ETV Bharat / state

దోచుకోవడంలో వాళ్లని మించినోళ్లు లేరు! - అన్నదమ్ముల దెబ్బకు కొండలైనా కదలాల్సిందే

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 27, 2024, 8:56 AM IST

YSRCP_leaders_Irregularities
YSRCP_leaders_Irregularities

YSRCP leaders Irregularities: అక్రమార్జనలో ఆయనని మించిన తోపులెవ్వరూ లేరు. సొంతిల్లు లేని స్థాయి నుంచి 500 కోట్లకు అధిపతిగా ఎదిగాడు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన చేయని అరాచకం లేదు. దోచిన సొమ్ముతో హైదరాబాద్‌లో విల్లాలు, అపార్ట్‌మెంట్లో ప్లాట్‌ల కొనుగోలు చేసి జల్సాలు చేస్తున్నారు. కోట్ల విలువైన భూములు కొట్టేయడం, పేదల పొలాలు కబ్జా చేయడం ఆ ప్రజా ప్రతినిధి సోదరులకు వెన్నతో పెట్టిన విద్య. నియోజకవర్గంలో ఎవరైనా వెంచర్ వేస్తే కమీషన్ ముట్టజెప్పాల్సిందే. ఆయన దెబ్బకు కొండలు కరిగిపోయాయి. చివరకు పేదలు తినే రాయితీ బియ్యాన్ని సైతం ఆ అన్నదమ్ములు వదిలిపెట్టలేదు.

దోచుకోవడంలో వాళ్లని మించినోళ్లు లేరు! - అన్నదమ్ముల దెబ్బకు కొండలైనా కదలాల్సిందే

YSRCP leaders Irregularities: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అన్న చందంగా ఐదేళ్లలో వైసీపీ ప్రజాప్రతినిధులు ఊర్లపైపడి దోచుకున్నారు. గత ఎన్నికల ముందు సొంతిల్లు కూడా అమ్ముకుని రాజకీయం చేస్తున్నామంటూ బీద అరుపులు అరిచిన ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఓ ప్రజా ప్రతినిధి, ఇప్పుడు ఏకంగా 500 కోట్లకు అధిపతి అయ్యాడు. అక్రమార్జనలో ఆయనకు మించిన తోపులేడని జిల్లాలో చెప్పుకుంటున్నారు. భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ దందాలు మొదలుకుని ఎర్రమట్టి, పేదల బియ్యం వరకు దేన్నీ వదలలేదు.

అక్రమ సంపాదన మొదలుపెట్టిన అనతికాలంలోనే హైదరాబాద్‌లో సుమారు 14 కోట్లతో విల్లా, 5 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్, 4 కోట్ల విలువైన మరో ఇల్లు కొనుగోలు చేశారు. జీవనోపాధికి ఉన్న పొలాలు అమ్ముకున్నామని చెప్పుకున్న ఆ ప్రజాప్రతినిధి కుటుంబానికి ఇప్పుడు కర్ణాటక, విజయవాడ, విశాఖలో వందల కోట్ల విలువైన భూములు ఉన్నాయి. ఇవి చాలవన్నట్లు పేదలకు ఇచ్చిన ఎసైన్డ్ భూములను సైతం చెరబట్టారు. పరిశ్రమలను సైతం కమీషన్ల కోసం వేధించి రాష్ట్రం నుంచి తరిమేశారు.

అనాథాశ్రమాల నుంచి ప్రార్థనాలయాల వరకూ - వారి కన్ను పడితే అంతే!

విల్లాలంటే ఎంతో మోజు: అనంతపురం గ్రామీణ పరిధిలో స్థిరాస్తి వ్యాపారం చేయాలంటే సదరు ప్రజాప్రతినిధికి ముడుపు చెల్లించాల్సిందే. విల్లాలంటే ఎంతో మోజు ఉన్న ఆ నేతకు అన్ని వసతులున్న ఒక విల్లాతోపాటు ఎకరాకు 10 లక్షల రూపాయలు సమర్పించుకోవాల్సిందే. రాప్తాడు, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాల మీదుగా జాతీయ రహదారి వెళ్తుండటంతో అక్కడి భూములకు ఒక్కసారిగా విలువ పెరిగింది. దీని కారణంగా ఒక్క రాప్తాడు పరిధిలోనే 500కు పైగా అనధికారిక వెంచర్లు వెలిశాయి. వీటి నుంచి వారు దాదాపు 50 కోట్లకుపైగా వసూలు చేసినట్లు సమాచారం. బెంగళూరు జాతీయ రహదారిని ఆనుకుని ఓ స్తిరాస్థి వ్యాపారి విలాసవంతమైన విల్లాలు నిర్మించారు.

