ETV Bharat / politics

అరాచకాలు, ఆక్రమణలతో విసిగిపోయిన జనం - కొత్త ప్రభుత్వంలో వ్యవస్థలకు పునరుజ్జీవం : పవన్​ కల్యాణ్ - Pawan Kalyan Interview on Elections

author img

By ETV Bharat Telangana Team

Published : May 10, 2024, 10:20 AM IST

JANASENA PAWAN KALYAN INTERVIEW: సమాజానికి జగన్‌ చాలా హానికరమని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. అరాచకం, వినాశనం ఆయన నైజమని దుయ్యబట్టారు. ఐదేళ్ల పాలనలో ప్రజలు పడిన కష్టాలు, అనుభవించిన బాధలు వైఎస్సార్సీపీని కూకటివేళ్లతో పెకలించబోతున్నాయని, భూస్థాపితం చేయడానికి అన్ని వర్గాలూ మహోద్యమంలా కదిలివస్తాయని ‘ఈనాడు- ఈటీవీ భారత్​’ ఇంటర్వ్యూలో తెలిపారు.

Pawan Kalyan on AP Politics
ETV Bharat Interview With Pawan Kalyan (ETV Bharat)

ఆయన అనుభవం, నా పోరాటం పవన్​ కల్యాణ్ (ETV Bharat)

JANASENA PAWAN KALYAN INTERVIEW : అరాచకాన్ని శ్వాసించి, విపక్షాలను హింసించి, జనాన్ని వేధించి, నరకమేంటో చూపించిన జగన్‌ను అవినీతిని ప్రేమించి, ఆక్రమణలతో లాభించి, అయినోళ్లను మాత్రమే లాలించి ఐదేళ్లుగా అందినకాడికి మేసేసిన జగన్‌ను, ప్రజాగ్రహం ఉప్పెనలా ముంచెత్తబోతోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తేల్చిచెప్పారు. అభివృద్ధిని వదిలేసి, ఐదేళ్లుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి చివరి ఘడియలు దగ్గరపడ్డాయని వ్యాఖ్యానించారు. ఈ కష్టాలు, కన్నీళ్లు తుడవడానికే కూటమిగా ఏర్పడ్డామని పునరుద్ఘాటించారు. అధికారం చేపట్టిన మర్నాటి నుంచే నిత్యనాశనంగా సాగిన వైఎస్సార్సీపీ పాలనకు ముగింపు పలికి, కొత్త పునరుజ్జీవానికి దారులు పరచాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ‘ఈనాడు- ఈటీవీ భారత్​ ’ ప్రతినిధులతో పవన్‌ ప్రత్యేక ముఖాముఖిలో ముఖ్యాంశాలు.

రాష్ట్రాన్ని నడిపించే శక్తి చంద్రబాబుది: చంద్రబాబు పరిపాలనా అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం. ఆయనకు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. అభివృద్ధి, సంక్షేమాన్ని చంద్రబాబు జోడెద్దుల్లా నడిపిస్తారు. ముఖ్యంగా సంక్షేమాన్ని వదలరు. నేనూ పోరాడే స్థాయిలో ఉన్నా. 2014లో పార్టీ ఎలా నడిపిస్తారని ఎవరైనా అడిగితే సమాధానం చెప్పలేకపోయినా ఇప్పుడు సమగ్రంగా వివరించగలను. అనుభవం అంత విలువైంది. ప్రధానమంత్రి మోదీ కూడా బాగా పనిచేసేవారిని ఇష్టపడతారు. రాజకీయ విభేదాలున్నా దేశ సమగ్రతే ఆయనకు ముఖ్యం. నేనెప్పుడూ దేశ సమగ్రతపైనే మాట్లాడతానని మోదీకి తెలుసు. వ్యవస్థలను పాడు చేయకుండా అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించే వ్యక్తి అవసరం. మూడు పార్టీల మధ్య పొత్తు కుదరడానికి ఇవన్నీ దోహదపడ్డాయి.

