ETV Bharat / bharat

'మీడియా'పై ఐటీ దాడులు- రాజకీయంగా దుమారం

author img

By

Published : Jul 22, 2021, 7:03 PM IST

IT dept raids Dainik Bhaskar
దైనిక్​ భాస్కర్​పై ఐటీ సోదాలు

మీడియా సంస్థలపై ఆదాయ పన్ను శాఖ దాడులు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఈ అంశంపై రాజ్యసభలోనూ ఆందోళన చేపట్టాయి విపక్షాలు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కే ప్రయత్నమేనని విమర్శించాయి. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టింది కేంద్రం. దాడుల్లో ప్రభుత్వం పాత్ర లేదని స్పష్టం చేసింది.

ప్రముఖ మీడియా సంస్థ 'దైనిక్ భాస్కర్‌' కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో జైపుర్​, భోపాల్‌, అహ్మదాబాద్‌ సహా 30 ప్రాంతాల్లోని కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఆ సంస్థ ప్రమోటర్ల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. హిందీ మాధ్యమంలో వార్తలు ప్రసారం చేస్తున్న దైనిక్ భాస్కర్‌ ఇటీవల కరోనా రెండో వేవ్‌పై విమర్శనాత్మక కథనాలు ప్రచురించింది. ఈనేపథ్యంలో దైనిక్‌ భాస్కర్‌ కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూ కేంద్రంగా పనిచేసే హిందీ టీవీ ఛానల్​ భారత్​ సమాచార్​ మీడియా కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సంస్థ ఎడిటర్​-ఇన్​-చీఫ్​, ప్రమోటర్స్​ ఇళ్లల్లోనూ తనిఖీలు నిర్వహించారు.

ఈ క్రమంలోనే.. ఉత్తర్​ప్రదేశ్​ హరియా అసెంబ్లీ భాజపా ఎమ్మెల్యే అజయ్​ సింగ్​, ఆయన అనుచరులకు చెందిన ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. అయితే.. ఈ దాడులకు, మీడియా సంస్థల కార్యాలయాల్లో సోదాలకు సంబంధం ఉందా అనేదానిపై స్పష్టత లేదు.

విపక్షాల విమర్శలు..

మీడియా సంస్థలపై ఐటీ దాడులను రాజ్యసభలో లేవనెత్తాయి విపక్షాలు. పెగాసస్​ నిఘా వ్యవహారం సహా ఐటీ దాడులను తప్పుబడుతూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఫలితంగా ఎగువసభ రెండుసార్లు వాయిదా పడింది.

మరోవైపు... ఐటీ దాడులను ప్రజాస్వామ్యంపై జరుగుతోన్న క్రూరమైన దాడిగా పేర్కొన్నారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.

" జర్నలిజం, మీడియా సంస్థలపై దాడులు.. ప్రజాస్వామ్యంపై జరుగుతోన్న క్రూరమైన దాడికి మరో ఉదాహరణ. నరేంద్ర మోదీ కొవిడ్​ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోలేకపోయారని, దాంతో దేశం విపత్కర పరిస్థితుల్లోకి వెళ్లిందని.. దైనిక్​ భాస్కర్​ ధైర్యంగా కథనాలు ప్రచురించింది. మీడియాలో ఉన్నవారు బలంగా, ధైర్యంగా ఉండాలని కోరుతున్నా. కలిసి కట్టుగా ఉండటం వల్ల నిరంకుశ శక్తులకు విజయం దక్కదు. "

- మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి.

  • "ఈ సోదాలు మీడియాను భయపెట్టేందుకు చేసిన ప్రయత్నమే. భాజపాకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. అలాంటి ఆలోచన చాలా ప్రమాదకరం. దీనికి వ్యతిరేకంగా ప్రతిఒక్కరూ గళమెత్తాలి." అని అన్నారు దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​.

" దైనిక్​ భాస్కర్​ వార్తా పత్రిక​, భారత్​ సమాచార్​ న్యూస్​ ఛానల్​పై దాడులు.. మీడియా గొంతు నొక్కేందుకు చేసిన చర్యే. మోదీ ప్రభుత్వం తమపై వచ్చే అతి చిన్న విమర్శను కూడా సహించదు. అలాంటి క్రూరమైన ప్రవర్తనతోనే.. ప్రజాస్వామ్య విధానంలో నిజాన్ని చూడాలనుకోదు. "

- అశోక్​ గెహ్లోత్​, రాజస్థాన్​ ముఖ్యమంత్రి.

ప్రజాస్వామ్య నాలుగో స్తంభాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నంగా అభివర్ణించారు మధ్యప్రదేశ్​ కాంగ్రెస్​ చీఫ్​ కమల్​నాథ్​. నిజం బయటకు రాకుండా అధికార పక్షం అడ్డుంటోందని ఆరోపించారు. పెగాసస్​ గూఢచర్యంలోనూ.. చాలా మీడియా సంస్థలు, వాటికి అనుబంధంగా ఉండే వ్యక్తులను పెద్ద ఎత్తున లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు.

తిప్పికొట్టిన భాజపా..

ప్రజాస్వామ్య గొంతుకను నొక్కుతున్నారన్న కాంగ్రెస్​ ఆరోపణలను భాజపా తిప్పికొట్టింది.

" రాజ్యాంగ సంస్థలు తమ పని తాము చేసుకుంటున్నాయి. అందులో ప్రభుత్వ పాత్ర ఏమీ లేదు. పూర్తి సమాచారం తెలుసుకున్నాకే మాట్లాడాలి. కొన్నిసార్లు చాలా విషయాలు నిజాలకు దూరంగా ఉంటాయి. "

- అనురాగ్​ ఠాకూర్​, కేంద్ర మంత్రి

ఇదీ చూడండి: పెగాసస్​పై ఆగని రగడ- టీఎంసీ ఎంపీ తీరుపై దుమారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.