ETV Bharat / politics

సకుటుంబ స'మేత' పర్వం - దోపిడీలో పతిని మించిన సతి, ఇసుక మేస్తున్న పుత్రరత్నం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2024, 12:49 PM IST

ycp_leaders_family_anarchy
ycp_leaders_family_anarchy

YCP Leader Family Anarchy in Srikakulam District: కష్టం చేసుకునే ఇళ్లలో కుటుంబ సభ్యులు సంపాదనలో పోటీపడతారు! శ్రీకాకుళం జిల్లాలోని ఓప్రజాప్రతినిధి కుటుంబం మాత్రం దోపిడీలో పోటీపడుతోంది. పతిది అధికార బలమైతే సతిది బెదిరించే గళం! పుత్రరత్నానిదేమో వసూళ్ల వ్యాపారం.! ఎన్నాళ్లకో దక్కిన పదవిని అడ్టుపెట్టుకుని అక్రమార్జనలో సునామీ సృష్టిస్తున్నారు. సకుటుంబ సమేతంగా సెటిల్మెంట్లు చేసుకుంటూ, ఎదురు తిరిగిన వారిని బెదిరిస్తూ, నచ్చిన భూముల్ని కాజేస్తూ కోట్లు పోగేసుకుంటున్నారు.

సకుటుంబ స'మేత' పర్వం - దోపిడీలో పతిని మించిన సతి, ఇసుక మేస్తున్న పుత్రరత్నం

YCP Leader Family Anarchy in Srikakulam District: శ్రీకాకుళం జిల్లాలో ఓ నియోజకవర్గ వైసీపీ ప్రజాప్రతినిధి కుటుంబం భూకబ్జాలు, సెటిల్మెంట్లతో చెలరేగుతోంది. రాకరాక వచ్చిన అధికారంతో ఆ ప్రజాప్రతినిధి దోపిడీలకు అడ్డూ అదుపూలేకుండా పోయింది. గత సార్వత్రిక ఎన్నికలప్పుడు ఖర్చుల కోసం అమ్మిన నాలుగెకరాలు తిరిగి లాక్కోవడం ద్వారా ఆయన అరాచకపర్వం ఆరంభించారు. భూమి కొనుగోలుదారుల్ని పిలిపించి తన భూమి తనకు వెనక్కి ఇస్తారా? కేసులు పెట్టించమంటారా? అని భయపెట్టారు. ఎందుకొచ్చినగొడవంటూ కొనుగోలుదారులు నామమాత్రపు డబ్బు తీసుకుని ఆ భూమి పత్రాలు ప్రజాప్రతినిధికి తిరిగి ఇచ్చి వెళ్లిపోయారు.

నియోజకవర్గ కేంద్రంలోని ప్రఖ్యాత మఠం భూములపైనా ఆయన కన్నుపడింది. 300 ఎకరాల మఠం భూముల్లో కొంత భాగం పలువురు స్థిరాస్తి వ్యాపారులు ఇతర వ్యక్తుల చేతుల్లో ఉంది. ఆ ప్రజాప్రతినిధి సంబంధిత వ్యక్తుల్ని పిలిపించారు. తనకు 25 శాతం వాటా ఇవ్వాలంటూ అల్టిమేటం ఇచ్చారు. ఆయనతో వేగలేక కొందరు దండం పెట్టేశారు. 3ఎకరాలను 10కోట్ల రూపాయలకే ముట్టజెప్పారు. అక్కడ ఎకరా 10 కోట్ల రూపాయలపైనే పలుకుతుండడంతో తమ వాటా ఇవ్వటానికి కొందరు నిరాకరించారు. నేను అడిగిందే కాదంటారా అని స్థలం ఇవ్వని వారి అపార్ట్‌మెంట్లకు కరెంటు కట్‌ చేయించి తన ప్రతాపం చూపించారు. తన చేతికి మట్టి అంటకుండా చేసే అరాచకాలకూ అంతేలేదు.

వైసీపీ నేతల భూ దాహానికి బలైన యువకుడు - రాష్ట్రంలో తీవ్ర కలకలం!