నేను గెలుస్తానని జగన్‌కు తెలుసు కాబట్టే అంత భయం : వైఎస్​ షర్మిల - AP PCC YS Sharmila Interview

ఇసుక దోపిడీతో మొదలుపెట్టారు: 2019లో జగన్‌ గెలిచిన తర్వాత ప్రమాణస్వీకారానికి విజయసాయిరెడ్డి ఫోన్‌ చేసి పిలిస్తే అభినందనలు తెలిపాను. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తానని చెప్పాను. ఆ ఎన్నికల్లో ప్రజలు సరైన వ్యక్తుల్ని ఎన్నుకోలేకపోయారనిపించింది. ఆ తర్వాత కొద్దిరోజులకే ఇసుకను అరుదైన వస్తువుగా ప్రభుత్వం మార్చేసింది. భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారు. 30, 40 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అయినా ఇసుక విధానం సరిచేయలేదు. దోపిడీకి వనరుగా మార్చుకున్నారు. ప్రజావేదిక కూల్చేశారు. అప్పటి నుంచి విధ్వంసాలు కొనసాగుతూనే ఉన్నాయి. శాంతిభద్రతలను పూర్తిగా విచ్ఛిన్నం చేశారు.

"జగన్‌ అధికారంలోకి వస్తే విశాఖపట్నంలోని కొండకోనలు దోచేస్తారని గత ఎన్నికల్లోనే ప్రజలకు చెప్పాను. గత ఐదేళ్లలో విశాఖను అన్ని విధాలా దోచేశారు. ఉత్తరాంధ్రలోని కొండల్ని మింగేశారు. భూములపైకి గ్యాంగ్‌లను వదిలేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి హయాంలో ఈ గుంపు హైదరాబాద్‌లోనూ ఇలాంటి దారుణాలకే పాల్పడింది. వాటిని భరించలేకే అక్కడ తెలంగాణ ఉద్యమం బలపడింది. అప్పట్లో హైదరాబాద్‌లో నాకు తెలిసిన అనేక మందిని జగన్‌ గుంపు బెదిరించింది."-పవన్​ కల్యాణ్​, జనసేన అధినేత

మద్యనిషేధం ఎలా సాధ్యం: మద్యనిషేధం హామీ వెనుక డబ్బు సంపాదించుకునే పన్నాగం ఉందని ఆనాడే నాకు అనిపించింది. ఛత్తీస్‌గఢ్‌, యానాం, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలను సరిహద్దులుగా పెట్టుకుని మద్యనిషేధం చేయటం సాధ్యమవుతుందా? జగన్‌ అధికారం చేపట్టాక మద్యనిషేధం చేయలేదు. మద్యం తయారీ, సరఫరా, కొనుగోళ్లు, విక్రయాలు అన్నింటినీ గుప్పిట పెట్టుకుని దోచుకుంటున్నారు. నాసిరకం మద్యం తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. అది తాగితే నరాల బలహీనతలు వస్తున్నాయి. మద్యం సిండికేట్‌తో జనాన్ని లూటీ చేస్తూ నాసిరకం మద్యంతో పేదల ప్రాణాలు తీస్తున్నారు.

అందుకే జగన్‌ నాకు శత్రువు: భూములు దోచుకునేవారు, గూండాగిరీకి పాల్పడేవారు, రాజకీయాల్ని నేరమయం చేసినవారు నాకు శత్రువులు. ‘మా దగ్గర అధికారం ఉంది. మిమ్మల్ని ఏమైనా చేస్తాం’ అంటూ భయపెడితే వెనక్కి తగ్గను. ఇలాంటి దాష్టీకాలకు తెగబడుతున్న జగన్‌మోహన్‌రెడ్డి నాకు శత్రువు. ఆ గుంపు దాష్టీకాన్ని వ్యక్తిగతంగా అనుభవించా. నా సినీ కెరీర్‌ తొలినాళ్లలో, ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో వాటిని ఎదుర్కొన్నా. రాజకీయం చేయటం, అభిప్రాయం చెప్పటం ప్రాథమిక హక్కు. ఒక మొక్క ఎదిగి పది మందికి నీడనిస్తుందంటే దాన్ని వీళ్లు మొక్కగా ఉండగానే తుంచేస్తారు. అయినా తట్టుకుని నిలబడ్డాం. జగన్‌ గుంపునకు ఎలా ముకుతాడు వేయాలో నాకు బాగా తెలుసు.

