ETV Bharat / business

వాట్సాప్ గ్రూపును రూ.6,400 కోట్ల కంపెనీగా మార్చిన యువకుడు - ఒక్క ఐడియాతో లైఫ్ ఛేంజ్​! - Dunzo Founder Kabeer Biswas

author img

By ETV Bharat Telugu Team

Published : May 12, 2024, 10:28 AM IST

Dunzo Founder Kabeer Biswas : సాధారణ వాట్సాప్ గ్రూపుతో మొదలైన వ్యాపారం రూ.6,400 కోట్ల కంపెనీ స్థాయికి ఎదిగింది. 2015 సంవత్సరంలో బెంగళూరులో మొదలైన ఆ కంపెనీ సేవలు అనతికాలంలోనే దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు వ్యాపించాయి. ఈ పెద్ద విజయం వెనుక ఉన్న ఏకైక వ్యక్తి కబీర్ బిస్వాస్. ప్రముఖ డెలివరీ సేవల సంస్థ ‘డన్జో’ (Dunzo) వ్యవస్థాపకుడు ఈయనే!

Dunzo Founder Kabeer Biswas
Dunzo delivery services (Etv Bharat)

Dunzo Founder Kabeer Biswas : ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. ఔను! ఒక ఐడియా కబీర్ బిస్వాస్ జీవితాన్ని మార్చేసింది. ఈయన మరెవరో కాదు ప్రముఖ డెలివరీ సేవల సంస్థ ‘డన్జో’ (Dunzo) వ్యవస్థాపకుడు! నేటి బిజీ ప్రపంచంలో ప్రజల రోజువారీ సమస్యలను పరిష్కరించాలనే ఆలోచనా విధానమే ఈ కంపెనీ ఏర్పాటు దిశగా కబీర్‌ను నడిపింది. కబీర్ బిస్వాస్ డెలివరీ సేవల వ్యాపారాన్ని తొలుత 2015 జనవరిలో బెంగళూరు సిటీలో ప్రారంభించారు. మొదట్లో డెలివరీ సేవల్లో పాల్గొనే సిబ్బంది యాక్టివిటీని కబీర్ బిస్వాస్ ఒక సాధారణ వాట్సాప్ గ్రూప్‌తో ట్రాక్ చేసేవారు. దాని ద్వారానే వారికి సమాచారాన్ని చేరవేసేవారు. అలా మొదలైన ‘డన్జో’ ప్రస్థానం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా అంచెలంచెలుగా ఎదిగి దాదాపు రూ.6,400 కోట్ల కంపెనీ స్థాయికి చేరింది.

రిస్క్​లోనే మజా!
కబీర్ బిస్వాస్ 1984లో జన్మించారు. ఆయన 19 ఏళ్ల వయసులో ఉండగానే తండ్రిని కోల్పోయారు. అయితే తండ్రి నుంచి పెద్దమొత్తంలోనే ఆస్తిపాస్తులు కబీర్‌కు లభించాయి. ఈ దన్నుతో ఆయన కొత్తకొత్త వ్యాపారాలు ప్రారంభించి, ప్రయోగాలు చేసే రిస్క్‌ను చేయగలిగారు. తల్లి నుంచి కూడా కబీర్‌కు మంచి ప్రోత్సాహం లభించింది. అందువల్లే తనకు ఆసక్తిని రేకెత్తించే ఆలోచనలతో నిర్భయంగా వ్యాపార ప్రయోగాల పరంపరను కబీర్ కొనసాగించగలిగారు. 2007లో ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత కబీర్ తన వృత్తిపరమైన కెరీర్‌ను ప్రారంభించారు. తొలుత భారతీ ఎయిర్‌టెల్‌లో ఉద్యోగంలో చేరారు. మొదట్లో ఈ కంపెనీలోని గ్రామీణ న్యూ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ విభాగంలో పనిచేశారు. కేవలం రెండు సంవత్సరాలలోనే కబీర్ కీలకమైన హోదాలను అందుకోగలిగారు. అనంతరం వీడియోకాన్ టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్‌లో కబీర్ పనిచేశారు. కబీర్ Y2CF డిజిటల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లో చేరి, డిజిటల్ మీడియా రంగంలోకి ప్రవేశించాడు. అక్కడే ఆయన Hoppr అనే కంపెనీని స్థాపించాడు. ఈ Hoppr కంపెనీని 2014 సంవత్సరంలో హైక్ కంపెనీ కొనుగోలు చేసింది.

గూగుల్, రిలయన్స్ రిటైల్ నుంచి పెట్టుబడులు
ఈ విభిన్న అనుభవాల నేపథ్యంలో కబీర్ 2015 జనవరిలో డన్జోను ప్రారంభించారు. కంపెనీ యాక్టివిటీ కోసం మొదట్లో ఒక చిన్న వాట్సాప్ గ్రూప్‌‌ను వాడేవారు. డన్జోను నమ్మకమైన, సమర్థవంతమైన డెలివరీ సర్వీస్ ప్రొవైడర్‌గా మార్కెట్‌లో నిలిపే ప్రయత్నం చేశారు. తొలుత డన్జో డెలివరీ సేవలు బెంగళూరుకే పరిమితమై ఉండేవి. కానీ అనంతరం కాలంలో అవి క్రమంగా దిల్లీ, గురుగ్రామ్, పుణె, చెన్నై, జైపుర్, ముంబయి, హైదరాబాద్ నగరాలకు విస్తరించాయి. ఈక్రమంలో 2017 సంవత్సరంలో గూగుల్ కంపెనీ నుంచి ఫండింగ్ పొందిన మొదటి భారతీయ టెక్ కంపెనీగా డన్జో వార్తల్లో నిలిచింది. 2022 జనవరి నాటికి కంపెనీ దాదాపు రూ.5,800 కోట్లను సేకరించింది. 2022 జనవరిలో రిలయన్స్ రిటైల్ నుంచి డన్జోకు రూ.2వేల కోట్ల ఫండింగ్ లభించింది.

గత రెండేళ్లుగా ఆర్థిక సవాళ్లు!
గత రెండేళ్లుగా డన్జో కంపెనీ పలు సవాళ్లను ఎదుర్కొంటూ ఎదురీదుతోంది. 2022- 2023 ఆర్థిక సంవత్సరంలో డన్జోకు రూ.1,800 కోట్ల నష్టం వచ్చింది. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే ఇది 288 శాతం ఎక్కువ. డన్జో నుంచి పలువురు సహ వ్యవస్థాపకులు, ఫైనాన్స్ హెడ్‌ సహా అనేక మంది ముఖ్య కార్యనిర్వాహక అధికారులు అకస్మాత్తుగా వెళ్లిపోవడంతో కంపెనీని ఆర్థిక ఒత్తిడి ఆవరించింది. అయినప్పటికీ కబీర్ బిస్వాస్ తన ఆత్మవిశ్వాసంతో కంపెనీని ముందుకు తీసుకుపోవడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు.

అలర్ట్​ - త్వరలో కిలో వెండి ధర రూ.1లక్ష దాటే ఛాన్స్​! - Silver Price Forecast

టాటా, మారుతి, హోండా కార్లపై భారీ ఆఫర్స్​ - ఆ మోడల్​​పై ఏకంగా రూ.4 లక్షలు డిస్కౌంట్​! - Car Discounts

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.