LIVE : భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభోత్సోవంలో సీఎం రేవంత్రెడ్డి
Published : Mar 11, 2024, 1:54 PM IST
|Updated : Mar 11, 2024, 3:02 PM IST
CM Revanth Live : అభయహస్తం ఆరు గ్యారంటీల్లోని 13 కార్యక్రమాల్లో మరో పథకానికి ప్రభుత్వం ఇవాళ శ్రీకారం చుట్టింది. భద్రాచలంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్రెడ్డి ప్రారంభిస్తున్నారు. ఇందిరమ్మ పథకంలో పేదలకు స్థలంతో పాటు రూ.5 లక్షలు కేటాయించనున్నారు. మొదటి విడతలో సొంత స్థలం ఉన్నవారికి రూ.5 లక్షలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఏటా నాలుగున్నర లక్షల ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఈ ఏడాది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇండ్లను మంజూరు చేసింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం తెలంగాణ సర్కార్ హడ్కో నుంచి రూ.3000ల కోట్ల రుణం కూడా తీసుకుంది. లబ్ధిదారులకు తెల్లరేషన్ కార్డుతో పాటు సొంత స్థలం లేదా ప్రభుత్వం ఇచ్చిన భూమి ఉండాలి. గుడిసె ఉన్నా, గడ్డితో పైకప్పును నిర్మించిన ఇల్లు లేదా మట్టి గోడల తాత్కాలిక ఇల్లున్నా ఇందిరమ్మ పథకానికి అర్హులుగా పేర్కొన్నారు. అద్దె ఇంట్లో ఉంటున్నా, వివాహమై ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా పథకానికి అర్హులే. ఒంటరి, వితంతు మహిళలూ లబ్ధిదారులుగా ఎంపిక కావచ్చు. ఇందిరమ్మ ఇంటిని మహిళ పేరు మీదే మంజూరు చేస్తారు. ఇంట్లో వితంతు ఉంటే ఆమె పేరిటే ఇస్తారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రిని సంప్రదించి గ్రామ, వార్డుసభల్లో ఆమోదం పొందిన తర్వాత లబ్ధిదారులను కలెక్టర్ ఎంపిక చేస్తారు.