2019 ఎన్నికల ముందు జనసేనతో పొత్తు కోసం వైఎస్సార్సీపీ నేతలు వచ్చారు. చాలా మంది మధ్యవర్తులు ప్రయత్నించారు. కానీ నేను అంగీకరించలేదు. ముందుకు తీసుకెళ్లలేదు. సైద్ధాంతికంగా నచ్చని వారితో స్నేహం చేయను. ఈ ఎన్నికల ముందు కూడా రకరకాల ప్రయత్నాలు జరిగాయి. అన్నీ విన్నాను. స్పందించలేదు.- పవన్​ కల్యాణ్​

చంద్రబాబుకే అలా జరిగితే మన పరిస్థితేంటి: చంద్రబాబు, నేను బంధువులం కాదు. కానీ ఆయనకు ప్రజాస్వామ్యంపై గౌరవ, మర్యాదలున్నాయి. వ్యవస్థల్ని బలోపేతం చేస్తారు. ప్రజాస్వామ్య పరిరక్షణ అనేదే మా ఇద్దరిలో ఉన్న ఉమ్మడి లక్షణం. అదే మమ్మల్ని కలిపింది. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు నేరుగా వెళ్లి సంఘీభావం తెలియజేశాను. అదేదో ఆయన గతంలో నాకు సంఘీభావం ప్రకటించారని కాదు. తెలుగుదేశం పార్టీ సహా 5 కోట్ల మంది ప్రజలకు మానసిక స్థైర్యం ఇచ్చేందుకే. 40 ఏళ్లకు పైగా బలంగా పార్టీ నడిపిన వ్యక్తికి ఇలాంటి పరిస్థితి వస్తే ఆనక మనందరి భవిష్యత్తు ఏంటనే ఆందోళన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అందుకే నేను వెళ్లి ఆయన్ను కలిశాను. లేదంటే కోట్ల మంది ప్రజల మనస్సులు విరిగిపోతాయి. మానసిక స్థైర్యం దెబ్బతింటుంది.

మాకెందుకు అని మేమూ అనుకోవచ్చు కదా: ఎలాంటి ఒత్తిడి తీసుకోకుండా అందరిలా నేనూ కళ్లు మూసుకుని ప్రజాస్వామ్యం బాగుంది అనుకుంటూ బతికేయొచ్చు. 2019లో ప్రజలు తిరస్కరించినందున నేనూ వదిలేసి వెళ్లిపోవచ్చు. చంద్రబాబు ఇక నా వల్ల కాదు అనుకుని రాజకీయాలకు రిటైర్మెంట్‌ ప్రకటించవచ్చు. బీజేపీ నాయకులూ ఇలాగే అనుకోవచ్చు. భవన నిర్మాణ కార్మికులు నాకు ఓటేయలేదని నేను, అమరావతి రైతులు ఓటేయలేదని చంద్రబాబు ఎవరికి వారే మాకెందుకు అనుకోవచ్చు. కానీ మేం బాధ్యత తీసుకుని నిలబడ్డాం.

నేను కొంత తగ్గి, ముందడుగు వేశాను. చంద్రబాబు ఎంతో పాలనానుభవం ఉన్నవారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో పథకాలు తీసుకువచ్చినవారు. ఆయన్ను జైల్లో పెట్టడం వల్ల శారీరకంగా కొంత నలిగిపోయి ఉండొచ్చు కానీ మానసికంగా చాలా దృఢంగా ఉన్నారు. మా మధ్య కొన్ని విధానపరమైన విభేదాలు ఉండొచ్చు. వాటిని అధిగమించి, అందరం కలిశాం. మేం మా బాధ్యత నిర్వహించినట్లే సగటు మనిషి కూడా స్పందించాలి. రాజకీయాలతో సంబంధం లేదని అనుకోకూడదు. రాజకీయాలు మన జీవితాన్ని నియంత్రిస్తున్నాయి. అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఇప్పుడు ప్రతి ఓటరూ స్పందించాలి.

రాష్ట్రం నేరగాళ్ల అడ్డానా: ప్రతి రోజూ రాష్ట్ర వినాశనానికి దారి తీసే చర్యలు తప్ప జగన్‌ ఏం చేశారు? అన్నీ క్రిమినల్‌ చర్యలే. రాష్ట్రం నేరగాళ్లకు ఆలవాలమైపోతోంది. దాదాపు 31 వేల మందికి పైగా మహిళలు అదృశ్యమైపోయారు. నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో చెప్పిన గణాంకాలే ఇవి. అనంతపురం జిల్లా ధర్మవరం వెళ్తే అక్కడ మహిళలు అదృశ్యమైన సంగతి నా దృష్టికి వచ్చింది. ఎక్కడ ఒంటరి మహిళలు, కుటుంబ మద్దతు లేని మహిళలు ఉన్నారో వారికి అన్యాయం చేస్తున్నారు. ముందు నమ్మకపోయినా క్రైం బ్యూరో రికార్డుల్లో గణాంకాలతో మాట్లాడాల్సి వచ్చింది. పార్లమెంటులోనూ మంత్రి ఇదే విషయం చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులు ఎక్కువయ్యాయి.

