Etela Rajender Comments on KCR : రాష్ట్రవ్యాప్తంగా అవతరణ వేడుకలు, దశాబ్ది ఉత్సవాల సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగిన వేడుకల్లో.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఈటల రాజేందర్ పాల్గొన్ని జాతీయ జెండాను ఎగురవేశారు.
కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రంలోని ప్రజల హక్కులు హరించబడ్డాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ఆత్మగౌరవం మంటకలిసిందని విమర్శించారు. గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా లేని నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజానీకం యావత్తు పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్లుగా భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆనాడు తెలంగాణ సాధన కోసం వందలాది మంది బలిదానం చేశారని గుర్తు చేశారు. కానీ సాధించుకున్న రాష్ట్రంలో ప్రజల హక్కులను అణచివేస్తున్నారని ఆక్షేపించారు. అందుకే ఈ క్రమంలోనే ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సమాయత్తమవుతున్నారని ఈటల రాజేెెందర్ వెల్లడించారు.