ETV Bharat / health

క్యాన్సర్​ను ఎలా గుర్తించవచ్చో తెలుసా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 4, 2024, 4:50 AM IST

Updated : Feb 4, 2024, 7:27 AM IST

Cancer Prevention
Cancer Prevention

World Cancer Day 2024 : ప్రస్తుత కాలంలో ప్రజల్ని భయపెడుతున్న భయంకరమైన వ్యాధి క్యాన్సర్. ఇది ప్రాణాంతకమే. కానీ ముందస్తుగా గుర్తించి చికిత్స తీసుకోవడం వల్ల ప్రాణాలతో బయటపడవచ్చు. క్రికెటర్ యువరాజ్ సింగ్, హీరోయిన్లు మనీషా కోయిరాలా, సోనాలి బింద్రే తదితరులు క్యాన్సర్​తో పోరాడి గెలిచారు. కొన్ని లక్షణాల ద్వారా దీన్ని ముందుగానే పసిగట్టవచ్చు. ఆదివారం (ఫిబ్రవరి4)న ప్రపంచ క్యాన్సర్​ దినోత్సవం సందర్భంగా అవెంటో తెలుసుకుందాం.

World Cancer Day 2024 : క్యాన్సర్- ఈ పేరు వింటేనే ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. ప్రాణాంతకమైన ఈ వ్యాధి బారిన పడే వారు దీన్ని అంత తొందరగా గుర్తించలేరు. పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత గుర్తిస్తే ప్రయోజనం ఉండదు. క్యాన్సర్​ను ముందుగానే పసిగట్టాలి. అందుకు కొన్ని లక్షణాలున్నాయి. నిశితంగా గమనిస్తే ముందస్తుగానే దీన్ని గుర్తించే అవకాశముంది. ఆదివారం (ఫిబ్రవరి4)న ప్రపంచ క్యాన్సర్​ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ లక్షణాలేవి? వాటినెలా గుర్తించాలి తదితర వివరాలు తెలుసుకుందాం.

మన శరీరం ముందస్తుగానే పంపించే సంకేతాల ద్వారా దీర్ఘకాలిక వ్యాధి అయిన క్యాన్సర్​ను గుర్తించవచ్చు. ఎవరికి వారు దానిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. క్యాన్సర్ లాంటి వ్యాధులు ప్రాణాంతకమైనవి. కానీ ముందస్తుగా గుర్తిస్తే చికిత్స చాలా సులభమవుతుంది. కొన్ని సార్లు పూర్తిగా నయమయ్యే అవకాశమూ ఉంటుంది. అందుకే శరీరం అందించే సంకేతాలను ముందస్తుగా గమనించడం మంచిది.

  • క్యాన్సర్ లక్షణాలు
  • మహిళలు, పురుషులు ఇద్దరికీ క్యాన్సర్ సంకేతాలు చాలా వరకు సారూప్యంగానే ఉంటాయి.
  • క్యాన్సర్ వచ్చే ముందు ఆకలి లేకపోవడం గమనించవచ్చు.
  • డిప్రెషన్, ఫ్లూ లాంటి సమస్యలూ ఉంటాయి.
  • ఇవి మెటబాలిజాన్ని దెబ్బతీసి ఆకలి లేకుండా చేస్తాయి.
  • ఉదర క్యాన్సర్, క్లోమ గ్రంథి, పెద్ద పేగు, అండాశయ క్యాన్సర్ లాంటి సమస్యలు వచ్చినపుడు కడుపుపై తీవ్ర ఒత్తిడి పడుతుంది.
  • ఆకలి తగ్గిపోతుంది. మూత్రంలో రక్తం పడటం మూత్రనాళ క్యాన్సర్​కు సంకేతంగా భావించవచ్చు.
  • కిడ్నీల్లో ఇన్​ఫెక్షన్ ఏర్పడినప్పుడు కూడా మూత్రంలో రక్తం వస్తుంది. దీనికి సరిగ్గా పరీక్ష చేయించుకోవాలి.

ఆ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించండి
కారణం లేకుండా ఆకలి తగ్గిపోతే ఒకసారి వైద్యుల్ని సంప్రదించి పరీక్షలు చేయించాలి. తల నుంచి కాలి వరకు ఎన్నో ప్రాంతాల్లో క్యాన్సర్ వచ్చే అవకాశముంది. ఇందులో దాదాపు వందకు పైగా రకాలున్నాయి. క్యాన్సర్ ఎక్కడ వస్తుందో దాన్ని బట్టి లక్షణాలుంటాయి. ఉదాహరణకు ఊపిరితిత్తుల క్యాన్సర్ అయితే దగ్గు, ఆయాసం ఉంటుంది. ఉదర క్యాన్సర్ అయితే ఆకలి తగ్గిపోవడం, వాంతులు వచ్చే ఫీలింగ్ ఉంటుంది. గర్భసంచి క్యాన్సర్ అయితే ఎక్కువ బ్లీడింగ్ కావడం, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అయితే తెల్లబట్ట అవడం లాంటివి ఉంటాయి.