వారే జగన్‌కు వ్యతిరేకమయ్యారు: రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఎంచుకునేటప్పుడు ఒక నాయకుణ్ని ఎలా అంచనా వేయాలి? ఒక కంపెనీ షేర్లు కొనేటప్పుడు ఎవరైనా ఏం చూస్తారు? ముందు ఆ కంపెనీని నడిపేది ఎవరో చూస్తారు. ఆ కంపెనీ చరిత్ర తెలుసుకుంటారు. ఏమేం సాధించిందో చూసుకుంటారు. అన్నీ ఆలోచించి షేర్లు కొంటారు. ఒక కంపెనీలో పెట్టుబడి పెడితేనే ఈ స్థాయిలో లెక్కలు వేస్తారు. 2019కు ముందు అనేక మంది నాతో వాదించారు. జగన్‌కు ఎందుకు వ్యతిరేకంగా వెళ్తున్నావు అని అడిగినవారూ ఉన్నారు. ఆ రోజు రాజశేఖరరెడ్డి కుమారుడు అని కొందరు, సామాజికవర్గం కారణంగా మరికొందరు, ఒక పార్టీపై కోపంతో ఇంకొందరు ఆయనకు మద్దతిచ్చారు. 2019లో గెలిచిన తర్వాత ఆయన నిజస్వరూపం అందరికీ తెలిసింది. ఎంత విధ్వంసకారుడో అర్థమయింది. 2019లో ఆయనకు మద్దతిచ్చిన వారే, సర్వస్వం ధారబోసి ఎన్నికల్లో పని చేసినవారే ఈ అరాచకాలన్నీ చూసి ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మారిపోయారు.

ఆయన అనుభవం, నా పోరాటం: ఈ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఏర్పాటు చేసిన కూటమి సామాన్యుడి కోపానికి ప్రతిరూపం. అందుకే కూటమికి మద్దతుగా ఈ వేవ్‌ కనిపిస్తోంది. కూటమిలో 40 ఏళ్ల అనుభవముొన్న చంద్రబాబు ఉన్నారు. పోరాట పటిమ చూపుతూ కొత్త తరాన్ని ప్రతిబింబించే జనసేన ఉంది. జాతీయ రాజకీయాల్లో 2 పార్లమెంటు సీట్లతో ప్రారంభించి ఇప్పటికి అనేకసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ఉంది. మూడోసారి ప్రధాని కాబోతున్న మోదీ ఉన్నారు. వీళ్లంతా 2014లో కలిసి పోటీ చేసిన అనుభవం ఉంది. ఉమ్మడి కనీస కార్యక్రమం కింద కూటమి మరింత బలోపేతమయింది. ఒకరకంగా చెప్పాలంటే ఈ కూటమికి జగన్‌ ఎంతో సహకరించారు. మా బాధ్యత ఎంతుందో ఆయనే మాకు గుర్తు చేశారు. సీపీఎస్‌ రద్దు చేస్తామని చెప్పి ఆ హామీ నెరవేర్చకపోతే ఉద్యోగి ఎవరికి చెప్పాలి? వారి నాయకులకు చెప్పినా వాళ్లూ జగన్‌ చెప్పు చేతల్లో ఉండాల్సిన పరిస్థితి. ఎయిడెడ్‌ స్కూళ్లు తీసేశారు. ఫీజులు పెంచేశారు. ఇలాంటి సమస్యలు ప్రజలకు ఎన్నో. అవన్నీ ఎవరికి చెప్పుకోవాలి? ప్రజల్లో సమష్టి ఆగ్రహానికి ఓ రూపంగా ఈ కూటమి ఏర్పడింది.

