భద్రాద్రి రామయ్యకు ఘనంగా వెండి రథ సేవ - పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు - Vendi Ratha Seva in Bhadri
Published : May 5, 2024, 12:00 PM IST
Vendi Ratha Seva in Bhadri Temple : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం ఉదయం లక్ష్మణ సమేత సీతారాముల ఉత్సవ మూర్తులకు ఏకాంతంగా అభిషేకం చేశారు. అర్చకులు మధ్యాహ్నం లక్ష కుంకుమార్చన నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి వెండి రథ సేవ, తిరువీధి సేవ ఘనంగా జరిపారు. స్వామివారిని వెండి రథంలో వేంచేపింపచేసి భక్తులు ఆలయం చుట్టూ స్వామివారి రథాన్ని లాగుతూ సేవ నిర్వహించారు.
వెండి రథంలో ఊరేగుతున్న స్వామి వారిని చూసి భక్తులు రామనామ స్మరణలతో జై జై నినాదాలు పలికారు. ఆలయం చుట్టూ మూడుసార్లు వెండి రథంలో విహరిస్తున్న స్వామివారికి ఆలయ అర్చకులు ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వేసవి కాలం కావడంతో ఆలయ అధికారులు ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.