Theft in Mobile Showroom at Kukatpally : ఖరీదైన ఫోన్లంటే ఎవరికైనా ఇష్టమే.. మార్కెట్లో వాటికున్న డిమాండే వేరు. ఖరీదు ఎంతైనా వాటిని కొనేవారు ఉన్నారు. కానీ కొందరు వాటికోసం అడ్డదారులు తొక్కుతూ చోరీలకు పాల్పడుతున్నారు. మొబైల్ షోరూం తాళాలు పగులగొట్టి.. విలువైన ఫోన్లు చోరీ చేసిన ఘటన కూకట్పల్లిలో చోటుచేసుకుంది. శనివారం రాత్రి కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని.. కేపీహెచ్బీ కాలనీ రోడ్నంబర్ వన్లోని హజిల్ మొబైల్ షోరూంలో దొంగతనం జరిగింది. దుండగుడు రాత్రివేళ షోరూం తాళాలు పగులగొట్టి.. ఖరీదైన 18 యాపిల్ ఐ ఫోన్లు, 2 శాంసంగ్ ఫోన్లను చోరీ చేశారు. ఈ విజువల్స్ సీసీటీవీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. చోరీకి గురైన సెల్ ఫోన్ల విలువ సుమారు 20 లక్షల రూపాయల వరకు ఉంటుందని షోరూం సిబ్బంది తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.