తిరుమలలో కలకలం సృష్టించిన బాలుడి కిడ్నాప్ ఘటన
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 10, 2024, 10:51 PM IST
Boy Kidnapped in Tirumala : ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్కు గురైన సంఘటన కలకలం రేపింది. తెలంగాణలోని గద్వాల్ జిల్లాకు చెందిన అభినయ్ అనే మూడేళ్ల చిన్నారిని ఓ మహిళ అపహరించినట్టు సీసీటీవీ ఫుటేజి ద్వారా వెల్లడైంది. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు అలిపిరి కాలిబాట మార్గాన తిరుమలకు నగేశ్ కుటుబం చేరుకుంది. మెుత్తం ఆరుగురు కుటుంబసభ్యులలో ముగ్గురు గదులు కోసం వెళ్లారు. మిగిలిన మహిళలతో ఉన్న చిన్నారి అభినయ్ అదృశ్యమయ్యాడు. బాలుడు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Boy Missing in Tirumala : వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజి ద్వారా దర్యాప్తు ప్రారంభించారు. యాత్రికుల సముదాయం-2 వద్ద అభినయ్ కిడ్నాప్నకు గురైనట్టు పోలీసులు నిర్ధారించుకున్నారు. గుర్తు తెలియని మహిళ బాలుడిని తీసుకెళ్తున్నట్లు తిరుపతి రైల్వేస్టేషన్ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. బాలుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి తిరుపతిలోని ఓ లాడ్జీలో దొరికినట్లు పోలీసులు తెలిపారు. మహిళను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. బాలుడు క్షేమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.