నేతపర్వంగా సింహాద్రి అప్పన్న గరుడసేవ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 6, 2024, 1:32 PM IST
Visakha Simhaadri Appana Garuda Seva: విశాఖలోని సింహాచలం పుణ్య క్షేత్రంలో సింహాద్రి అప్పన్నకు ఈరోజు వైభవంగా గరుడ సేవ నిర్వహించారు. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని మండపంలో అధిష్టింప చేశారు. అర్చకులు వేకువ జామున స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి సంప్రదాయ బద్దంగా ప్రాతఃకాల పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి సన్నిధిలో వైభవంగా నిర్వహించిన అర్జిత సేవా కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది.
వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆలయ పండితులు సర్వాంగ సుందరంగా అలంకరించి గరుడ వేదికపై అధిష్టింపజేశారు. వేద మంత్రాలు, నాధ స్వర మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి గురుడ సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామి వారి ఆర్జిత సేవలో పాల్గొని తరించారు. స్వామి వారి సేవలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ శాస్త్రం విధానంలో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామి వారి ప్రసాదాలను అందజేశారు.