Hyderabad Rains problems for motorists : హైదరాబాద్లో సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం అల్లాడిపోయింది. జంట నగరాల్లో సుమారు 2గంటల పాటు కురిసిన కుండపోత వర్షానికి రోడ్లు వాగుల వలే దర్శనం ఇచ్చాయి. ముఖ్యంగా కార్యాలయాలు విడిచి పెట్టిన సమయం కావడంతో వాహనాలు రోడ్లపై బారులు తీరాయి. పరిస్థితిని గమనించి కొందరు కార్యాలయాలకే పరిమితమయ్యారు. గచ్చిబౌలి, మాదాపూర్ వంటి ఐటీ ఏరియాలో సుమారు గంటల కొద్ది వాహనదారులు రోడ్లపైనే నిలిచిపోయారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర స్వయంగా వచ్చి ట్రాఫిక్ను చక్కదిద్దారంటే పరిస్థితి ఎంతలా మారిందో అర్ధం చేసుకోవచ్చు. గ్రేటర్ పరిధిలోని కొన్ని బస్ స్టాప్లు, మెట్రో స్టాప్ వద్దకు వర్షం నీరు చేరింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడటంతో పలు బస్తీలతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. కొన్ని ఇళ్లలోకి నీరు కూడా చేరింది. జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. నాలాలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న దృష్ట్యా తల్లిదండ్రులు వారి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని బయటకు పంపవద్దని అధికారులు సూచించారు. వాహనదారులు రెగ్యులర్ రూట్లోనే ఇంటికి వెళ్లాలని.. కొత్త మార్గంలో వద్దని పోలీసులు సూచించారు.