దేవత సొమ్మునూ వదల్లేదు: పీఏసీఎస్ డైరెక్టర్‌ గా వ్యహరిస్తున్న తన బినామీతో ఓ చెరువు గర్భంలో 5 ఎకరాలు ఆక్రమించారు. దాన్ని స్థిరాస్తి లే అవుట్లుగా మార్చేసి విక్రయించేశారు. ఈ వ్యవహారంలో సదరు ప్రజాప్రతినిధికి కోటి రూపాయల వరకూ గిట్టుబాటైంది. దేవత సొమ్మునూ ఆయన వదల్లేదు. గ్రామదేవతకు సంబంధించిన బంగారం, వెండి నగలు, డబ్బుల్ని భద్రపరిచిన లాకర్‌ తాళాలు ఇవ్వాలంటూ పాలక మండలి సభ్యులపై ప్రజాప్రతినిధి ఒత్తిడి తెచ్చారు. ఇద్దరు సభ్యులు తాళాలు ఇచ్చేయగా ఒకరు మాత్రం బెదిరించినా లొంగలేదు. ఆగ్రహించిన ప్రజాప్రతినిధి ఆఘమేఘాలపై పాత కార్యవర్గాన్ని రద్దు చేయించి కొత్తది ఏర్పాటు చేయించారు. కొత్త సభ్యులంతా తమవద్దనున్న మూడు తాళాలు తక్షణమే ప్రజాప్రతినిధికి అప్పగించాలని తీర్మానం చేశారు.

అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు: ఉద్యోగులు పని చేసుకోవాలంటే ఆ ప్రజాప్రతినిధి చెప్పినట్లు నడుచుకోవాల్సిందే లేదంటే సెలవుపై వెళ్లిపోవాల్సిందే. సదరు ప్రజాప్రతినిధి నియోజకవర్గ కేంద్రంలో తన బినామీతో ప్రభుత్వ హెల్త్‌ సెంటర్‌ భవనాన్ని నిర్మించి ప్రారంభించారు. ఐతే ఆ స్థలంలో అంతకు ముందు ఎస్సీ సంక్షేమ వసతిగృహం ఉండేది. అనుమతులు లేకుండానే దాన్ని తొలగించి, హెల్త్‌సెంటర్‌ కట్టడంతో బిల్లులు మంజూరు కాలేదు. ఈ విషయంలో మున్సిపల్‌ కమిషనర్, తహసీల్దార్‌లపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. అది తమ పరిధి కాదని ఎస్సీ సంక్షేమ శాఖ నుంచి అనుమతులు తెచ్చుకోవాలని చెప్పినా వినిపించుకోకుండా వేధించారు. ఆయనతో వేగలేక కొన్నాళ్ల క్రితం మున్సిపల్‌ కమిషనర్‌ 4 నెలలపాటు మెడికల్‌ లీవ్‌ పెట్టి వెళ్లిపోయారు.

నియోజకవర్గ పరిధిలోని ప్రముఖ దేవస్థానానికి భూములు జాతీయ రహదారికి పక్కనే భూములున్నాయి. వాటిపై కన్నేసిన ప్రజాప్రతినిధి ఆ భూముల్ని తన పరం చేయాలని అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. నా వల్లకాదంటూ స్థానిక తహసీల్దార్‌ అప్పట్లో సెలవుపై వెళ్లిపోయారు. నాగావళి, వంశధార నదుల అనుసంధాన పనుల్లో భాగంగా నియోజకవర్గంలోని ఐదు కిలోమీటర్ల పరిధిలో కాలువ తవ్వాల్సి ఉంది! ఐతే అక్కడ దేవాదాయ శాఖ, స్థానిక రైతుల మధ్య యాజమాన్య వివాదం తలెత్తింది. సదరు ప్రజాప్రతినిధి జోక్యం చేసుకుని రైతులకు పరిహారమిప్పించారు. సందట్లో సడేమియా అన్నట్లు తన బినామీల పేర్లు జాబితాలో చొప్పించి ఆ పరిహారంలో రూ.80 లక్షల వరకూ వెనకేసుకున్నారు. నియోజకవర్గ కేంద్రంలో సదరు ప్రజాప్రతినిధికి ఒక ప్రైవేటు కళాశాల ఉంది. ఐతే పోటీగా ఉన్న 4ప్రైవేటు జూనియర్, డిగ్రీ కళాశాలలను మూసేయించారు.

ప్రాజెక్టులు, కాంట్రాక్టులే కాదు విద్యుత్‌ కూడా జగన్ అస్మదీయులకే!- ఏకంగా 47వేల కోట్ల దోపిడీ

ఆవిడ రంగంలోకి దిగిందంటే అంతే సంగతులు: దోపిడీల్లో భర్తను మించిపోయారు సదరు ప్రజాప్రతినిధి సతీమణి. ఎవరిపైనైనా ఆమె నోరేసుకుని పడిపోతారు. ఆమె పేరెత్తితేనే నియోజకవర్గంలో ఎవరైనా బెదిరిపోయే పరిస్థితి. భూ వివాదాల్లో తలదూర్చి సెటిల్‌మెంట్లు చేయడంలో ఆమె ఘనాపాటి. నియోజకవర్గ కేంద్రంలో 4 కోట్ల రూపాయల విలువైన 20 సెంట్ల ప్రైవేటు స్థలం విషయంలో ఓ కుటుంబ సభ్యుల మధ్య వివాదం తలెత్తింది. ఇందులోకి ప్రజాప్రతినిధి సతీమణి చొరబడ్డారు. ఆ స్థలం వారెవరికీ చెందనీయకుండా తన బినామీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. బదులుగా డబ్బులు అడిగితే దిక్కున్న చోట చెప్పుకోవాలంటూ బెదరగొట్టారు.

