ETV Bharat / state

గిట్టుబాటు ధర కోసం పల్లి రైతుల కష్టాలు - చోద్యం చూస్తున్న మార్కెటింగ్​ శాఖ

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 16, 2024, 2:08 PM IST

Farmers Demand for Minimum Support Price
GroundNut Farmers Protest for Price In Mahabubnagar

GroundNut Farmers Protest for Price In Mahabubnagar : మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని గమనించారు. ధరలు భారీగా పెరిగినా లెక్కచేయకుండా విత్తనాలు కొని నాటారు. ఆరుగాలం శ్రమించి పంట సాగు చేశారు. కానీ డిమాండ్​కు తగ్గ ధర వస్తుందని ఆశించి అమ్మబోతే వ్యాపారుల మోసాలతో కనీసం పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి. ఇదీ రాష్ట్రంలో ప్రస్తుతం వేరుశనగ రైతుల దుస్థితి. చేసిన కష్టం అంతా వ్యాపారుల మాయాజాలం వల్ల వృథా కావడంతో అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ధర్నాలు, రాస్తారోకోలతో రైతులు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా పల్లి రైతుల నిరసనలే. ఆదుకోవాల్సిన మార్కెటింగ్​ శాఖ చోద్యం చూడటమే ఈ పరిస్థితికి కారణం.

గిట్టుబాటు ధర కోసం పల్లి రైతుల కష్టలు - వెల్లువెత్తుతున్న నిరసనలు

GroundNut Farmers Protest for Price In Mahabubnagar : కష్టం అంతా వీరిదే అన్నట్లు తయారైంది రాష్ట్రంలో పల్లి రైతుల పరిస్థితి. ఎంతో కష్టపడి పంట పండిస్తే గిట్టుబాటు ధర కాదు కదా, కనీసం పెట్టిన పెట్టుబడి కూడా దక్కక వేరుశనగ రైతులు దిగాలుమంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్​నగర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, బాదేపల్లి సహా పలు మార్కెట్లలో పల్లి రైతులది ఇదే పరిస్థితి. దీనికి కారణం మార్కెట్లలో వ్యాపారులు చేస్తున్న మోసాలే. వ్యాపారులు పల్లి నాణ్యతను పరిశీలించడానికి నిబంధనలు పాటించకుండానే దాన్ని చేతితో తీసుకుని ధర నిర్ణయించడమే రైతుల ఆగ్రహానికి కారణం.

ఒకే రైతుకు చెందిన రెండు కుప్పలకు రెండు వేర్వేరు ధరలను నిర్ణయిస్తున్నారు. ఇలా పరిశీలించే క్రమంలో తోచిన ధరలు ఇస్తూ రైతులను మోసం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే కనీసం పెట్టుబడి కూడా దక్కక అన్నదాతలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆందోళన బాట పట్టారు. గిట్టుబాటు ధరల కోసం రాస్తారోకోలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. అచ్చంపేటలో వేరుశెనగ రైతులు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ అరుణపైనే దాడికి దిగారు. ఆవరణలోని వేరుశెనగ కుప్పల వద్దకు లాక్కెళ్లారు. కార్యాలయం ఫర్నిచర్​ను ధ్వంసం చేశారు.

