ETV Bharat / state

LIVE UPDATES : 'ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క'

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 15, 2024, 10:21 AM IST

Updated : Feb 15, 2024, 6:26 PM IST

Telangana Budget Live Updates : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్​పై ఉభయ సభల్లో చర్చ మొదలైంది.

Telangana Budget Live Updates
Telangana Budget Live Updates

6:22PM

రుణాలు తీసుకోవడంలో దేశంలో చివరి నుంచి నాలుగో స్థానంలో ఉన్నాం : ప్రశాంత్​రెడ్డి

బీఆర్ఎస్ పాలనలో జాతీయ వృద్ధిరేటు కంటే 2.4 శాతం అధిక వృద్ధి రేటు నమోదైందని మాజీమంత్రి ప్రశాంత్​రెడ్డి పేర్కొన్నారు. 2014లో జీఎస్‌డీపీ రూ.5.05 లక్షల కోట్లు ఉండగా ప్రస్తుతం రూ.14.49 లక్షల కోట్లు ఉందన్నారు. ఈసారి పెరిగితే జీఎస్‌డీపీ రూ.16 లక్షల కోట్లకు చేరుతుంది. జీడీపీలో రాష్ట్ర భాగస్వామ్యం 2014లో 4 శాతం కాగా ఇప్పుడు 4.9 శాతంగా ఉంది. రాష్ట్ర తలసరి ఆదాయం 2014లో 1.24 లక్షలు.. ప్రస్తుతం రూ.3.43 లక్షలు ఉంది.

రాష్ట్ర తలసరి ఆదాయంలో మూడో స్థానంలో ఉన్నాం. రాష్ట్ర ఖర్చులో 80 శాతం మన సొంత ఆదాయమే ఖర్చు పెడుతున్నాం. జీఎస్‌డీపీలో అప్పులు 28.2 శాతంగా ఉన్నాయి. రుణాలు తీసుకోవడంలో దేశంలో చివరి నుంచి నాలుగో స్థానంలో ఉన్నాం.గత ప్రభుత్వం రైతులకు రూ.1.85 లక్షల కోట్లు సాయం అందించింది.రాష్ట్రంలో 2.68 కోట్ల ఎకరాలకు పంట విస్తీర్ణం పెరిగింది

6:17PM

ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క

6:14PM

పదేళ్లలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆరోపించడం సరికాదు : ప్రశాంత్​రెడ్డి

పదేళ్లలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆరోపిస్తున్నారని మాజీ మంత్రి ప్రశాంత్​రెడ్డి పేర్కొన్నారు. వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్‌ పెట్టారనడం మంచి ప్రయత్నమే కానీ గతంతో పోల్చుకుంటే రూ.51 వేల కోట్లు అధికంగా బడ్జెట్‌ పెట్టారు. ట్యాక్స్‌ రెవెన్యూలో రూ.20 వేల కోట్లు అధికంగా చూపారు. గతంలో ట్యాక్స్‌ రెవెన్యూ రూ.1.18 లక్షల కోట్లుగా ఉంటే ఇప్పుడు రూ.1.38 లక్షల కోట్లుగా పెట్టారు. ట్యాక్స్‌ రెవెన్యూ ఎక్కువగా పెట్టారనేది నా అభిప్రాయం.

ట్యాక్స్‌ రెవెన్యూ 10.6 శాతం నుంచి ఏకంగా 16.9 శాతానికి పెంచారు.ట్యాక్స్ రెవెన్యూ అసాధారణంగా పెంచారు. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌లో రూ.7 వేల కోట్లు పెంచారు. గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ను 5.8 శాతం నుంచి 15 శాతానికి పెంచారు. ఓపెన్‌ మార్కెట్‌ రుణాలను అసాధారణంగా పెంచారు. రూ.19 వేల కోట్లు ఎక్కువగా అప్పులు తెస్తామని చెప్పారు. గత ప్రభుత్వం అప్పుల భారం మోపిందని ఆరోపిస్తున్నారు.

