దసరా వరకు స్తంభోద్భవుడి ఆలయాన్ని ప్రారంభించేందుకు యాడా(ytda) కసరత్తు చేస్తోంది. యాదాద్రి(yadadri) శ్రీలక్ష్మి నరసింహ స్వామి(sri lakshmi narasimha swamy) ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. సప్తగోపురాలతో నారసింహుని ప్రధాన ఆలయ పనులు 95 శాతానికి పైగా పూర్తయ్యాయి. అనుబంధ శివాలయం దాదాపుగా పూర్తయింది. ప్రెసిడెన్షియల్ సూట్స్, బాహ్య వలయ రహదారి, పెద్దగుట్టపై నిర్మిస్తున్న ఆలయ నగరి పనులు తుది దశలో ఉన్నాయి.
సీఎం ఆదేశం
నెలన్నర క్రితం యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్(cm kcr) మరో రెండు నెలల్లో పనులన్నీ పూర్తి చేయాలని అధికారులు, ఇంజినీర్లను ఆదేశించారు. ఈ నేపథ్యంలో దసరాకు ఆలయ ఉద్ఘాటన ఉండే అవకాశమున్నట్లు సంబంధిత యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (ytda) వర్గాలు 'ఈనాడు-ఈటీవీ భారత్'కి వెల్లడించాయి.
పక్కా వాస్తు
పాంచరాత్ర ఆగమ, సంఖ్యా శాస్త్రం ప్రకారం 2.33 ఎకరాల విస్తీర్ణంలో కాకతీయుల శిల్పకళ ఉట్టి పడేలా ప్రధానాలయం పూర్తిగా కృష్ణశిలతో నిర్మించారు. మాడ వీధులు, ప్రాకారాలతో కలిపి క్షేత్రం 4.3 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. గర్భాలయం ఎదుట 12 మంది ఆళ్వారుల శిల్పాలు, మహాముఖ మండపం, రాజ గోపురాలు, దివ్యవిమాన గోపురాల నిర్మాణం పూర్తయింది. ప్రధానాలయానికి రెండు ప్రాకారాలతో పాటు నలువైపులా నిర్మించిన సాలాహారాల్లో దివ్య దేశాలు (వైష్ణవానికి సంబంధించిన ఆలయాలు), దశావతారాలు, నారసింహుడి రూపాలు పొందుపర్చారు.
తుది దశలో పనులు
గర్భాలయానికి 17 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పు ఉండే ఎత్తయిన ద్వారాలు బిగించారు. వీటికి బంగారు తాపడం చేసే పనులు పూర్తి చేశారు. మహా ముఖమండపం ఎదుట ఆండాళమ్మ, రామానుజుడు, ఆళ్వారుల విగ్రహాలు, క్షేత్రపాలక ఆంజనేయస్వామి ఉప ఆలయాల నిర్మాణాలూ ఇప్పటికే పూర్తయ్యాయి. గర్భాలయ ప్రవేశ ద్వారంపైన శంకు, చక్ర నామాలతో పాటు శ్రీస్వామి భక్తులను స్వాగతించేలా గరుడ ఆళ్వార్లు, ఆంజనేయ స్వామి విగ్రహాలు రూపొందించారు. ప్రధానాలయం బయట ఫ్లోరింగ్ పనులు పూర్తయ్యాయి. పట్టణం నుంచి కొండపైకి వెళ్లేందుకు మెట్ల మార్గం, ఈ దారిలో రాజగోపుర నిర్మాణం తుది దశకు చేరుకుంది. గోపురాలపై కలశాల ఏర్పాటు, బలి పీఠం, ధ్వజస్తంభం ఏర్పాటు ఉద్ఘాటన సమయంలోనే చేయనున్నారు.
కృష్ణశిలతోనే శివాలయం..
ప్రధానాలయానికి అనుబంధంగా పునర్నిర్మి స్తున్న శివాలయం కృష్ణశిలతోనే సిద్ధమవు తోంది. ఇదే ఆవరణలో పరివార దేవాలయాలైన గణపతి, ఆంజనేయస్వామి, నవగ్రహాలు, యాగశాలలు నిర్మిస్తున్నారు. సాలహారాల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, శైవ సంబంధ విగ్రహాలను అమర్చాలని స్థపతులు నిర్ణయించారు. శివాలయ నిర్మాణ పనులు 90 శాతానికి పైగా పూర్తయ్యాయి.