వైసీపీ ప్రజా ప్రతినిధి సోదరుడు వేధించి వెంటపడి 2 కోట్ల విలువైన విల్లా రాయించేసుకున్నారు. అనంతపురం సమీపంలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ విలాసవంతమైన విల్లాలు నిర్మిస్తుండటంతో ప్రజాప్రతినిధి కుటుంబం కన్ను ఆ విల్లాలపై పడింది. వారిని బెదిరించి హైదరాబాద్‌లో 14 కోట్ల విలువైన విల్లాను వారి పేరిట రాయించేసుకున్నారు. ఆ నియోజకవర్గంలో భూముల క్రయవిక్రయాలన్నీ ఆ ప్రజాప్రతినిధి కుటుంబం కనుసన్నల్లోనే జరగాలి, లేదంటే వారే వివాదాలు సృష్టించి వసూళ్లకు పాల్పడుతుంటారు. నకిలీ పట్టాలతో మొత్తం భూమిని కాజేస్తారు. చెన్నేకొత్తపల్లి మండలంలో ఓ పేద కుటుంబానికి చెందిన ఎసైన్డ్ భూమిపై సదరు నేత సోదరుడి కన్నుపడింది.

రైతు ప్రతిఘటించడంతో ఆయన పొలంలో మామిడి చెట్లు నరికివేయించారు. ఆ తర్వాత ఆ భూమి ప్రభుత్వం మరొకరికి కేటాయించిందంటూ దొంగపత్రాలతో దౌర్జన్యానికి దిగారు. పేదల భూములనే కాదు, ప్రభుత్వ భూములను ఈ అన్నదమ్ములు వదిలిపెట్టరు. అనంతపురంలో కార్పొరేషన్ భూమినే కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. కురుగుంటలో ఎస్టీ మహిళకు చెందిన ఐదెకరాల భూమి ఆక్రమించేందుకు ప్రజాప్రతినిధి సోదరుడు తీవ్రంగా ప్రయత్నించాడు. నకిలీ పత్రాలు సృష్టించి రెవెన్యూ అధికారులతో బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరకు అనుచరుల ద్వారా అందులో ఎకరం ఆక్రమించి షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేపట్టారు. బాధితురాలు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నా వారి అరాచకాలు ఆగలేదు.

సకుటుంబ స'మేత' పర్వం - దోపిడీలో పతిని మించిన సతి, ఇసుక మేస్తున్న పుత్రరత్నం

రజకుల భూములనూ ఆక్రమించుకున్నారు: ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రజకుల కోసం అనంతపురం సమీపంలోని ఆకుతోటపల్లిలో కేటాయించిన ఐదెకరాలు, రాప్తాడు మండలం ఎర్రగుంటలోని పదెకరాలను ప్రజాప్రతినిధి సోదరుడు ఆక్రమించుకున్నారు. వీటి విలువ సుమారు 10 కోట్ల వరకు ఉంటుంది. ఉప్పరపల్లిలో రైతుల పేరిట 3 కోట్ల విలువైన భూమలు కాజేశారు. గత ప్రభుత్వం ఆటోనగర్‌కు 58 ఎకరాలు కేటాయించింది. ఆ భూమిలో ఓ 5 ఎకరాలపై ప్రజాప్రతినిధి కుటుంబం కన్నేసింది.

ఆటోనగర్‌కు 27 ఎకరాలు మాత్రమే కేటాయించారని, మిగిలిన భూమిని స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారిపై ఒత్తిడి తీసుకొచ్చారు. రికార్డులు పక్కాగా ఉండటంతో అధికారులు ఒప్పుకోలేదు. శ్రీకృష్ణదేవరాయ వర్సిటీ భూములపైనా కన్నేయగా విషయం పత్రికల్లో రావడంతో వెనక్కి తగ్గారు. పేదలకు ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యాన్ని సదరు ప్రజాప్రతినిధి సోదరులు వదల్లేదు. నియోజకవర్గ వ్యాప్తంగా రేషన్ బియ్యం సేకరించి కర్ణాటక రైస్ మిల్లులకు అమ్ముకుని కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు.

దీని ద్వారానే నెలకు 30 లక్షల వరకు ఆ కుటుంబం సంపాదిస్తోంది. రాప్తాడు నియోజకవర్గంలో కొండలు, గుట్టలు ఈ అన్నదమ్ముల దెబ్బకు కనుమరుగయ్యాయి. లేఔట్లకు ఎర్రమట్టిని అమ్ముకుని కోట్లు దండుకున్నారు. ఒక్క ఎర్రమట్టి రూపంలోనే రోజుకు 5లక్షల ఆదాయం వీరి కుటుంబానికి వస్తుందంటే వీరు ఎంత తోపులో అర్థం చేసుకోవచ్చు. పెన్నా నది నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక అక్రమంగా తరలించి పెద్దఎత్తున డబ్బు వసూలు చేస్తున్నారు.

