జూట్ మిల్ యాజమాన్యం అక్రమ లాకౌట్ - ఎత్తివేయాలని కార్మికులు డిమాండ్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 4, 2024, 1:51 PM IST
Neelam Jute Mill Workers Strike Against Illegal Lockout in Srikakulam District : శ్రీకాకుళం గ్రామీణ మండలం బైరి సింగుపురంలో నీలం జూట్ మిల్ అక్రమ లాకౌట్ నిరసిస్తూ కార్మికులు ధర్నా నిర్వహించారు. నీలం జూట్ మిల్లు యాజమాన్యం ముందస్తు సమాచారం ఇవ్వకుండా డ్యూటీలకు అనుమతించటం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. లాకౌట్ ప్రకటన ఉదయం 6 గంటలకు నోటీస్ బోర్డులో పెట్టారని కార్మికులు మండిపడ్డారు.
తమ శ్రమను ఉపయోగించుకుంటూ ఉత్పత్తిని కొనసాగించుకోకుండా యాజమాన్యం వారిపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటీసు బోర్డులో కార్మికులు పని చేయకపోవడం వల్లనే లాకౌట్ చేస్తున్నామని తెలపడం అన్యాయమని పేర్కొన్నారు. కార్మికులకు ఎలాంటి సూచనలు ఇవ్వకుండా యాజమాన్యం లాకౌట్ ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కార్మికులు విధులు హాజరు కాకుండా అక్రమ లాకౌట్ ప్రకటించడం చట్ట వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. యాజమాన్యం అక్రమ లాకౌట్ను వెంటనే ఎత్తివేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. కార్మికులందరినీ యాజమాన్యం విధుల్లోకి అనుమతించకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని సీఐటీయూ నాయకులు హెచ్చరించారు.