అప్పుల భారం అంటూనే రూ.20 వేల కోట్లు ప్రతిపాదించారు. బీఆర్ఎస్ అప్పులతో దివాళా తీసి ఉంటే మీకు అప్పులు దొరికేది కాదు. గత అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోందని చెప్పారు. రూ.59 వేల కోట్ల అప్పుల్లో తీర్చే అసలు, వడ్డీ ఎంతో చెప్పాలి. ద్రవ్యలోటు రూ.53 వేల కోట్లుగా చూపారు. ద్రవ్యలోటు 3.2 శాతం చాలా ఎక్కువగా చూపారు

6:05 PM

కేంద్రం పథకాలు మీ పేర్లు పెట్టడం సరికాదు: మహేశ్వర్

రాష్ట్రాలపై పడి కేంద్రం పన్నుల రూపంలో దోచుకుంటుందనడం సరికాదని మహేశ్వర్ అన్నారు. ప్రజలు ఇచ్చిన పన్నుల ద్వారానే ప్రభుత్వాన్ని నడుపుతారన్న ఆయనపీఎం ఆవాస్‌ యోజనకు ఇందిరమ్మ ఇళ్లుగా పేరు పెట్టడం సరికాదన్నారు.


బడ్జెట్​లో తప్పుడు లెక్కలు చూపుతున్నారు : అక్బరుద్దీన్‌

పథకాలకు సంబంధించి కేటాయింపుల వివరాలు ఇవ్వలేదని అక్బరుద్ధీన్ మండిపడ్డారు. బడ్జెట్‌లో తప్పుడు లెక్కలు చూపుతున్నారని ఆరోపించారు. బడ్జెట్‌లో తప్పుడు లెక్కలను సరిచేయాలని వారు కోరారు.

ఆరు గ్యారంటీలకు ఓ పథకానికి ఎంత కేటాయిస్తున్నారు? : కడియం శ్రీహరి

ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో రూ.53196 కోట్లు కేటాయించారని కడియం శ్రీహరి అన్నారు. ఆరు గ్యారంటీల్లో ఏ పథకానికి ఎంత కేటాయిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి బడ్జెట్‌లో కేటాయింపులు చూపారన్నారు.

నిధుల కోసం కేంద్రానికి లేఖ రాస్తాం : భట్టి విక్రమార్క

కేంద్ర పథకాలకు సంబంధించి ప్రధాని ఫొటోలు పెడతామని భట్టి విక్రమార్క తెలిపారు. సమాఖ్య స్ఫూర్తిని కచ్చితంగా గౌరవిస్తామన్నారు. పన్నుల మేరకు రాష్ట్రాలకు నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రానికి నిధుల కోసం కేంద్రానికి లేఖలు రాస్తామని తెలిపారు.

4:45 PM

బడ్జెట్‌ ఫలితాలు చివరి వ్యక్తి వరకు అందాలి: కూనంనేని

ఆదాయ వనరులు పెంపొందించుకోవడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని సీపీఐ కూనంనేని సాంబశివరావు అన్నారు. బడ్జెట్‌లో ఐదారు శాతం తేడా ఉంటే ప్రజలు కూడా నమ్ముతారని తెలిపారు. బడ్జెట్‌ ఫలితాలు చివరి వ్యక్తి వరకు అందాలని కోరారు.