ఊపిరితిత్తుల క్యాన్సర్​
దీర్ఘకాలికంగా దగ్గు వస్తున్నా క్యాన్సర్ లక్షణంగా గుర్తించవచ్చు. దగ్గుతో పాటు ఛాతిలో నొప్పి వస్తుందంటే ఊపిరితిత్తుల క్యాన్సర్​కు దీన్ని సంకేతంగా తీసుకోవచ్చు. దీంతో పాటు బరువు తగ్గటం, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఉంటాయి. ముఖ్యంగా ధూమపానం చేసే వారికి ఈ సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. జ్వరం ఎక్కువగా ఉన్నా, తరచుగా వస్తున్నా అనుమానించాలి. లింఫోమా, లుకేమియా, మూత్రపిండాలు, కాలేయ క్యాన్సర్లు వచ్చే అవకాశమున్నప్పుడు మాత్రం జ్వరం ఎంతకీ తగ్గకుండా ఉంటుంది. మెడ దగ్గర గట్టి గడ్డలున్నట్లయితే వాటిని తీవ్రంగా పరిగణించాలి. ఇవి నోరు, గొంతు, థైరాయిడ్ క్యాన్సర్లకు ముందస్తు సూచన కావచ్చు. ఈ విషయంలో వైద్యులను ముందస్తుగా సంప్రదించడం మంచిది.

"ప్రతి క్యాన్సర్​కు కొన్ని లక్షణాలుంటాయి. మహిళల్లో సాధారణంగా వచ్చేది రొమ్ము క్యాన్సర్. చాలా సార్లు ఇందులో నొప్పి ఉండదు. కాబట్టి వారికి క్యాన్సర్ వచ్చినట్లు తెలీదు. ఇది వచ్చినప్పుడు రొమ్ముల్లో గడ్డ ఏర్పడుతుంది. అందుకే మహిళలు ప్రతి నెలకో సారి తమ రొమ్ములను చెక్ చేసుకోవాలి. మరొకటి గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్. ఇందులో కూడా ప్రారంభంలో ఎలాంటి సింప్టమ్స్ ఉండవు. పెద్ద గడ్డ వచ్చిన తర్వాత తెల్లబట్ట, ఎర్రబట్ట, పీరియడ్స్ కి మధ్యలో బ్లీడింగ్ అవ్వడం, సెక్స్ లో పాల్గొన్నప్పుడు రక్తం రావడం జరుగుతుంది."
-డా. సాయి లక్ష్మి, ఆంకాలజిస్టు (క్యాన్సర్ వైద్య నిపుణులు)

ఇక పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ సాధారణం. ఇది 60 ఏళ్లు దాటిన వాళ్లలో వస్తుంది. మూత్రం పోసేటప్పుడు ఎక్కువ సమయం తీసుకోవడం దీని సాధారణ లక్షణం. దీంతో పాటు బరువు తగ్గడం, పెల్విక్ ప్రాంతంలో నొప్పి ఉంటే వైద్యుల్ని సంప్రదించాల్సిందే.

క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
రోజూ వ్యాయామం చేయాలి. శరీరంలో ఆక్సిజన్ స్థాయులు పెంచుకోవాలి. వీలైనంత వరకు కాలుష్యానికి దూరంగా ఉండాలి. వీలైనప్పుడు పోషకాహారం తీసుకోవడం, ప్రశాంతంగా ఉండటం సహా మెడిటేషన్ చేయాలి. మహిళల వక్షోజాల్లో సాధారణ గడ్డలు కూడా ఏర్పడతాయి. అయితే, ఇలాంటి గడ్డలు గుర్తించినప్పుడు వైద్యుల్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. రుతు చక్రం తర్వాత రక్త స్రావం అవుతుందంటే అనుమానించాల్సిందే. ఇలాంటి సంకేతాలు ఒక్కోసారి అండాశయ క్యాన్సర్​కు దారి తీసే అవకాశముంది.

క్యాన్సర్ ఏదైనా ముందస్తుగా గమనిస్తే చికిత్స తీసుకోవడం సులభం. వైద్యులు కూడా ఇదే సూచిస్తారు. ఇలాంటి స్థితిలో గుర్తించగలిగితే పూర్తిగా నయం చేసే అవకాశం కూడా ఉంది. క్రికెటర్ యువరాజ్ సింగ్, హీరోయిన్లు సొనాలీ బింద్రె, మనీషా కోయిరాలా కూడా క్యాన్సర్ బారిన పడ్డారు. కానీ ముందుగానే గుర్తించి, చికిత్స పొంది దానిపై గెలుపొందారు. ముందుగానే గుర్తించేందుకు సంకేతాల్ని బట్టి ప్రయత్నించడం మంచిది. అందుకోసం ఎప్పటికప్పుడు శరీరంపై శ్రద్ధ వహించాలి. క్యాన్సరే కాదు, ఎలాంటి జబ్బులు రాకుండా వీలైనంత వరకు తాజా కూరగాయలు, పండ్లు, సమతుల పోషకాలున్న ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడం వల్ల అన్ని రకాల వ్యాధుల బారిన్ పడే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? - అయితే కడుపు క్యాన్సర్ కావొచ్చు!

దగ్గుతున్నప్పుడు ఛాతి, భుజాల దగ్గర నొప్పిగా ఉందా? ఇది క్యాన్సర్‌ సంకేతం కావచ్చు!

Last Updated :Feb 4, 2024, 7:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.