ఆప్ ఎమ్మెల్యేలకు డబ్బు ఎర, భాజపాలో చేరితే రూ.20 కోట్లు, లేదంటే సీబీఐ దాడులు

author img

By

Published : Aug 24, 2022, 3:37 PM IST

BJP-LD AAP

దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, భాజపా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపించింది. భాజపాలో చేరితే రూ.20 కోట్లు ఇస్తామని ప్రలోభపెడుతున్నారని తెలిపింది. లేదంటే ఈడీ, సీబీఐ దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారని పేర్కొంది. మరోవైపు, లిక్కర్ స్కామ్ విషయంపై మాట్లాడాలని భాజపా ఎదురుదాడికి దిగింది.

భాజపా తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. పార్టీ మారిపోవాలని దిల్లీకి చెందిన తమ శాసనసభ్యులపై ఒత్తిడి చేస్తోందని ధ్వజమెత్తింది. లేదంటే సీబీఐ, ఈడీ కేసులు బనాయిస్తామని బెదిరిస్తోందని మండిపడింది. తమ ఎమ్మెల్యేలైన అజయ్ దత్, సంజీవ్ ఝా, సోమనాథ్ భారతి, కుల్దీప్ కుమార్​ను భాజపా సంప్రదించిందని ఆప్ జాతీయ ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు. భాజపాలో చేరితే ఈ నలుగురికీ రూ.20 కోట్లు చొప్పున ఇస్తామని మాటిచ్చారని చెప్పారు. ఇతర ఎమ్మెల్యేలను కూడా తమతో తీసుకొస్తే రూ.25 కోట్లు ముట్టజెప్తామని భాజపా ప్రలోభపెడుతోందని వివరించారు. ఈ మేరకు నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి దిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు సంజయ్ సింగ్.

"కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రధాని మోదీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆప్ ఎమ్మెల్యేలను బలవంతంగా భాజపా గూటికి చేర్చాలని యత్నిస్తున్నారు. ఆప్​ను విడగొట్టి దిల్లీ సర్కారును పడగొట్టడానికి మోదీ ప్రయత్నిస్తున్నారు. దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని, తమ మనుషులను పంపించి బెదిరిస్తున్నారు. ఎమ్మెల్యేలు భాజపాలో చేరితే రూ.20 కోట్లు, తమతో పాటు ఇతర ఎమ్మెల్యేలను తీసుకొస్తే రూ.25 కోట్లు ఇస్తామని చెబుతున్నారు. ఈ ఆఫర్​ను తిరస్కరిస్తే తప్పుడు కేసులు పెడతామని వారు బెదిరిస్తున్నారు. మనీశ్ సిసోదియా మాదిరిగానే సీబీఐ, ఈడీలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మహారాష్ట్రలో విజయవంతమైన ప్రయోగం, మనీశ్ సిసోదియా విషయంలో విఫలమైంది. ఇప్పుడు ఎమ్మెల్యేలపై ఆ ప్రయోగం చేస్తున్నారు."
-సంజయ్ సింగ్, ఆప్ జాతీయ ప్రతినిధి

అత్యవసర సమావేశం
దీనిపై ట్విట్టర్​లో స్పందించిన ఆమ్ ఆద్మీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ఇది తీవ్రమైన అంశమని పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో అత్యవసర భేటీకి పిలుపునిచ్చారు.

సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సిసోదియా సైతం భాజపాపై మండిపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాణాలైనా ఇస్తారని, అంతేతప్ప పార్టీకి ద్రోహం చేయరని అన్నారు. పార్టీ సభ్యులంతా కేజ్రీవాల్ సైనికులని, స్వాతంత్ర్య సమరయోధుడు భగత్​సింగ్ అనుచరులని చెప్పుకొచ్చారు. 'నన్ను పార్టీ నుంచి విడగొట్టేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని.. ఎమ్మెల్యేలకు డబ్బు ఆశచూపిస్తున్నారు. సీబీఐ, ఈడీ దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరిస్తున్నారు' అని సిసోదియా ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి: భాజపాలో చేరితే కేసులు ఎత్తివేస్తాం, ఆప్​ను విడగొడితే సీఎంను చేస్తామన్నారు

భాజపా ఎదురుదాడి
Delhi liquor scam: మరోవైపు, కేజ్రీవాల్ ప్రభుత్వం తెచ్చిన మద్యం విధానంలో అవకతవకలు జరిగాయని భాజపా ఆరోపణలు గుప్పించింది. రాజధానిలో లిక్కర్ అమ్మకాల విషయంపై నిపుణుల కమిటీ ఇచ్చిన సూచనలను దిల్లీ సర్కారు పెడచెవిన పెట్టిందని ఆరోపించింది. భారీగా ముడుపులు అప్పజెప్పిన సంస్థలకు లైసెన్సులు కట్టబెట్టిందని పేర్కొంది. ఈ వ్యవహారంపై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన భాజపా ప్రతినిధి సంబిత్ పాత్ర.. లిక్కర్ స్కామ్​లో కేజ్రీవాలే ప్రధాన సూత్రధారి అని ఆరోపించారు. అయితే, దర్యాప్తు సంస్థలను దృష్టిలో పెట్టుకొని ఒక్క ఫైల్​పై కూడా సంతకాలు చేయలేదని అన్నారు. ఎమ్మెల్యేలను సంప్రదించిన వ్యక్తులు ఎవరో చెప్పాలని ఆప్​ను డిమాండ్ చేశారు.

'నిపుణుల కమిటీ ప్రతిపాదనలకు విరుద్ధంగా మొత్తం లిక్కర్ వ్యాపారాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. పెద్ద పెద్ద కంపెనీలకూ రిటైల్ లైసెన్సులు ఇచ్చారు. బ్లాక్ లిస్ట్​లో ఉన్న కంపెనీలు కూడా లైసెన్స్ దక్కించుకున్నాయి. మనీశ్ సిసోదియాజీ.. మీరు ప్రపంచంలోనే ఉత్తమ విద్యాశాఖ మంత్రి అయి ఉండొచ్చు. కానీ అబ్కారీ మంత్రిగా మీరేం చేస్తున్నారు? మేం అడిగిన ప్రశ్నలకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సమాధానాలు ఇవ్వండి. నిపుణుల కమిటీ చేసిన ప్రతిపాదనలను విస్మరించింది నిజం కాదా? ఎవరి ఆదేశాలతో మీరిలా చేశారు?' అని సంబిత్ పాత్ర ప్రశ్నల వర్షం కురిపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.