కదులుతున్న రైలు ఎక్కబోయి ప్రమాదం - ప్లాట్ ఫాం, రైలు మధ్య ఇరుక్కుపోయి వ్యకికి తీవ్రగాయాలు
Published : Jan 30, 2024, 2:36 PM IST
Man Stucked In Train And Platform in Vikarabad Station : వికారాబాద్ రైల్వేస్టేషన్లో ఓ ప్రయాణికుడు మరణం చివరి అంచు వరకు వెళ్లి బయటపడ్డాడు. బీదర్ నుంచి యశ్వంత్పూర్ వెళ్లాల్సిన రైలు వికారాబాద్ రైల్వేస్టేషన్కు చేరుకుంది. రైలు కదులుతున్న సమయంలో రాయిచూర్కు చెందిన సతీష్ అనే ప్రయాణికుడు ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పట్టుతప్పి ట్రైన్కు ప్లాట్ఫామ్కు మధ్యలో పడిపోయాడు. కొంత దూరం వరకు రైలు అతడిని ఈడ్చు కెళ్లింది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు రైల్వేస్టేషన్లోని సీసీకెమెరాల్లో నమోదయ్యాయి. ఆ దృశ్యాలు చూసిన వారంతా సతీష్ బతకడం కష్టమనే అనుకున్నారు. ఈలోపు రైలులోని ప్రయాణికులు చైన్లాగి ట్రైన్ ఆపేశారు.
Train Accident In Vikarabad : ప్లాట్ఫామ్కు రైలుకు మధ్యలో ఇరుక్కుపోయిన బాధితుడిని బయటకు తీసేందుకు రైల్వే సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. చివరకు ప్లాట్ఫామ్ను కొంతమేర పగులగొట్టి అతికష్టం మీద అతడిని కాపాడారు. తీవ్ర గాయాలపాలైన సతీశ్ను తొలుత వికారాబాద్ ఆస్పత్రికి తరలించి అనంతరం మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగానే ఉందన్న వైద్యులు మరిన్ని పరీక్షల అనంతరమే పూర్తి ఆరోగ్య పరిస్థితి తెలుస్తుందన్నారు. ట్రైన్ ఎక్కే సమయంలో ప్రయాణికులు అప్రత్తంగా ఉండాలన్న రైల్వే పోలీసులు తొందరపాటులో ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదని సూచిస్తున్నారు.