గత ఎన్నికల్లో కడప ఎంపీ సీటు కోసం షర్మిల ముందుకు వచ్చినందుకే వివేకా హత్య !: బీటెక్ రవి - BTECH RAVI ON VIVEKA MURDER
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 3, 2024, 3:44 PM IST
BTech Ravi Fire on CM Jagan due to Viveka Death : వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డికి సిగ్గు ఉంటే వెంటనే కడప ఎంపీ పోటీ నుంచి తప్పుకోవాలని పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి సూచించారు. ఏకంగా ముఖ్యమంత్రి చెల్లెలే అవినాష్ రెడ్డిని హంతకుడు అనే విధంగా మాట్లాడుతున్నా కడప ఎంపీగా మరోసారి పోటీకి దిగడం సిగ్గుచేటన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివేకా హత్యపై సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షి పత్రికలో పలు రకాలుగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మాటలు విన్న షర్మిల నిన్న నిజాలను బయటపెట్టి ఏకంగా కుండబద్దలు కొట్టిందన్నారు.
గత ఎన్నికల్లో కడప ఎంపీ సీటుకు షర్మిల ముందుకు వచ్చినందుకే తన చిన్నాన్నను హత్య చేయించారని ఆమె అనుమానం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. షర్మిల ఎంపీ సీటుకు ఒప్పుకున్న తర్వాత జగన్ మోహన్ రెడ్డి అంతఃపుర కుట్రతో వివేకానంద రెడ్డిని చంపించి ఉంటారని బీటెక్ రవి అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్న వైఎస్సార్సీపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని తెలిపారు. తండ్రి సమాధి వద్ద జగన్ రెడ్డి పలుమార్లు ప్రార్థన చేస్తుంటే హత్యా రాజకీయాలు చేస్తున్న అతన్ని చూసి వైఎస్ఆర్ ఆత్మ క్షోభించి ఉంటుందని వెల్లడించారు. వైఎస్ విజయమ్మ కుమారుడు, కుమార్తె ఇడుపులపాయ వచ్చిన ప్రతిసారి ప్రార్థన చేస్తుందని ఆమె ఎవరి వైపు ఉన్నారో స్పష్టం చేయాలని బీటెక్ రవి ప్రశ్నించారు.