4:39 PM

పథకాల నిధుల వివరాల సమర్పణలో మంత్రి విఫలమయ్యారు: అక్బరుద్దీన్

ఆరు గ్యారంటీల అమలుకు రూ.53 వేల కోట్లు కేటాయించారని, పథకాలకు నిధుల వివరాల సమర్పణలో మంత్రి విఫలమయ్యారని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. పథకాలు, డిమాండ్ల మేరకు నిధుల కేటాయింపులు జరగలేదని తెలిపారు. బడ్జెట్‌ ప్రసంగం, బడ్జెట్‌ పరిమాణానికి నిధుల కేటాయింపులో తేడా ఉందన్నారు. ఈసారి వడ్డీల చెల్లింపులకు రూ.22,750 కోట్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఏప్రిల్‌-జులై కాలానికి రూ.17,742 కోట్ల రుణాలపై స్పష్టత ఇవ్వాలి. ధరణి గురించి బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన లేదుప్రస్తుత ప్రభుత్వం ధరణి కొనసాగిస్తుందా? లేదా? చెప్పాలి. పాతనగరంలో మెట్రో పనులకు శంకుస్థాపన చేయాలని కోరుతున్నా. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు పనులకు శంకుస్థాపన చేయాలి. ఫీజులు చెల్లించలేదని కళాశాలల్లో విద్యార్థులకు ధ్రువపత్రాలు ఇవ్వట్లేదు. కళాశాలలకు ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తే ధ్రువపత్రాలు ఇస్తారు. ధ్రువపత్రాలు ఇవ్వకపోతే విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్లలేని పరిస్థితి మైనార్టీ విద్యార్థులకు సంబంధించి 2018-19 నుంచి బకాయిలు ఉన్నాయి.మైనార్టీ విద్యార్థులకు సంబంధించి రూ.323 కోట్లు బకాయిలు ఉన్నాయి అని అక్బరుద్దీన్ అన్నారు.

విద్యార్థుల పెండింగ్‌ బకాయిలు చెల్లిస్తే ధ్రువపత్రాలు ఇస్తారని, విదేశీ ఉపకారవేతనాలకు సంబంధించి రూ.64 కోట్లు బకాయి ఉందని గుర్తు చేశారు.

4:37 PM

పీఎం ఆవాస్ యోజన నిధులు వాడుకుంటూ ఇందిరమ్మ ఇళ్లు అనడం సరికాదు : మహేశ్వర్ రెడ్డి

మహాలక్ష్మి పథకానికి రూ.14 వేల కోట్లు కావాలని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. డబ్బులు కేటాయించకుండా అన్ని హామీలు నెరవేరుస్తామన్నారని గుర్తు చేశారు. సాగుకు రూ.40 వేల కోట్లు అవసరమైతే రూ.19700 కోట్లు కేటాయించారని, పీఎం ఆవాస్‌ యోజన నిధులు వాడుకుంటూ ఇందిరమ్మ ఇళ్లు అని ఎలా చెబుతారని ప్రశ్నించారు. పీఎం ఆవాస్‌ యోజన ఇళ్లకు వాజ్‌పేయీ పేరు, బొమ్మ పెట్టాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఆర్థికసాయంపై ప్రస్తావనే లేదన్నారు. చేయూత కింద 44 లక్షల మందికి రూ.21 వేల కోట్లపై స్పష్టత లేదని మండిపడ్డారు.

4:08 PM

శాసనసభలో మంత్రి వ్యాఖ్యలు సరికాదు: కడియం

శాసనసభలో మంత్రి వ్యాఖ్యలు సరికాదని కడియం శ్రీహరి మండిపడ్డారు. తాను, రేవంత్‌రెడ్డి పూర్వాశ్రమంలో ఒకే పాఠశాలలో చదివామని తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు ఫ్రస్టేషన్‌లో ఏదేదో మాట్లాడుతున్నారని, సభ్యులతో జాగ్రత్తగా ఉండాలని రేవంత్‌ రెడ్డికి సూచిస్తున్నాని అన్నారు. రేవంత్‌కు మా పార్టీ నుంచి ఏరకమైన ఇబ్బంది ఉండదని, తన పార్టీ వారితో జాగ్రత్తగా ఉండాలి చెప్పారు.

4:04 PM

బీఆర్ఎస్​ ప్రతిపక్షం కాదు ఫ్రస్టేషన్​ కాదు : కోమటిరెడ్డి

గతంలో మీరు మోసగించినట్లు మేమూ మోసగిస్తామనడం సరికాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మీది ప్రతిపక్షం కాదు ఫ్రస్టేషన్‌ పక్షమని ఎద్దేవా చేశారు. నల్గొండలో హోంగార్డు చనిపోతే బాధిత కుటుంబాన్ని ఆదుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక మొదటి సీఎం దళితుడే అని కేసీఆర్‌ చెప్పారని గుర్తు చేశారు. ఆ హామీ ఎక్కడ పోయిందని అడిగారు.

