దిల్లీలో బీజేపీ తొలి జాబితా విడుదల - ప్రత్యక్షప్రసారం
Published : Mar 2, 2024, 6:22 PM IST
|Updated : Mar 2, 2024, 6:54 PM IST
BJP Lok Sabha Candidates First List : మరికొన్ని నెలల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు పార్టీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు భారతీయ జనతా పార్టీ వేగంగా అడుగులు వేస్తోంది. టార్గెట్ 400 సీట్లు నినాదంతో ఇప్పటికే బీజేపీ శ్రేణులను అప్రమత్తం చేసిన అదిష్టానం, ఆ దిశగా రాష్ట్రాలకు కూడా కీలక సూచనలను జారీ చేసింది. ఈ మేరకు కాసేపట్లో దిల్లీలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల తొలి జాబితా ఖరారు చేసేందుకు ప్రధాని నేతృత్వంలో కేంద్ర ఎన్నికల కమిటీ కొద్ది రోజుల క్రితం సమావేశమైంది. ఎన్నికల షెడ్యూలు వెలువడకముందే అందరు అభ్యర్థులను ప్రకటించాలని బీజేపీ భావిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో టికెట్ ఆశావహుల వడపోతపై పార్టీ అధిష్ఠానం ఇప్పటికే మంతనాలు జరిపింది. అయితే లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాలో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా పేర్లు ఉండొచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో మళ్లీ అవకాశం ఇవ్వని భూపేందర్ యాదవ్, ధర్మేంద్ర ప్రధాన్, మన్సుఖ్ మాండవీయ సహా పలువురు కేంద్ర మంత్రులను ఈసారి ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ చూస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహిస్తున్న మీడియా సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.