సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని శంభుని గుట్టపై వెలసిన విద్యా సరస్వతి అమ్మవారి ఆలయం వసంత పంచమి వేడుకల కోసం ముస్తాబైంది. సామూహిక అక్షరాభ్యాసాలకు సర్వం సిద్ధమైంది. విద్యా సరస్వతి ఆలయంలో వసంత పంచమిని పురస్కరించుకొని అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
వర్గల్ విద్యాధరి ఆలయంలో ఉదయం 4 గంటల నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వేకువజామున గణపతి పూజతో ప్రారంభమై అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం, అలంకరణ, చండీ హోమం, లక్ష పుష్పార్చన, 56 రకాల నైవేద్యాలతో నివేదన కార్యక్రమాలు వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా జరగనున్నాయి.