4:02 PM

ఉద్యోగాల నోటిఫికేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది: మంత్రి పొన్నం

కొత్తగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు . గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఉద్యోగాలకు సంబంధించి న్యాయ వివాదాలు పరిష్కరించి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కొత్తగా టీఎస్‌పీఎస్సీ కమిషన్‌ను నియమించామన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు

4:00 PM

2లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి :కడియం

కొత్త ప్రభుత్వం తామే ఉద్యోగాలు ఇచ్చినట్లు చెబుతున్నారని కడియం మండిపడ్డారు. గత ప్రభుత్వం నాటి నోటిఫికేషన్లు కాకుండా కొత్తగా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

3:58 PM

యువత జాబ్ క్యాలండర్ కోసం ఎదురు చూస్తున్నారు: కడియం శ్రీహరి

గతేడాది ద్రవ్యలోటు రూ.33 వేల కోట్లుగా ఉందని కడియం శ్రీహరి అన్నారు. ఈసారి బడ్జెట్‌లో ద్రవ్యలోటు భారీగా కనబడుతోందని ప్రశ్నించారు. 2లక్షల ఉద్యోగాలను ఏ విధంగా భర్తీ చేయాలి అనుకుంటున్నారో తెలియాలి అని కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ యువత ప్రభుత్వం విడుదల చేసే జాబ్ క్యాలండర్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు.

3:53 PM

ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై సభ్యులు సంతృప్తి చెందుతారని ఆశిస్తున్నానని భట్టి అన్నారు.

3:48 PM

కేంద్రం నుంచి నిధులు సాధించేందుకు కృషి చేస్తాం: భట్టి

పాతనగరంలో మెట్రో పనులపై సీఎం ఇప్పటికే సమీక్షించారని తెలిపారు. మెట్రో పనులకు సంబంధించి ఇప్పటికే సీఎం ఆదేశించారన్నారు. కేంద్ర నిధులు సాధించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

3:46 PM

సాంఘిక సంక్షేమ కోసం బడ్జెట్‌లో రూ.5815 కోట్లు

గిరిజన సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ.2800 కోట్లు

పంచాయతీరాజ్‌ శాఖ కోసం రూ.40 వేల కోట్లు

3:41 PM

'ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నాం'

ఆరు గ్యారంటీలకు బడ్జెట్‌లో రూ.53 వేల కోట్లు

రైతు భరోసా కోసం బడ్జెట్‌లో రూ.15,075 కోట్లు

ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు మంజూరు చేస్తాం

ఇందిరమ్మ ఇళ్ల కోసం బడ్జెట్‌లో రూ.7740 కోట్లు క

ఎల్​పీజీ సిలిండర్​ కోసం రూ.723 కోట్లు

గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్‌ కోసం రూ.2418 కోట్లు కేటాయిస్తున్నాం

3:40 PM

రాష్ట్ర యువత కోసం కృషి చేస్తున్నాం : భట్టి

యువత కలల సాకారం కోసం ప్రభుత్వం కృషిచేస్తుందని భట్టి అన్నారు. పోలీసు నియామక సంస్థ ద్వారా 13,444 పోస్టుల భర్తీ పూర్తి చేశామని తెలిపారు.

3:37 PM

టీఎస్​పీఎస్సీకి రూ.40 కోట్లు మంజూరు చేశాం : భట్టి

పదేళ్లుగా గ్రూప్‌-1 ఉద్యోగాల కోసం యువత ఎదురుచూశారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేసి అదనపు సిబ్బందిని ఇచ్చామని తెలిపారు. టీఎస్‌పీఎస్సీకి ఇప్పటికే రూ.40 కోట్లు మంజూరు చేశామన్నారు. గ్రూప్‌-1లో 503 పోస్టులకు అదనంగా 64 పోస్టులు మంజూరు చేశామని స్పష్టం చేశారు.