వైఎస్సార్సీపీ నేతల భూ కబ్జా: చంపేస్తానంటూ బెదిరింపులు

కమీషన్ ఇవ్వాల్సిందే: ప్రజాప్రతినిధి కుటుంబానికి చెందిన నిర్మాణ సంస్థ చేపట్టే పనులకు ప్రభుత్వం నుంచి ఉచితంగానే ఇసుక తీసుకుంటారు. కంకర సైతం కారుచౌకగా ఇవ్వాల్సిందే. లేకుంటే మైనింగ్ అధికారులను రంగంలోకి దించుతారు. ఇంత చేసినా నాణ్యమైన నిర్మాణాలు చేపడతారా అంటే అదీలేదు. జగనన్న కాలనీల్లో అనుచరుల పేరిట ఇళ్లు రాయించుకుని బిల్లులు స్వాహా చేశారు. తెలుగుదేశం హయాంలో జాకీ సంస్థకు భూములు కేటాయించగా, వారు సగం మేర పనులు చేపట్టారు.

ఆ తర్వాత అధికారం మారడంతో సదరు ప్రజాప్రతినిధి వారిని బెదిరించి 15 కోట్లు కమీషన్ ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో వారు ఏకంగా రాష్ట్రాన్నే వదిలేసి తెలంగాణకు వెళ్లిపోయారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకున్న సంస్థలన్నీ వీరి ఆగడాలు భరించలేక పారిపోయాయి. రాప్తాడులో డెయిరీ వ్యాపారిని 10 కోట్లు ఇవ్వాల్సిందిగా బెదిరించారు. వారు అంగీకరించకపోవడంతో ఆ సంస్థ కొన్న భూములు తమవేనంటూ కొందరు రైతులతో ధర్నా చేయించారు. దీంతో వారు 6 కోట్లకు బేరం కుదుర్చుకున్నారు.

ఇళ్ల స్థలాలను ఆక్రమించేందుకు వైసీపీ నేత యత్నం - బాధితుల ఆవేదన

తండ్రి సైతం వారితోనే జతకట్టారు: కొడుకులు తప్పు చేస్తుంటే మందలించాల్సిన ఇంటిపెద్దైన వారి తండ్రి సైతం వారితోనే జతకట్టారు. ఆత్మకూరు, కనగానపల్లి, రాప్తాడు మండలాల్లో భూవివాదాల్లో తలదూర్చి కోట్ల రూపాయలు కమీషన్ నొక్కేశారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో మనుషుల్ని పెట్టి దందా చేస్తున్నారు. సహకార బ్యాంకుల ద్వారా రైతులకు ఇచ్చే రుణాల్లోనూ కమీషన్లు దండుకుంటున్నారు. మిగిలిన కుటుంబ సభ్యులు సైతం అక్రమార్జనలో తలో చేయి వేస్తున్నారు.

శ్రీకృష్ణదేవరాయ వర్సిటీలో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలను అమ్మేసుకున్నారు. ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్ల నుంచీ వసూళ్లకు పాల్పడుతున్నారు. సాగు చేయకున్నా పండ్లతోటలు వేసినట్లు చూపడం, చేయని పనులకూ బిల్లులు చేయించడంలో మునిగి తేలారు. డెయిరీ పేరిట భారీ అవినీతికి పాల్పడ్డారు. పది వేల మంది మహిళలను నమ్మించి ఒక్కొక్కరి నుంచి 10 వేల చొప్పున వసూలు చేశారు. రైతులు తిరగబడటంతో వసూలు చేసిన సొమ్మును వెనక్కి ఇచ్చేశారు.

ఆ సొమ్ముకు వడ్డీ రూపంలో వచ్చిన 3 కోట్లు వెనకేసుకున్నారు. తీవ్ర నష్టాల్లో ఉన్న టమోటా రైతులపైనా వీరు జాలి చూపలేదు. కక్కలపల్లిలో జరిగే టమోటా మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి 2 వేల వాహనాల్లో రైతులు సరకు తీసుకొస్తారు. ప్రజాప్రతినిధి సోదరుడు తన బంధువుని పెట్టి అక్రమంగా టోల్‌ వసూలుకు పాల్పడుతున్నారు. రోజుకు లక్ష రూపాయల చొప్పున దోచుకుంటున్నారు.

వైఎస్సార్​సీపీ నేతల భూదాహం, ఖాళీ జాగాపై కన్నుపడిందంటే అంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.