పట్టణంలోని ప్రధాన రహదారిపై అంబేడ్కర్ కూడలిలో బైఠాయించి నిరసన తెలిపారు. కల్వకుర్తిలో మార్కెట్ సిబ్బందిని నిలదీశారు. కోదాడ-రాయచూర్ రహదారిపై హైదరాబాద్ కూడలి వద్ద బైఠాయించి 4 గంటల పాటు వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. మహబూబ్​నగర్లోనూ వ్యవసాయ మార్కెట్​లోని ఫర్నిచర్​ను ధ్వంసం చేశారు. తెలంగాణ కూడలిలో ధర్నా చేపట్టారు. రాత్రి వరకూ ఆందోళన నిర్వహించారు. కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర 6 వేల 377 రూపాయల కంటే అన్ని వ్యవసాయ మార్కెట్లో అధిక ధరలు పలుకుతున్నా గిట్టుబాటు కావడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Farmers Demand for Minimum Support Price : ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేరుశనగ వచ్చే మార్కెట్లన్నీ దాదాపుగా ఈ-నామ్ మార్కెట్లే. ఈ మార్కెట్లలో అమ్మే పంటను రాష్ట్రంలోని ఏ మార్కెట్ నుంచైనా, ఇతర రాష్ట్రాల నుంచైనా వ్యాపారులు కొనుగోలు చేయవచ్చు. ఎంతమంది వ్యాపారులు ఉంటే పోటీ అంత తీవ్రంగా ఉంటుంది. రైతుకు మంచి ధర దక్కుతుంది. కాని ఈ-నామ్ మార్కెట్ వ్యవస్థ పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం వల్ల స్థానిక వ్యాపారులే పంటను కొనుగోలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల వ్యాపారులు కూడా కొనుగోలు చేస్తున్నా స్థానిక కమిషన్ ఏజెంట్లు, వ్యాపారుల ద్వారానే కొంటున్నారు. దీంతో స్థానికంగా వ్యాపారులు నిర్ణయించిందే ధరగా మారుతోంది.

ఈ-నామ్ మార్కెట్లలో పంట నాణ్యతను నిర్ణయించడానికి గ్రేడింగ్ ల్యాబ్​లు ఉంటాయి. అక్కడ వేరుశనగ నాణ్యతను నిర్ణయించి ఆన్లైన్లో నమోదు చేస్తే దాన్ని బట్టి వ్యాపారులు ధరలు నిర్ణయించుకోవాలి. కాని దాదాపు అన్ని మార్కెట్లలో వేరుశనగ నాణ్యతను నిర్ధారించే పరికరాలు లేవు. దీంతో పంట నాణ్యతను కూడా వ్యాపారులే స్వయంగా చూసి, పల్లీని చేతితో నలిపి నూనె శాతాన్ని పరీక్షిస్తున్నారు. తాము అనుకున్న గ్రేడ్​ ప్రకారమే ధరలను నిర్ణయిస్తున్నారు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వ్యాపారులు కొనేందుకు ముందుకు వచ్చినా స్థానిక వ్యాపారులు చెప్పిందే నాణ్యత. ఇలా నాణ్యత పేరుతో పంటకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

వ్యవసాయ మార్కెట్లకు జనవరి నుంచి వేరుశనగ రాక ప్రారంభమవుతుంది. ఈ ఏడాది జనవరిలో క్వింటా గరిష్ఠ ధర 8 వేల రూపాయలకు పైనే పలికింది. ఫిబ్రవరి మాసానికి వచ్చే సరికి గరిష్ఠ ధరలు 7 వేల లోపునకు పడిపోయాయి. సగటు ధర ఎంఎస్పీ(MSP) కంటే అధికంగా ఉన్నా కనిష్ఠ ధరలు 3 వేల నుంచి 4 వేల మధ్య ఉన్నాయి. గత ఏడాది జనవరిలో క్వింటా వేరుశనగ గరిష్ఠ ధర 8 వేల 500 రూపాయలకు పైనే ఉంది. ఈ ఏడాది ధరలు తగ్గాయి. కనిష్ట, గరిష్ఠ ధరల మధ్య తేడా ఉండడం సహా, గత ఏడాదితో పోలిస్తే ధరలు తగ్గడంపైనే రైతులు ఆగ్రహానికి లోనవుతున్నారు. నాణ్యత పేరిట వ్యాపారులు కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగానే ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

Farmers Protest for Peanuts Price Minimum Support Price : బహిరంగ మార్కెట్​లో ప్రస్తుతం వేరుశనగకు మంచి డిమాండ్ ఉన్నా రైతులకు తక్కువ ధరలెందుకు ఇస్తున్నారన్నది వారి ప్రశ్న. డిమాండ్ ఎక్కువ ఉందని సాగు చేస్తే ఇంత మోసమా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మహబూబ్ నగర్, నారాయణపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లోనే వేరుశనగ అధికంగా సాగవుతోంది. యాసంగిలో సుమారు రెండున్నల లక్షల ఎకరాల్లో పంట సాగు కావాల్సి ఉండగా అది 2లక్షల ఎకరాల్లోపే పరిమితమైంది. వేరుశనగ సాగు చేయాలంటే ఎకరాకు క్వింటా 12 వేల నుంచి 14 వేల వరకూ వెచ్చించాలి. విత్తనాల కొనుగోలు, నాట్లు వేయడం, కలుపు తీయడం, ఎరువులు, పురుగుల మందులు, పంటను పెరకడం, కాయల్ని వేరుచేయడం, మార్కెట్ తీసుకురావడం వరకూ ఎకరాకు 35 వేల నుంచి 40 వేల వరకూ ఖర్చవుతుంది.

