తెలంగాణ

telangana

MLA Jaggareddy: 'కాంగ్రెస్​కు రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేదే లే'

By

Published : Feb 20, 2022, 5:06 AM IST

Updated : Feb 20, 2022, 6:57 AM IST

Mla Jaggareddy: కాంగ్రెస్​కు రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సీనియర్​ నేతల సూచనలతో తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నట్లు వెల్లడించారు. దిల్లీ పెద్దలను కలిసిన తర్వాత మరోసారి నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు. 10 రోజుల తర్వాతైనా రాజీనామా విషయంలో మార్పు ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు.

Mla Jaggareddy
Mla Jaggareddy

MLA Jaggareddy: 'కాంగ్రెస్​కు రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేదే లే'

Mla Jaggareddy: రాష్ట్ర కాంగ్రెస్​లో మరోసారి ముసలం మెుదలైంది. సంగారెడ్డి ఎమ్మెల్యే, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు జగ్గారెడ్డి.. శుక్రవారం సాయంత్రం ఉన్నపలంగా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. తెరాస కోవర్టుగా కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారం రాస్తూ.. అవమానాలకు గురి చేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో పార్టీలో ఉండలేనని స్పష్టం చేశారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో చర్చించిన తర్వాత.. రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జగ్గారెడ్డి.. కొందరి నేతల తీరు వల్ల భారమైనా.. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు.

వెనక్కి తగ్గేదే లే..

జగ్గారెడ్డి నిర్ణయంతో సీనియర్ నేతలు ఆయనను బుజ్జగించే పనిలోపడ్డారు. వి. హనుమంతరావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్​తో కలిసి.. జగ్గారెడ్డి ఇంటికి వెళ్లారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీలో ఉండి కొట్లాడదామని.. అందుకు మద్దతిస్తామని తెలిపారు. అనంతరం ఉత్తమ్​కుమార్ రెడ్డి ఇంట్లో మరో వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్​కుమార్.. జగ్గారెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కాంగ్రెస్​లో తనపై చేస్తున్న దుష్ప్రచారం.. మానసికంగా ఇబ్బందులకు గురి చేసిందని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చానని.. అందుకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. కొంతకాలం వేచి చూడాలని.. దిల్లీకి వెళ్లి అభిప్రాయాలు చెప్పాలని నేతలు సూచించారు. ఈ క్రమంలో 10 రోజులు ఆలస్యంగా నిర్ణయం ప్రకటిస్తానేమో కానీ.. వెనక్కి తగ్గేది లేదని జగ్గారెడ్డి పునరుద్ఘాటించారు.

పార్టీ కోసం కష్టపడితే.. దోషిగా చూస్తున్నారు..

కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జగ్గారెడ్డి.. రాష్ట్ర కాంగ్రెస్​లో జరుగుతున్న పరిణామాలను ఏకరవు పెడుతూ సోనియా, రాహుల్ గాంధీ, పార్టీ ఇన్ ఛార్జీలు కేసీ వేణుగోపాల్, మాణిక్కం ఠాగూర్​కు లేఖ రాశారు. పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న తనను దోషిగా చూస్తుండటం ఆవేదనకు గురి చేస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు.

కలసి ఉంటేనే.. కలదు విజయం..

జగ్గారెడ్డి వ్యవహారంలో నేతలు సంయమనం పాటించాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్కం ఠాగూర్ కోరారు. ఈ అంశంలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ సలహాలు, సూచనలను అంతా గౌరవించాలని సూచించారు. ఎవరైనా అధిష్టానంతో చెప్పాల్సిన అంశాలను మీడియా ద్వారా మాట్లాడకూడదని స్పష్టం చేశారు. అందరం కలిసి ఉంటేనే 2023 ఎన్నికల్లో గెలుపు సాధ్యం అని ఠాగూర్ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఎమ్మెల్యే రాజాసింగ్​పై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని ఈసీ ఆదేశం

Last Updated :Feb 20, 2022, 6:57 AM IST

ABOUT THE AUTHOR

...view details