3:35 PM

'రాష్ట్రం అప్పులు రూ.7.11 లక్షల కోట్లు'

రాష్ట్రంపై మొత్తం రూ.7.11 లక్షల కోట్లు అప్పుల భారం ఉందని భట్టి తెలిపారు. బడ్జెట్‌, బడ్జెటేతర రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం కింద చూస్తామని కేంద్రం చెప్పిందని, ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి మేరకు గతంలో రుణాలు కుదించారని చెప్పారు.

3:29 PM

గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టేందుకు అప్పులు చేయక తప్పడం లేదు: భట్టి

గతంలో మైనార్టీ, బీసీ, ఎస్సీ కార్పొరేషన్‌ రుణాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే చేసిన అప్పులు కట్టేందుకు అప్పులు చేయక తప్పట్లేదని అన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధి మేరకు రుణాలు తీసుకుని ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

3:26 PM

వాస్తవాలకు దూరంగా భ్రమలు కల్పిస్తే చాలా ప్రమాదం : భట్టి

గతంలో మాదిరిగా 20 శాతం అధికంగా బడ్జెట్‌ పెడితే ప్రమాదం అని అన్నారు. వాస్తవాలకు దూరంగా భ్రమలు కల్పిస్తే ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు.

3:23 PM

బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేశారు: భట్టి

రాజస్థాన్‌లో 116.4 శాతం అధికంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టారని, రాజస్థాన్‌లో బడ్జెట్‌ కంటే అధికంగా ఖర్చులు పెట్టారని తెలిపారు. వాళ్లు రూ.2.5 లక్షల కోట్లు బడ్జెట్‌ పెడితే రూ.2.9 లక్షల కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు.

3:20 PM

గత ప్రభుత్వంలో హామీలు, అవసరాల మేరకు ఖర్చు పెట్టలేని పరిస్థితి: భట్టి

2023-24లోనూ రూ.70 వేల కోట్ల తేడాతో బడ్జెట్‌ పెట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, అవసరాల మేరకు ఖర్చు పెట్టలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. బడ్జెట్‌ మేరకు డబ్బులు లేకపోతే ఖర్చు పెట్టకుండా ఎత్తేస్తారని తెలిపారు

3:18 PM

ఆదాయం బట్టి వ్యయం ఉండాలి: భట్టి విక్రమార్క

ఆదాయం, వ్యయం మేరకు బడ్జెట్‌ ఉండాలనేది మా ఆలోచన: భట్టి విక్రమార్క

3:14 PM

వాస్తవాలకు అనుగుణంగా చూడకుండా గతంలో బడ్జెట్ పెట్టారు

వాస్తవాలకు అనుగుణంగా చూడకుండా గతంలో బడ్జెట్‌ పెట్టారని తెలిపారు. బడ్జెట్‌ మేరకు ఆదాయం, వ్యయం ఉండాలని వారి ఆలోచన అన్నారు. బడ్జెట్‌ కేటాయింపులకు 5 శాతానికి మించి తేడా లేకుండా చూడాలని పేర్కొన్నారు. గతంలో తెలంగాణ బడ్జెట్‌ రూ.3 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఈసారి బడ్జెట్‌ రూ.2.75 లక్షల కోట్లుగా ప్రవేశపెట్టారని, బడ్జెట్‌ తగ్గిస్తున్నారని చాలా మంది అడిగారని తెలిపారు.

3:12 PM

బడ్జెట్‌పై చర్చకు ఆర్థిక మంత్రి సమాధానం

సామాజిక సమానత్వంలో భాగంగా బడ్జెట్‌లో కేటాయింపులు చేశామని మంత్రి భట్టి వ్రిక్రమార్క అన్నారు. తెలంగాణలో ఆర్థిక, సామాజిక అసమానతలు ఉన్నాయని తెలిపారు. అసమానతలు తొలగించేందుకు బడ్జెట్‌లో కృషి చేశామన్నారు. గతంలో బడ్జెట్‌లో కేటాయింపులకు నిధులు అందని పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. పథకాలు, హామీల మేరకు వాస్తవ బడ్జెట్‌ రూపొందించామని తెలిపారు. గతంలో ఏటా బడ్జెట్‌ను 20 శాతం పెంచుకుంటూ పోయారని చెప్పారు.