అదీ కాక వేరుశెనగ విత్తే సమయంలో వ్యాపారులు అమాంతం ధర పెంచడంతో క్వింటా వేరుశెనగ విత్తనాలకు రైతులు 13 వేల రూపాయల నుంచి 16 వేల రూపాయల వరకు వెచ్చించారు. ఇలా ఇన్ని వ్యయప్రయాసలకు ఓర్చి పంట పండిస్తే తీరా మార్కెట్లలోకి వచ్చాక సరైన గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రైతులు ఆగ్రహానికి గురవుతున్నారు. బహిరంగ మార్కెట్​లో మంచి డిమాండ్ ఉన్నా వ్యాపారులు తక్కువ ధరలకు కొనుగోలు చేస్తే మార్కెట్ కమిటీలు, అధికారులు ఏవైనా చర్యలు తీసుకుంటున్నారా అంటే వాళ్లు చోద్యం చూస్తున్నారు. అచ్చంపేటలో రైతులు ఆందోళన చేస్తే వ్యాపారులు 6 వేల లోపు పంటకు క్వింటాకు 200 రూపాయలు పెంచారు.

మహబూబ్​ నగర్​లో రాత్రి వరకూ ధర్నా చేస్తే క్వింటాకు 100 రూపాయలు మాత్రమే పెంపు దక్కింది. చేసేమేదీ లేక వ్యాపారులు నిర్ణయించిన ధరకే రైతులు అమ్ముకోక తప్పని పరిస్థితి. క్వింటాకు పలికిన ధరకు రైతులకు పూర్తిగా డబ్బులేమీ రావు. 30 కిలోల బస్తాకు చాట పేరిట రూపాయి 50 పైసలు, దడవాయి పేరిట 4 రూపాయల 50 పైసలు, హామాలీ పేరిట 9 రూపాయల 92 పైసలు, మొత్తం ధరపై 1.75 శాతం కమిషన్ తీసేసి మిగిలిన డబ్బులు రైతుల ఖాతాలో వేస్తారు. పంట సాగు చేయడానికి ముందే రైతులు కమిషన్ ఏజెంట్లు లేదా, వ్యాపారుల నుంచి అప్పులు తీసుకుని ఉంటారు. ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే వారి ద్వారానే మార్కెట్లో అమ్ముతారు.

ఆ అప్పులు, దానిపై వడ్డీ పోను రైతులకు ఏమీ మిగలడం లేదు. అందుకే క్వింటాకు 8 వేల రూపాయలకు పైన ధర పలికితేనే గిట్టుబాటు అవుతుందని రైతులు అంటున్నారు. రాష్ట్రంలో వేరుశెనగ రైతులను ఆదుకోవాలంటే ఇప్పుడు చొరవ చూపాల్సింది ప్రభుత్వమే. మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగి వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట వేయాలి. ప్రభుత్వమే గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేయాలి. లేదా పెట్టుబడి, దిగుబడి, విపణిలో పంట డిమాండ్​ను బోనస్ కింద కొంత మొత్తాన్ని చెల్లించాలి. లేకుంటే వేరుశెనగ రైతుల ఆగ్రహం మరింత కట్టలు తెంచుకునే పరిస్థితి కనిపిస్తోంది.

'వేరుశనగ రైతుల సమస్య పరిష్కరించండి - పంటల బోనస్‌పై క్లారిటీ ఇవ్వండి'

గిట్టుబాటు ధర కోసం భగ్గుమన్న వేరుశనగ రైతులు - మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌పై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.