తెలంగాణ

telangana

చివరి రక్తంబొట్టు ధారపోసైనా దేశాన్ని సరైన మార్గంలో పెడతా: కేసీఆర్​

By

Published : Feb 23, 2022, 4:14 PM IST

CM KCR on National Politics: భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కర్ణాటకలో మతకల్లోలం సృష్టించారని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. కులాలు, మతాల పేరిట చిచ్చుపెట్టడం మంచిదికాదని హితవు పలికారు. కేంద్రంలో ధర్మంతో పనిచేసే ప్రభుత్వం ఉండాలని... జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేలా ముందుకెళ్తున్నామన్నారు. చివరి రక్తంబొట్టు ధారపోసైనా దేశాన్ని సరైన మార్గంలో పెడతానని స్పష్టం చేశారు.

cm kcr
cm kcr

చివరి రక్తంబొట్టు ధారపోసైనా దేశాన్ని సరైన మార్గంలో పెడతా: కేసీఆర్​

CM KCR on National Politics : దేశం దారి తప్పి పోతోందని సీఎం కేసీఆర్​ వ్యాఖ్యానించారు. దేశంలో జుగుప్సాకరమైన పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వాల కృషి వల్ల బెంగళూర్ సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అయ్యిందని గుర్తు చేశారు. కానీ మతకల్లోల వల్ల విద్యా సంస్థలు మూత పడ్డాయని అన్నారు. కర్ణాటకలో మతకల్లోలం సృష్టించారని విమర్శించారు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేలా ముందుకెళ్తున్నామని తెలిపారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు.

అధ్బుతమైన పరిశ్రమలు వస్తున్నాయి

తెలంగాణకు అధ్బుతమైనపరిశ్రమలు వస్తున్నాయని సీఎం తెలిపారు. దేశంలో అతి తక్కువ నిరుద్యోగిత ఉన్న రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. రాష్ట్రాలు బాగుండాలంటే.. కేంద్రం బాగుండాలని అన్నారు. మత కల్లోలాలు.. గొడవలు ఉంటే పరిశ్రమలు రావని చెప్పారు. ఇటువంటి పరిస్థితులు రానివ్వొద్దని పేర్కొన్నారు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

'కులాలు, మతాల పేరిట చిచ్చుపెట్టడం మంచిదికాదు. కేంద్రంలో ధర్మంతో పనిచేసే ప్రభుత్వం ఉండాలి. చివరి రక్తంబొట్టు ధారపోసైనా దేశాన్ని సరైన మార్గంలో పెడతా. దేశాన్ని రుజుమార్గంలో పెట్టడానికి సర్వశక్తులు ఒడ్డుతా. సకల మేథో సంపత్తులు ఉపయోగిస్తా.' - కేసీఆర్‌

రెండో స్థానంలో హైదరాబాద్‌

దేశం అబ్బురపడేలా తెలంగాణ ఆవిష్కృతమైందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో మాతాశిశు మరణాలు చాలా వరకు తగ్గాయని వివరించారు. పది లక్షల పేదింటి ఆడ బిడ్డల పెళ్లిళ్లు చేశామని పేర్కొన్నారు. 10 లక్షల కుటుంబాలకు కేసీఆర్‌ కిట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. సాగు, తాగునీరు, విద్యుత్‌ రంగాల్లో పురోగతి సాధించామన్నారు. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్‌ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ అని సీఎం స్పష్టం చేశారు. సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల్లో హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉందని చెప్పారు. శంషాబాద్‌ విమానాశ్రయం నాలుగో లార్జెస్ట్‌ డెస్టినేషన్‌గా నిలిచిందని వెల్లడించారు.

ఇదీ చదవండి :మల్లన్నసాగర్‌ కాదు..ఇది తెలంగాణ జలసాగర్‌: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details