11:42 AM

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కాగ్ నివేదిక

రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై నివేదిక ఇచ్చిన కాగ్‌. 2022 మార్చి నాటికి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై నివేదిక ఇచ్చిన కాగ్ రెవెన్యూ రాబడి ఎక్కువ చూపి.. రెవెన్యూ లోటు తక్కువ చూపారని విద్య, వైద్యం మీద ఖర్చులో రాష్ట్రం వెనుకబడి ఉందని కాగ్ నివేదిక తెలిపింది. మెుత్తం వ్యయంలో విద్య మీద కేవలం 8 శాతం ఖర్చు చేశారని, మొత్తం వ్యయంలో ఆరోగ్యం మీద 4 శాతమే ఖర్చు చేశారు కాగ్ నివేదిక వెల్లడైంది.

ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తులు, అప్పుల పంపకంపై పురోగతి లేదు. విభజన ఆస్తుల పంపకాల విషయమై తగినంత దృష్టి లేదంది. రూ.1.18 లక్షల కోట్లు బడ్జెట్‌ వెలుపలి రుణాలను బడ్జెట్‌లో వెల్లడించలేదని, బడ్జెట్‌ వెలుపలి రుణాలు జీఎస్‌డీపీ అప్పుల నిష్పత్తిపై ప్రభావం ఉంటుందని తెలింది. అప్పుల ద్వారానే రెవెన్యూ లోటును భర్తీ చేయాల్సి వచ్చింది పేర్కొంది. రుణాలపై వడ్డీలకు 2032-33 నాటికి రూ.2.52 లక్షల కోట్లు చెల్లించాల్సి వస్తుందని వెల్లడించింది. ఈ ఆర్థికభారం ప్రభుత్వాన్ని గణనీయమైన ఒత్తిడికి గురిచేస్తుందని, బడ్జెట్‌ కేటాయింపులతో పోలిస్తే సంక్షేమ పథకాలపై ఖర్చులో తగ్గుదల ఉందని తెలిపింది.

10.45 AM

కాళేశ్వరంపై కాగ్‌ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం

కాగ్ నివేదికలను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికి ప్రయోజనాల్లో అదనపు పెరుగుదల లేదని కాగ్ నివేదికలో పేర్కొంది. విద్యుత్ వినియోగానికి ఏటా రూ.3,555 అదనపు వ్యయం పెరిగిందని తెలిపింది. రీ ఇంజినీరింగ్‌, మార్పుల వల్ల అప్పటికే చేసిన కొన్ని పనులు నిరర్థకం అయ్యాయని, ఫలితంగా రూ.765 కోట్ల నష్టం వాటిల్లిందని స్పష్టం చేసింది.పనుల అప్పగింతలో నీటిపారుదల అనుచిత తొందరపాటు ప్రదర్శించిందని వివరించింది.

డీపీఆర్‌ ఆమోదానికి ముందే రూ.25,000ల కోట్ల విలువైన 17 పనులు అప్పగించారని కాగ్‌ నివేదికలో తెలిపింది. డీపీఆర్‌ ఆమోదం తర్వాత కూడా ప్రాజెక్టు పనుల్లో మార్పులు చేశారని పేర్కొంది. అవసరం లేకున్నా కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు చేపట్టారని, అదనపు టీఎంసీ వల్ల రూ.25,000ల కోట్ల అదనపు వ్యయం జరిగిందని వివరించింది. సాగునీటిపై మూలధనం వ్యయం ఒక్కో ఎకరానికి రూ.6.42 లక్షలు అవుతుందని వెల్లడించింది.

ప్రాజెక్టు ప్రయోజన, వ్యయ నిష్పత్తి 1.51 గా అంచనా వేశారని, కానీ ప్రాజెక్టు ప్రయోజన, వ్యయ నిష్పత్తి 0.75గా తేలుతోందని వివరించింది. ప్రాజెక్టు ప్రయోజన, వ్యయ నిష్పత్తి మరింత తగ్గే అవకాశముందని తెలిపింది.లోతైన భూకంప సంబంధిత అధ్యయనాలు చేయకుండానే మల్లన్నసాగర్ నిర్మించారని కాగ్‌ నివేదికలో ఆక్షేపించింది.