తెలుగుదేశం, జనసేన, బీజేపీల పొత్తుకు నేనే చొరవ తీసుకున్నాను. నేనే మధ్యవర్తిత్వం వహించాను. చాలా నలిగాను. రాష్ట్రంలోని 5కోట్ల మంది ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే కొంత తగ్గాను. ఇందుకోసం చాలా ఇష్టంగా పని చేశాను. ఈ పొత్తు కుదరడం సంతృప్తి కలిగించింది. 2022లో 70 కిలోమీటర్ల మేర ప్రజలు అడుగడుగునా మద్దతుగా నిలిచినా నేను పొంగిపోలేదు. నేలమీదే నడిచాను. నిర్మాణాత్మకంగా వ్యవహరించాను. కొన్ని సందర్భాల్లో ఇంత తగ్గకుండా మరింత బలంగా ఉంటే బాగుండేది అనిపించింది. కానీ వ్యక్తిగతంగా తీసుకోలేదు. ప్రజల భవిష్యత్తు కోణంలోనే ఆలోచించాను. అందుకే తగ్గాను. ఈ పొత్తు రాష్ట్రానికి చాలా అవసరం. నా జీవితమంతా కత్తిమీద సామే.- పవన్​ కల్యాణ్​

ఎవరెలా బతకాలో కూడా ఆయనే నిర్దేశిస్తారా: జగన్‌మోహన్‌రెడ్డి అవినీతితో రూ.వేల కోట్లు సంపాదించారు. మనకు కంటి ముందు కనిపిస్తున్న ఆయన కంపెనీలే అందుకు ఆధారాలు. అక్రమ సంపద పోగేసుకుని దాంతో వ్యవస్థను శాసించాలని చూస్తున్నారు. బెదిరింపులు, అసభ్యపదజాలంతో విరుచుకుపడుతున్నారు. దాడులు, దౌర్జన్యాలతో అందర్నీ అణచివేయాలని చూస్తున్నారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు వారు ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడ్డారు. వాళ్లు హింసనే నమ్ముకున్నారు. ఇది అత్యంత ప్రమాదకర నేరాలకు దారితీస్తుందని అప్పట్లోనే నాకు అర్థమైంది. వారు అధికారం చేపట్టాక నేను ఊహించిందంతా నిజమైంది. అక్రమార్జనలో మునిగితేలి, ఆ డబ్బులతో రాజకీయాలు చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి ఎవరు ఎలా బతకాలో, ఎవరు ఎలా భయపడాలో నిర్దేశిస్తున్నారు. అధికారులను సైతం బెదిరిస్తున్నారు.

నాది మధ్య తరగతి ఆలోచనా విధానం: నేను సగటు మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. చాలా బాధ్యతగా ఉంటా. చట్టం, సమాజమంటే భయపడతా. పన్నులు కడతా. రాంగ్‌రూట్‌లో వెళ్లాలంటే ఆలోచిస్తా. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటిస్తా. నాయకుల్లోనూ ఇలాంటి ఆలోచన ఉండాలనుకుంటా. నేను తొలి నుంచి వైఎస్సార్సీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెబుతూనే ఉన్నా. ఎన్ని గొప్ప చట్టాలు చేసినా, ఉన్నత సంస్కరణలు తెచ్చినా అమలు చేసేవాడి బుద్ధి వక్రంగా ఉంటే ఫలితం లేదు. నేను ఓటముల నుంచి ఎదిగినవాణ్ని. నేర్చుకునే ప్రక్రియలో కింద పడుతుంటాం. లేస్తుంటాం. నేను నిరంతరం నేర్చుకోవటానికి సిద్ధం. జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి వద్ద రోడ్డు నిర్మాణం కోసం తాడేపల్లిలో కాలవ కట్టపై ఉంటున్న వారి ఇళ్లు కూల్చేశారు. వాలంటీరుగా పనిచేసే బాధిత యువతి నా దగ్గరకు వచ్చి ఈ సమస్యపై విన్నవించుకున్నారు. ఆ తర్వాత వారం రోజులకే ఆమె సోదరుడు శవమై తేలాడు. ఆ కేసు ఏమైందో ఇప్పటికీ తేల్చలేదు.

