బస్సులో వసతులపై నిలదీసిన ప్రయాణికులు - వాహనాన్ని రోడ్డుమీద వదిలేసి వెళ్లిన డ్రైవర్ - COMPLAINT ON BUS TRAVELS MANAGEMENT
Published : May 21, 2024, 11:57 AM IST
Passengers Complaint on Travels Bus : ఓం శ్రీ ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలంటూ గోవా వెళ్లాల్సిన ప్రయాణికులు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓం సాయి ట్రావెల్స్ బస్సు ద్వారా సికింద్రాబాద్, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి గోవా వెళ్లేందుకు ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్నారు. అకస్మాత్తుగా ప్రయాణికులందరూ మియాపూర్ రావాలని ట్రావెల్స్ యాజమాన్యం ఫోన్ ద్వారా పేర్కొంది.
ట్రావెల్స్ యాజమాన్యం నిర్లక్ష్యం : చేసేదేమీ లేక వారు మియాపూర్ వచ్చి బస్సు ఎక్కారు. బస్సులో సౌకర్యాల గురించి డ్రైవర్ను ప్రశ్నించగా ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తించారు. అంతేకాకుండా సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం అశోక్ నగర్ రహదారిపై చేరుకోగానే డ్రైవర్ బస్సును వదిలి వెళ్లిపోయాడు. ట్రావెల్స్ యాజమాన్యం కూడా ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ప్రయాణికులు రాత్రి 100 నంబర్కు ఫోన్ చేశారు.
రామచంద్రాపురం పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో ప్రయాణికులందరూ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. అటు గోవాకు వెళ్లలేక, పిల్లలతో రాత్రంతా పడిగాపులు కాయడంతో ఓం శ్రీ ట్రావెల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. అయితే అందులో ఇంటర్వ్యూకు వెళ్లాల్సిన చరణ్ శర్మ కూడా వెళ్లలేకపోయాడు.
'ట్రావెల్స్ యాజమాన్యం ఫోన్ చేసి సికింద్రాబాద్లో మీకు పికప్ లేదు మియాపూర్కు రావాలని చెప్పారు. నా దగ్గర లగేజ్ ఎక్కువ ఉంది నేను రాలేను అని చెబుతే, కాల్ కట్ చేశారు. మళ్లీ ఏమైనా అడిగితే చాలా దురుసుగా మాట్లాడుతున్నారు' - వైష్ణవి, ప్రయాణికురాలు