10.35 AM

కాగ్ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం

కాగ్ నివేదికలను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అసెంబ్లీ ముందు కాగ్ నివేదికలను మంత్రి భట్టి విక్రమార్క ఉంచనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆడిట్, రాష్ట్ర ఆర్థికరంగంపై కాగ్ నివేదిక ఇచ్చింది. రెవెన్యూ, జనరల్, సోషల్, ఆర్థిక రంగాలతో పాటు, పీయూసీలు, స్థానిక సంస్థలు, డీబీటీ ద్వారా ఆసరా పింఛన్లపై కాగ్ ప్రభుత్వానికి నివేదికలు సమర్పించింది.

10.29 AM

సభ జరగనప్పుడు మాత్రమే మీడియా పాయింట్‌ వినియోగించాలి : స్పీకర్‌

సభ జరుగుతుంటే మీడియా పాయింట్‌లో మాట్లాడవద్దని సభాపతి గడ్డం ప్రసాద్​కుమార్ సభ్యులకు తెలిపారు. సభ జరగనప్పుడు మాత్రమే మీడియా పాయింట్‌ వినియోగించాలని సూచించారు. సభ వాయిదా పడినప్పుడే మీడియా పాయింట్‌లో మాట్లాడాలని అన్నారు. ముందస్తు అనుమతి లేకుండా అసెంబ్లీలో మొబైల్, ఎలక్ట్రానిక్ పరికరాలు వాడొద్దని, అలాగే అనుమతి లేకుండా వీడియోలు, ఫొటోలు ప్రదర్శించవద్దని స్పీకర్ పేర్కొన్నారు.

10:25 AM

రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి : ఎమ్మెల్సీ కవిత

సచివాలయం ప్రాంగణంలో రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు నిర్ణయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని తెలిపారు. ఈ అంశాన్ని సభలో లేవనెత్తడానికి కవిత మండలి ఛైర్మన్ అనుమతి కోరారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించిందని, ఆ స్థానంలో రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం సరికాదని చెప్పారు. దేశానికి చేసిన సేవల రీత్యా రాజీవ్‌గాంధీ పట్ల తమకు గౌరవం ఉందని అన్నారు. కానీ తెలంగాణకు తెలంగాణ తల్లి అత్యంత ముఖ్యమని, సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని కవిత వివరించారు.

10:20 AM

పోడు భూముల సమస్య సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు

ఆదిలాబాద్‌ జిల్లాలో చాలా ప్రాంతాలకు సాగునీరు అందట్లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు మిషన్‌ భగీరథ ద్వారా నీరు అందలేదని, ఉట్నూరు ప్రాంతంలో వైద్య సదుపాయాలు బాగా లేవని చెప్పారు. ఉట్నూరు ప్రాంతంలో చాలా ఆస్పత్రుల్లో వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయని సభ దృష్టికి తీసుకువచ్చారు. పోడు భూముల సమస్య సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆయన కోరారు.

10:15 AM

జీరో అవర్‌లో కొత్త సభ్యులకు అవకాశం కల్పించిన సభాపతి

అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. జీరో అవర్‌లో కొత్త సభ్యులకు సభాపతి అవకాశం కల్పించారు.

Telangana Budget Live Updates : ఓటాన్ అకౌంట్ బడ్జెట్, ద్రవ్య వినిమయ బిల్లుపై నేడు ఉభయ సభల్లో చర్చ జరుగుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల కాలానికి ఈనెల 10న రాష్ట్ర ప్రభుత్వం ఓట్‌ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. జులై నెల వరకు అవసరాల కోసం రూ.78,911 కోట్ల పద్దును ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రతిపాదించారు. దానిపై ఇవాళ శాసనసభ, మండలిలో చర్చ జరుగుతోంది.

Last Updated : Feb 15, 2024, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.