హీరోలనూ ఆధీనంలో ఉంచుకోవాలనుకుని: మేం ఏదన్నా మీరు పడాలి, మీరు ఏదన్నా మేం పడం ఇదీ జగన్‌ పద్ధతి. స్పీకరు కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు. అందరూ ఆయన చెప్పినట్లు వినాలన్న మొండిపట్టు జగన్‌ది. చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్‌, మహేష్‌బాబు వీళ్లకు సినిమా టికెట్లకు సంబంధమేంటి? అదంతా వ్యాపార విషయం. ఏదైనా ఉంటే ప్రభుత్వం నిర్మాతలతో మాట్లాడుకోవాలి. ఫిలిం ఫెడరేషన్‌తో మాట్లాడుకోవాలి. కానీ జగన్‌కు అహంకారం. సినిమా హీరోలు వచ్చి టికెట్ల గురించి అడిగితే ఆయన అహం (ఈగో) సంతృప్తి చెందుతుంది. వ్యవస్థలను బలహీనం చేసే ఇలాంటి వారి ప్రభావం మన జీవితాల్లో లేకుండా చూసుకోవాలి. ఎన్నికల్లో మద్దతు కావాలని నేను మా అన్నయ్యనే కాదు, సినిమా పరిశ్రమలో ఎవరినీ అడగలేదు.

జగన్​ పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కి - అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ఆకాంక్షలకు పట్టం కడతాం : చంద్రబాబు - Chandrababu Naidu Special Interview

రైతులను కొట్టడానికి మనసెలా వచ్చింది: మనకు దగ్గరలోనే అమరావతి ఉంది. రాజధాని కోసం ఇన్ని వేల ఎకరాలు అవసరం లేదన్నాను. జగన్‌ మాత్రం 50 వేల ఎకరాలు సమీకరించమన్నారు. అమరావతిలోనే తాను ఇల్లు కట్టుకున్నానని చెప్పారు. నాయకులంతా కలిసి చట్టసభలో ఒక నిర్ణయం తీసేసుకున్న తర్వాత ఇలా మార్చుకుంటే ఎలా? ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. అలాంటిది అమరావతి రాజధాని కాదంటే వాళ్లు నిరసన కూడా తెలపకూడదా? ఆందోళన చేయకూడదా? అమరావతి రైతులను జగన్‌ అలా ఎలా చితక్కొట్టిస్తారు? వారిపై పాశవికంగా దాడి చేయడం నాకు బాధ కలిగించింది.

జగన్‌ నేరస్వభావాన్ని పెంచుతున్నారు: లాల్‌బహదూర్‌శాస్త్రి వచ్చి ఆహార కొరత ఉన్నప్పుడు వారానికి ఒక పూట తిండి మానేయాలని పిలుపునిచ్చారు. అది విన్న మా అమ్మమ్మ చనిపోయే వరకు ప్రతి సోమవారం ఉపవాసం ఉండేది. అలా ఒక నాయకుడు మంచి విషయాన్ని నేర్పవచ్చు. జాతీయ భావం పెంచవచ్చు. సమైక్యత ఏర్పరచవచ్చు. కానీ జగన్‌ వచ్చి నేరస్వభావాన్ని పెంచుతున్నారు.ప్రతి ఒక్కరినీ భయపెట్టడం, తిట్టించడం, దాడులు చేయించడం ఇలాంటివే నేర్పిస్తున్నారు. ఆలయాలపై దాడులు జరిగినా బాధ్యులను పట్టుకోకపోతే ఎలా? శిశుపాలుడి వంద తప్పులు పూర్తయినట్లు, జగన్‌ వంద తప్పులు చేసేశారు. దేవుడి విషయంలో అయితే వంద తప్పులు దాటేశారు.

ముందూ సంక్షేమ పథకాలున్నాయ్‌: జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమానికి ఆద్యుడేమీ కాదు. ఆయన కంటే ముందూ సంక్షేమ పథకాలు ఉన్నాయి. తర్వాతా కొనసాగుతాయి. పౌరులకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించాలని ఆదేశిక సూత్రాల్లోనే ఉంది. కానీ జగన్‌ మాత్రం ‘నేను సంక్షేమం ఇస్తున్నా. నేను సంక్షేమం ఇస్తున్నా’ అంటూ తానేదో ఇస్తున్నవాడిలా, ప్రజలు తీసుకుంటున్న వారిలా మాట్లాడుతున్నారు. ఇదేమైనా రాచరికమా? ప్రజాస్వామ్యమా? సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత. అది వారి దయాదాక్షిణ్యం కాదు. ప్రజల కోసం తన సొంత డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇచ్చే గుణం జగన్‌కు లేదు. ప్రభుత్వ నిధుల నుంచి డబ్బులు చెల్లిస్తూ సంక్షేమం ముసుగులో కొంతమందిని తన గుప్పిట బంధించుకోవాలని చూస్తున్నారు. అసలు సంపదే సృష్టించకపోతే సంక్షేమం ఎలా సాధ్యమవుతుంది? మనం పది రూపాయలు సాయం చేయాలంటే ఆ మేరకు సంపద సృష్టించాలి కదా!

