Hanuman Jayanti celebrations in Kondagattu : జగిత్యాల జిల్లా కొండగట్టు క్షేత్రంలో హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అంజన్నను దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తండోపతండాలుగా తరలి వస్తున్నారు. హునుమాన్ దీక్షాపరులతో కొండగట్టు క్షేత్రం కిక్కిరిసింది. జై శ్రీరామ్ నినాదాలతో గుట్ట మార్మోమోగుతోంది. నిన్న సాయంత్రం నుంచే భక్తుల అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకునేందుకు తరలి రావడంతో రద్దీ మొదలైంది. అంజన్న దీక్షాపరులు మాల విరమణ చేసి.. మొక్కులు తీర్చుకుంటున్నారు.
జయంతి సందర్భంగా తిరుమంజనం, ద్రావిడ ప్రబంధ పారాయణం, అభిషేకం నిర్వహించారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ స్వామి వారికి 108కిలోల పండ్లతో అభిషేకం నిర్వహించారు. చమేలీ తైలంతో చందనాలంకరణ చేశారు. యాగశాలలో స్థపన తిరుమంజనం, లక్ష తమలపాకులతో అర్చన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కోనేరులో నీరు ఎప్పటికప్పుడు మార్చుతున్నారు. ఆలయంలో కల్పించే సౌకర్యాల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.