నియోజకవర్గ కేంద్రంలోని ఓ చెరువు గర్భంలో అక్రమంగా నిర్మించిన కల్యాణ మండపం నుంచీ సొమ్ముచేసుకున్నారు. కూల్చేయాలంటూ అక్కడికి అధికారుల్ని పంపించారు. ఆ యజమాని ఆమెకు భారీగా నగదు ముట్టజెప్పాక అధికారులు ఆ భవనం జోలికి వెళ్లకుండా వదిలేశారు. నియోజకవర్గ పరిధిలోని ఓ మిల్లు యజమానుల మధ్య నెలకొన్న కుటుంబ తగాదాలతో మూతపడింది. ప్రస్తుతం దాన్ని ఎరువుల గోదాముగా వినియోగిస్తున్నారు. అది రహదారిని ఆనుకునే ఉండటంతో ఆ స్థలం విలువ కోట్లలో పలుకుతోంది. సదరు ప్రజాప్రతినిధి సతీమణిని దానిపై కన్నేశారు. వివాదం పరిష్కరిస్తానంటూ బాధిత కుటుంబ సభ్యుల్ని పిలిపించారు. తీరా అక్కడికి వెళ్లాక ఆ మిల్లు తమకు ఇచ్చేయాలని, లేదంటే కేసులు పెడతామని హెచ్చరించారు. చివరకు అది కూడా తన అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.

భర్త అధికారాన్ని సొమ్ముచేసుకోవడంలో ఆమె స్టైలేవేరు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, దుకాణాలు, కొత్త వ్యాపారాలు, ఏవి ప్రారంభించాలన్నా ప్రజా ప్రతినిధి భార్య అనుమతి ఉండాల్సిందే. తొలుత ఆమెను కలిసి కనీసం 2తులాల బంగారం కానుకగా సమర్పించుకోవాల్సిందే అలాగైతేనే ప్రారంభోత్సవాలకు సదరు ప్రజాప్రతినిధిని పంపిస్తారు. ప్రభుత్వ భవనాలు నిర్మించిన గుత్తేదారులు కూడా ముడుపులు సమర్పించుకోవాలి. లేదంటే బిల్లుల్లో కొర్రీలు వేయించి వాటిని నిలిపేస్తున్నారు.

రౌడీల్ని అడ్డం పెట్టుకుని స్థిరాస్తి వ్యాపారం - విశాఖలో పేట్రేగిపోతున్న వైసీపీ నేత

ఉద్యోగాల అమ్మకాలు: నియోజకవర్గంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల విత్తనాభివృద్ధి క్షేత్రం, విద్యుత్తు ఉప కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఒప్పంద కొలువుల్ని అమ్ముకున్నారనే ప్రచారం ఉంది. ఒక్కొక్కరి వద్ద 3 నుంచి 6 లక్షల వరకూ పుచ్చుకున్నారనే ఆరోపణలున్నాయి. కొన్నాళ్ల క్రితం ఈ నియోజకవర్గానికి 10 అంగన్‌వాడీ పోస్టులు మంజూరవగా వాటిని ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి 4 నుంచి 5 లక్షల వరకూ వసూలు చేసుకున్నారు. కొందరికే అంగన్వాడీ పోస్టులు దక్కాయి. మిగతా వారు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే వారిపైనా బెదిరింపులకు దిగారు.

అమ్మ, నాన్నల బాటలోనే తనయుడు: అమ్మ, నాన్నల బాటలోనే ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధి తనయుడు వసూల్‌ రాజాగా మారారు. నియోజకవర్గ పరిధిలోని నాగావళి, వంశధార తీర ప్రాంతాల ఇసుక రేవులపై ప్రజాప్రతినిధి కుమారుడిదే పెత్తనం. రేవుల వద్ద అనుచరుల్ని పెట్టి ఒక్క లారీ నుంచి 3 వేల వరకూ పిండుకుంటున్నారు. రోజుకు సగటున 300 లారీల నుంచి 9 లక్షల వరకూ దండుకుంటున్నారు. ఓ బినామీని పెట్టి వ్యాపారుల నుంచీ నెలవారీ మామూళ్లు వసూలు చేసుకుంటున్నారు. ఎవరైనా ఎదురుతిరిగితే వారిపైకి వివిధ శాఖల అధికారులను పంపించి వేధిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.