అది మన భవిష్యత్తు కోసమే: ఓటు వేయడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల రోజును సెలవులా చూడకూడదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. దీనికి నిరంతర పహారా అవసరం. జీవించే హక్కు కోసం పోరాడాలి. ఐదేళ్లు అది లేకపోవడంతోనే విధ్వంసం జరిగింది. రోజూ తినకపోతే ఎలా బలహీనపడతామో ప్రజాస్వామ్యాన్ని నిరంతరం కాపాడుకోకుంటే అదీ బలహీనమవుతుంది. పౌరులకు పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబులాగా ఎండలో రోడ్డుమీద తిరగాల్సిన పనిలేదు. మాటలు అనిపించుకోవాల్సిన పనిలేదు. ఇంట్లో మహిళలను తిట్టించుకోవాల్సిన పనిలేదు. బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఓటేయాలి. అదీ మీ భవిష్యత్తును పరిరక్షించుకోవడానికే.

ప్రజలకే చేరుతుంటే సంతోషమేగా: వైఎస్సార్సీపీ దగ్గర ప్రజల నుంచి అడ్డంగా దోచుకున్న డబ్బు ఉంది. ఓట్ల కొనుగోలు ద్వారా అదంతా తిరిగి ప్రజల దగ్గరకే చేరుతోంది. ఇది సంతోషించాల్సిన అంశమే. దోచేసిన డబ్బేగా ఇస్తున్నారు. ఖర్చులకు కావాలి కాబట్టి తీసుకుంటున్నామని, ఓటు మాత్రం కూటమికే అని అధికశాతం మంది చెబుతున్నారు.

వైఎస్సార్సీపీకి ఓటేయరు: మనిషికి ఆత్మ అనేది ఒకటి ఉంటుంది. అదెప్పుడూ మనిషిని, మనసును తట్టి లేపుతుంది. రాష్ట్రంలో ఎక్కువ శాతం మంది ప్రజలు ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ అరాచకాల్ని చూశారు. బాధ్యత వారిని కచ్చితంగా తట్టిలేపుతుంది. ఓటుకు రూ.5 వేలు కాదు, కుటుంబానికి రూ.లక్ష ఇచ్చినా పనిచేయదు. ఎన్నికల్లో వారు వెదజల్లే డబ్బు ప్రభావం ఉండదు. క్రీస్తును శిలువ వేశారంటే ఎందుకు మనం కదిలిపోతాం.

ఆయన మనకోసమే చనిపోయారన్న భావనతోనే కదా! అత్యయిక పరిస్థితి సమయంలోనూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు డయాలసిస్‌ చేయించుకునే పరిస్థితిలో ఉన్న జయప్రకాశ్‌ నారాయణ్‌ బయటకొచ్చారంటే అది జనం కోసమే. కొవిడ్‌ సమయంలో ముక్కుమొఖం తెలియని రోగుల ప్రాణాలు నిలబెట్టే క్రమంలో ఎంతోమంది వైద్యులు బలయ్యారు. చేతినిండా సినిమాలున్నాయని, నాకేంటి అవసరం అనుకున్న నన్నే చాలా సంఘటనలు కుదిపేశాయి. ఇప్పుడు ఓటర్లు కూడా కచ్చితంగా ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా ఓటేస్తారు.

‘మరోసారి మోదీ’ అనేది జన నినాదం - కమలాన్ని గెలిపించేందుకు ప్రజలు సిద్ధం : కిషన్​ రెడ్డి - KISHAN REDDY INTERVIEW LATEST

వైఎస్సార్సీపీ దాష్టీకం: చట్టసభలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ప్రస్తావన తెచ్చి ఆమెను కించపరాల్సిన పనిలేదు. వైఎస్సార్సీపీ విలువలన్నీ వదిలేసి అలా వ్యవహరించింది. ఆడపడుచుకు అన్యాయం జరుగుతున్నప్పుడు స్పందించడం మన బాధ్యత. దిల్లీలో నిర్భయ ఘటన జరిగితే సంబంధం లేదని దేశమంతా అనుకోలేదే? మన కళ్ల ముందే ఎవరైనా గాయాలతో పడిపోతే తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పిస్తాం. సమాజంలో విలువలు కాపాడటం నా బాధ్యతగా భావిస్తా. అందుకే నేనూ స్పందించాను.

