తెలంగాణ

telangana

Kishan Reddy: జన ఆశీర్వాదానికి కిషన్​రెడ్డి... రేపటి నుంచే యాత్ర ప్రారంభం

By

Published : Aug 18, 2021, 10:00 PM IST

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్​రెడ్డి జన ఆశీర్వాద యాత్ర చేయనున్నారు. గురువారం తిరుమల శ్రీవారిని, విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు సూర్యాపేట జిల్లా కోదాడ అసెంబ్లీ నియోజకవర్గంలోని నల్లబండ గూడానికి చేరుకుంటారు. అక్కడి నుంచి జన ఆశీర్వాద యాత్ర ప్రారంభిస్తారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ విజయాలు, సంక్షేమ కార్యక్రమాలను జనఆశీర్వాద యాత్ర ద్వారా ప్రజలకు కిషన్ రెడ్డి వివరించనున్నారు.

Central minister
కిషన్

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా పదోన్నతి పొందిన తరువాత కిషన్ రెడ్డి (Kishan Reddy)తొలిసారిగా తెలంగాణ పర్యటన (Telangana Tour)కు రేపు (గురువారం) రాబోతున్నారు. కిషన్​రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు రాష్ట్ర సరిహద్దులోని నల్లబండగూడెం (Nallabanda Gudem) వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు సాగనున్న యాత్రలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాష్ట్రానికి కేంద్రం చేసిన సహాయాన్ని ప్రజలకు వివరించనున్నారు.

305 కిలోమీటర్ల మేర...

12 జిల్లాలు 17 అసెంబ్లీ, 8 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 305 కిలోమీటర్ల మేర యాత్ర జరగనుంది. యాత్రలో భాగంగా 40 చోట్ల సభలు ఏర్పాట్లు చేశారు. యాత్రలో భాగంగా రేపు సేంద్రీయ వ్యవసాయంలో జాతీయ అవార్డు గ్రహీతను కోదాడలో సన్మానిస్తారు. అక్కడి నుంచి యాత్ర సూర్యాపేట చేరుకుని రాత్రి బస చేస్తారు.

సూర్యాపేటలో ప్రారంభమై...

శుక్రవారం సూర్యాపేటలో జన ఆశీర్వాద యాత్ర ప్రారంభమై మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి, తోర్రురు మీదగా రాయపర్తి వద్ద వరంగల్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అనంతరం వర్ధన్నపేట మీదగా వరంగల్ భద్రకాళి దేవాలయానికి చేరుకుంటుంది. భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయంలో పూజలు చేసి అదాలత్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి నేరుగా జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఖిలాశాపూర్ కోటను సందర్శిస్తారు.

బహిరంగ సభతో ముగింపు...

అక్కడి నుంచి జనగామ జిల్లా మీదుగా యాత్ర ఆలేరుకు చేరుకుంటుంది. ఆలేరులో చేనేత కార్మికుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింద మల్లేశాన్ని కలిసి సన్మానిస్తారు. ఆలేరు నుంచి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకుంటారు. అక్కడే రాత్రి బస చేస్తారు. జన ఆశీర్వాద యాత్రలో భాగంగా 21న యాత్ర యాదాద్రిలో ప్రారంభమై ఘట్​కేసర్, ఉప్పల్ మీదుగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి ప్రవేశిస్తుంది. సాయంత్రం 6 గంటలకు భాజపా రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటుంది. పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభతో యాత్ర ముగుస్తుంది.

ఇదీ చదవండి:Anganwadi: అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తల వేతనాలు 30 శాతం పెంపు

ABOUT THE AUTHOR

...view details