భారత్ x పాక్ టెస్టు- చేతబడి వల్ల మ్యాచ్​ నుంచి ప్లేయర్ ఔట్! - IND vs PAK Test

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 19, 2024, 2:28 PM IST

IND vs PAK Test

IND vs PAK Test: భారత్‌- పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ఒక యుద్ధాన్ని తలపిస్తుంటుంది. అలాంటి మ్యాచ్‌లో తనకు చేతబడి చేస్తున్నారని భయపడి ఓ పాక్‌ క్రికెటర్‌ మధ్యలో స్వదేశానికి వెళ్లిపోయాడు. మీరు ఆశ్చర్యపోయినా ఇది అక్షరాల నిజం. అసలేం జరిగిందంటే?

IND vs PAK Test: క్రికెట్‌లో కొన్ని ఘటనలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇలా కూడా జరుగుతుందా? అనిపిస్తుంటాయి. సాధారణంగా ఏ ఆటగాడైనా ఒక సిరీస్‌ జరుగుతున్నప్పుడు మధ్యలోనే వైదొలిగితే దానికి గాయమో, వ్యక్తిగత సమస్యలో కారణం అవుతాయి. కానీ ప్రతిష్ఠాత్మకంగా భావించే భారత్- పాకిస్థాన్ టెస్టు సిరీస్​ నుంచి ప్రత్యర్థి జట్టులోని ఓ క్రికెటర్‌ ఎవరూ ఊహించని కారణం చెప్పి వైదొలిగాడు. ఇది 70వ దశకంలో జరిగినా ఇప్పుడు ఆ వివరాలు వెల్లడి కావడం సంచలనంగా మారింది. భారత్‌లో జరిగిన ఆ సిరీస్‌లో తనపై చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఓ స్టార్‌ క్రికెటర్‌ మధ్యలోనే వైదొలిగాడని వెల్లడి కావడం హాస్యాస్పదంగా మారింది.

ఎప్పుడు జరిగిందంటే?
భారత్‌- పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అంటే సాధారణంగా హై ఓల్టేజ్ ఉంటుంది. ఈ ఇరుజట్ల మధ్య పోరును మ్యాచ్‌గా కాకుండా ఓ యుద్ధంలా చూసే అభిమానులు చాలామందే ఉంటారు. రాజకీయ వైషమ్యాలు, సరిహద్దుల్లో పాక్‌ దుందుడుకు చర్యలు ఈ దాయాదుల పోరును మరింత రసవత్తరంగా, ఉత్కంఠగా మార్చేశాయి. ఏడు దశాబ్దాలుగా క్రికెట్‌ మైదానంలో భారత్- పాక్ మధ్య పోరు ఇలాగే కొనసాగుతోంది. అయితే సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా ప్రస్తుతం భారత్‌-పాక్‌ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు.

కానీ, 1979- 80వ దశకంలో ఆరు టెస్టుల సిరీస్‌ కోసం పాకిస్థాన్‌ జట్టు భారత్‌లో పర్యటించింది. ఆసిఫ్ ఇక్బాల్ నాయకత్వంలో పాకిస్థాన్‌ జట్టు సునీల్ గవాస్కర్‌ నేతృత్వంలో భారత జట్టుతో పోటీపడింది. ఈ సిరీస్‌లో టీమ్ఇండియా కంటే పాకిస్థాన్‌ జట్టే బలంగా కనిపించింది. ఇమ్రాన్‌ ఖాన్‌ బౌలింగ్‌లో భీకర ఫామ్‌లో ఉండడం భారత జట్టు ఆ సిరీస్‌లో గెలవడం అసాధ్యంగా కనిపించింది. ఇమ్రాన్ ఖాన్‌కు అప్పట్లోనే భారత్‌లో అశేష అభిమానులు ఉండేవారు.

ఇక ఆ సిరీస్‌లో పాకిస్థాన్ బ్యాటింగ్‌ మూలస్తంభం జహీర్‌ అబ్బాస్‌పై ఆ జట్టు భారీగా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే అంతకుముందు పాక్‌లో భారత్‌తో జరిగిన సిరీస్‌లో అబ్బాస్‌ 176, 235 పరుగులతో రాణించాడు. కానీ భారత్‌లో జరుగుతున్న ఆరు మ్యాచ్‌ల సిరీస్‌లో అయిదు మ్యాచ్‌లు ఆడిన జహీర్‌ అబ్బాస్ చివరి మ్యాచ్​ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు.

అసలేం జరిగిందంటే?
జహీర్ అబ్బాస్‌ చివరి టెస్టు నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. తనకు ఎవరో చేతబడి చేస్తున్నారనే అనుమానంతో అబ్బాస్‌ చివరి టెస్ట్‌ నుంచి వైదొలిగాడు. ఆ సిరీస్‌లో అయిదు మ్యాచులు ఆడిన అబ్బాస్‌ తొమ్మిది ఇన్నింగ్స్​ల్లో ఒక అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు. 20 కంటే తక్కువ సగటుతో పరుగులు చేశాడు. తొలి మూడు మ్యాచుల్లో విఫలమైన తర్వాత జహీర్ అబ్బాస్‌ తన కంటి చూపు సరిగ్గా లేదని భావించాడు. వైద్యులు పరీక్షించిన తర్వాత అంతా బాగానే ఉందని తేలింది. తర్వాత ఆడిన రెండు మ్యాచుల్లోనూ అబ్బాస్‌ విఫలమయ్యాడు. అయితే తాను బ్యాటింగ్‌లో విఫలం కావడానికి బ్లాక్‌ మ్యాజిక్ (చేతబడి) కారణమని అబ్బాస్‌ ఇమ్రాన్‌తో చెప్పాడు. అందుకే చివరి టెస్టు నుంచి అబ్బాస్‌ తప్పుకున్నాడు. నాలుగు దశాబ్దాల తర్వాత ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇక ఈ సిరీస్​ను భారక్ 2 -0 తేడాతో నెగ్గింది.

జహీర్‌ అబ్బాస్‌ కెరీర్
అంతర్జాతీయ క్రికెట్‌లోకి 1969లో అరంగేట్రం చేసిన జహీర్ అబ్బాస్ సుదీర్ఘ కెరీర్‌లో 72 టెస్టులు, 62 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో తిరుగులేని రికార్డులు అతడి సొంతం. ఏకంగా 459 మ్యాచ్‌లాడిన జహీర్ అబ్బాస్ 34,843 పరుగులు చేశాడు. ఇందులో 108 సెంచరీలు ఉండటం విశేషం. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కి గుడ్ బై చెప్పిన తర్వాత కూడా ఆటతో అనుబంధాన్ని జహీర్ అబ్బాస్ కొనసాగించాడు. కొన్ని మ్యాచ్‌లకి ఐసీసీ మ్యాచ్ రిఫరీగానూ వ్యవహరించాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

2007లో సచిన్- 2024లో ధోనీ- ఇద్దరిదీ ఒకే బాట - Sachin Tendulkar Dhoni Captaincy

'నాది త్యాగం కాదు, ప్రేమ'- ధోనీ రిటైర్మెంట్​పై సాక్షి కామెంట్స్ - Dhoni Test Cricket Retirement

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.