ఇళ్లలోని మహిళలే టార్గెట్‌: జగన్‌ గుంపు ఇంట్లోని మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తుంది. అది హేయం. సామాన్యులు వారికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు వారి ఇళ్లకు వెళ్లి ఆడవాళ్లు జాగ్రత్త అని బెదిరిస్తారు. 2006-07 నుంచి వీరిని చూస్తున్నా. యుద్ధాలు జరిగినప్పుడు మహిళలను ముష్కరులు అగౌరవపరుస్తారు. వీళ్లూ అంతే. ఇంత కుట్ర, కుళ్లుతో నిండిన రాజకీయాల్లోకి ప్రాణాలకు తెగించే వచ్చాను. మనిషి సుగంధానికి ఆకర్షితులవుతారు. దుర్గంధానికి దూరమవుతారు. మమ్మల్ని ఉద్దేశించి జగన్‌ చేసే వ్యాఖ్యలు దుర్గంధం లాంటివే. ప్రజలు కూడా తెలుసుకుని వారికి దూరంగా ఉంటారు.

పథకాలు అందుకున్నవారికీ అసంతృప్తే: జగన్‌ మాట్లాడితే సంక్షేమం అంటారు. ఎంతమందికి సంక్షేమం అందిస్తున్నారు? మధ్య తరగతిని పూర్తిగా వదిలేశారు. ఆటోడ్రైవర్లకు వాహనమిత్ర రూ.10 వేలు ఇస్తున్నారు. ఆటోడ్రైవర్లకు బేరాలు తగ్గిపోయాయి. కిరాయిలు సరిగా లేవు. వారికి ఆదాయం వచ్చేలా చూసి ఆపైన రూ.10 వేలు ఇస్తే ఉపయోగం తప్ప, వారి ఉపాధిని దెబ్బకొట్టి ఇస్తే ఉపయోగమేంటి? పైగా వారిపై నిఘా. మాట్లాడాలంటేనే సామాన్యులు భయపడే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. సంక్షేమ పథకాలు పొందేవాళ్లు కూడా ఈ ప్రభుత్వంపై అసంతృప్తిగానే ఉన్నారు.

వ్యవస్థలను నిలబెట్టాలి: కొత్త ప్రభుత్వంలో ముందు మళ్లీ వ్యవస్థలను నిలబెట్టాల్సి ఉంది. ప్రతి ఒక్క వ్యవస్థనూ బలోపేతం చేసుకుంటూ వెళ్లాలంటే ముందు రాజకీయ స్థిరత్వం రావాలి. కిందామీదాపడ్డా వీళ్లు సమూహాన్ని కాపాడుకుంటారని ప్రజలు నమ్ముతారు. వ్యక్తులు తొలుత వ్యవస్థలను నిర్మిస్తారు. ఆ తర్వాత వ్యవస్థలు వ్యక్తులను నడిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు ఎలా ఉందంటే వ్యక్తులు తిరిగి వ్యవస్థలకు పునరుజ్జీవం పోయాల్సిన పరిస్థితి వచ్చింది. పోలీసు, రెవెన్యూ వ్యవస్థలను సంస్కరించాలి. పోలీసులకు వారాంతపు సెలవుల్లేవు. వారికీ, ఉద్యోగులకూ కూడా రావాల్సిన బకాయిలు, సరెండర్‌ లీవు మొత్తాలు రావడం లేదు. ఉద్యోగుల సీపీఎస్‌కు సంబంధించి ఒక మెరుగైన నిర్ణయం తీసుకుంటాం. 30 ఏళ్లు ఉద్యోగం చేసిన తర్వాత కూడా పింఛను గాలిలో పెట్టిన దీపంలా ఉంటుందంటే ఎలా? సీపీఎస్‌ విషయంలో ఒక పరిష్కార మార్గాన్ని వెదుకుతాం. శాయశక్తులా ప్రయత్నించి కూటమిలోకి బీజేపీను తీసుకొచ్చాను. అలాగే కష్టపడి వ్యవస్థలను కూడా గాడిలో పెడతాం.

తొలిసారి అసెంబ్లీలో అందరిని అలా చూసి షాకయ్యా - కిషన్ రెడ్డితో మెగాస్టార్ చిట్​చాట్ - KISHAN REDDY CHIRANJEEVI CHITCHAT

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.