప్పుడు సాధారణంగా ఏదో ఒక పక్షానికి తీర్పుపై అసంతృప్తి ఉంటుందని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. అందుకే వారు సుప్రీంకోర్టు వరకూ అప్పీలు చేసుకుంటూ వస్తుంటారు. ఇదంతా న్యాయం జరగడంలో జాప్యానికి కారణమవుతుంటుంది. 'గెలిచినవారికే మొత్తం' అన్న దృక్పథం ఫలితమిది. మధ్యవర్తిత్వం ఈ సమస్యను పరిష్కరిస్తుంది. అన్ని పక్షాలకూ మెరుగైన ఫలితాన్ని అందించడంపై అది దృష్టిసారిస్తుంది. వివాదం పరిష్కారమయ్యాక సంబంధాలను కొనసాగించేలా ఆలోచింపజేస్తుంది.

-జస్టిస్​ ఎన్​వీ రమణ, సీజేఐ

అవసరమైనన్ని వనరులు, తగినంత సమయం లేని కక్షిదారులకు.. కోర్టుల్లో దావాలు వేసే సంప్రదాయ వ్యూహం కష్టతరంగా మారుతుందని జస్టిస్​ ఎన్​వీ రమణ పేర్కొన్నారు. అలాంటివారు మధ్యవర్తిత్వంతో వేగంగా, తక్కువ ఖర్చుతో, సులువుగా మెరుగైన ఫలితాన్ని రాబట్టుకోవచ్చునని వివరించారు.

సుశిక్షితులై ఉండాలి

భారత్‌లో మధ్యవర్తిత్వాన్ని మెరుగుపర్చడంలో సర్వోన్నత న్యాయస్థానం క్రియాశీలకంగా పనిచేసిందని సీజేఐ చెప్పారు. పలు తీర్పుల ద్వారా తాము.. కోర్టు అనుబంధ మధ్యవర్తిత్వం అవతరణ, వ్యాప్తికి దోహదపడ్డామన్నారు. 2005లో తాము ఏర్పాటుచేసిన 'సుప్రీం కోర్టు మధ్యవర్తిత్వం, రాజీ ప్రాజెక్టు కమిటీ' దేశంలో మధ్యవర్తులకు శిక్షణనివ్వడంలో కీలక భూమిక పోషిస్తోందని పేర్కొన్నారు. వివాద పరిష్కార సమయంలో మధ్యవర్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు. వారు సుశిక్షితులై ఉండాలని, ఏ పరిస్థితి తలెత్తినా సమర్థంగా ఎదుర్కోగలగాలని సూచించారు. సమగ్ర శిక్షణ కార్యక్రమం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందన్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఆధ్వర్యంలోని కమిటీ ఇప్పటికే మోడల్‌ శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించిన సంగతిని గుర్తుచేశారు. దాన్ని మరింత మెరుగుపర్చేందుకు కొత్త సాంకేతికతలను ఉపయోగించుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి: 'మీడియా'పై ఐటీ దాడులు- రాజకీయంగా దుమారం

ఇదీ చూడండి: పెగాసస్​పై ఆగని రగడ- టీఎంసీ ఎంపీ తీరుపై దుమారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.