ETV Bharat / state

Etela Rajender: "ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలు, రైతు సంఘాలంటే చిన్నచూపు"

author img

By

Published : Apr 29, 2023, 5:18 PM IST

Etela Rajender criticized KCR: రైతుల విషయంలో ప్రభుత్వం సమయానికి ఆదుకోవట్లేదని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ విమర్శించారు. కొనుగోలు కేంద్రాలు సక్రమంగా లేనందున అన్నదాతలు దళారులను ఆశ్రయిస్తున్నారుని తెలిపారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని ఈటల డిమాండ్ చేశారు.

BJP MLA Etala Rajender
BJP MLA Etala Rajender

Etela Rajender criticized KCR: ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలు, రైతు సంఘాలంటే చిన్నచూపని ఎద్దేవా చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేయలేదని, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఈటల ధ్వజమెత్తారు. వరి మద్దతు ధర రూ.2020లు ఉండగా, కొనుగోలు కేంద్రాలు సక్రమంగా లేకపోవటంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారన్నారు. దళారులు రూ.1300 నుంచి రూ.1600ల వరకు విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల పంట నష్టం విషయంలో కేసీఆర్​ స్పందించాలి: ప్రతిపక్ష పార్టీలు ఏదైనా మాట్లాడితే వారిపై దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయని, చేతికందిన ధాన్యం వర్షం నీటిలో కొట్టుకపోతుంటే రైతులు ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలను ఆదుకోవాల్సింది పోయి మంత్రులు, ఎమ్మెల్యేలు విందులు చేసుకుంటున్నారని ఈటల విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లను ముమ్మరం చేయాలని, తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఈటల డిమాండ్‌ చేశారు.

"రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచే విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. రైతులు పండించిన పంటను కొనాలనే ఆలోచనతో లేదు. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రతిపక్షాలు, రైతు సంఘాలంటే చిన్నచూపు ఎందుకో?. అధికార పార్టీ తమకి అన్ని తెలుసు అనే అహంకార పద్ధతిలో వెళ్తుంది. వేసవిలో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి. దీంతో రైతులు పంట నష్టపోతున్నారు. కోసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర సరైనా సౌకర్యాలు లేక తడిచి పోతున్నాయి. ప్రభుత్వ తరఫున సరైనా ఆదేశాలు లేక లక్షల క్వింటాల ధాన్యం రోడ్ల మీద నీళ్లలో కొట్టుకుపోతుంది. రైతులందరూ దిక్కుతోచని పరిస్థితికి వచ్చేశారు. వారికి ఏమి చెయ్యాలో అర్ధం కావట్లేదు. రాష్ట్రం పరిస్థితి ఇలా ఉంటే బీఆర్​ఎస్​ నాయకులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. గ్రామాల్లో విందులు పెట్టి పండగలు చేసుకుంటున్నారు. అంతే తప్ప రైతుల సమస్యలు పట్టించుకోవట్లేదు. గ్రామాల్లో చూస్తే విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రతిపక్ష నాయకులపైన విరుచుకుపడడం కాదు రైతుల సమస్యలను తీర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ని నేను డిమాండ్ చేస్తున్నాను."- ఈటల రాజేందర్, హుజూరాబాద్​ ఎమ్మెల్యే

రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన ఈటల రాజేందర్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.