తెలంగాణ

telangana

'నాన్నా.. అమ్మ ఎక్కడికెళ్లింది'.. ఇబ్రహీంపట్నం ఘటనతో ఆరిన ఇంటిదీపాలు

By

Published : Aug 31, 2022, 9:43 AM IST

Ibrahimpatnam Incident News
Ibrahimpatnam Incident News

Ibrahimpatnam Incident News : అందరివీ పేద కుటుంబాలే.. రెక్కాడితే గానీ డొక్కాడని జీవితాలు.. ఒకరికి ఉండటానికి సొంతిల్లు లేదు.. మరో కుటుంబంలో ఆ మహిళ కూలీపని చేస్తేనే ఇల్లు గడుస్తుంది.. అందరికీ చిన్న పిల్లలున్నారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లే స్తోమత లేక.. ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. అదే వారికి శాపమైంది.

Ibrahimpatnam Incident News: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకున్న ఘటనలో నలుగురు మహిళల మృతితో ఆ నాలుగు కుటుంబాల్లోనూ ఇంటిదీపాలు ఆరిపోయాయి. ‘‘నాన్నా.. అమ్మ ఎక్కడికెళ్లింది? ఎందుకు నిద్రపోతోంది? లేవడం లేదేం! అమ్మా.. అమ్మా.. పైకిలే అమ్మా.. నన్ను చూడు. అక్కను చూడు. తమ్ముణ్ని చూడు’’ అంటూ లావణ్య మృతదేహం వద్ద ఆమె కుమార్తె రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది.

Family Planning Operation Incident : మంచాల మండలం లింగపల్లికి చెందిన సుష్మకు ఆరేళ్ల కిందట ఈశ్వర్‌తో వివాహమైంది. భర్త ఇటుకల వ్యాపారం చేస్తుంటాడు. సుష్మ కూలీ పనులకు వెళ్తుండేది. వీరికి నాలుగేళ్ల కుమారుడు, రెండేళ్ల పాప ఉన్నారు. కు.ని. ఆపరేషన్‌ వికటించి ఆమె చనిపోవడంతో పిల్లలు తల్లి లేని వారయ్యారు. అచేతనంగా ఉన్న తల్లిని చూస్తూ నాలుగేళ్ల కుమారుడు భోరున రోదించాడు. అమ్మ కావాలంటూ రెండేళ్ల పాప విలపించడం గ్రామస్థులకు కన్నీళ్లు తెప్పించింది.

అంత్యక్రియలకూ డబ్బుల్లేక..లావణ్య కుటుంబం ఇబ్రహీంపట్నం పురపాలికలోని సీతారాంపేట్‌లో నివాసముంటోంది. ఆరేళ్ల కిందట లింగస్వామితో వివాహమైంది. అద్దె ఇంట్లో ఉంటోంది. కడు పేదరికం. దంపతులిద్దరూ వ్యవసాయం, కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు అక్షర(6), భావన(4), అనిరుధ్‌(9 నెలలు) ఉన్నారు. ఏడాది కూడా నిండని కుమారుడిని ఎలా చూసుకోవాలని లింగస్వామి కన్నీరుమున్నీరయ్యారు. లావణ్య అంత్యక్రియలు చేసేందుకు డబ్బుల్లేకపోవడంతో గ్రామస్థులు చందాలు వేసుకుని ఆర్థికసాయం అందించారు.

పిల్లలను ఎలా సముదాయించాలి..మాడ్గుల మండలం కొలుకులపల్లి పంచాయతీ పరిధిలోని రాజీవ్‌నగర్‌ తండాకు చెందిన మౌనికకు నాలుగేళ్ల కిందట శ్రీనివాస్‌ నాయక్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు మానుశ్రీ(3), గౌతమ్‌ (15 నెలలు) ఉన్నారు. శ్రీనివాస్‌ నాయక్‌ వ్యవసాయం, కూలీ పనులు చేస్తుంటాడు. సొంత ట్రాక్టర్‌ కొనుగోలు చేశాడు. మౌనిక భర్తతో కలిసి పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేది. అమ్మ కోసం ఏడుస్తున్న పిల్లలను ఎలా సముదాయించాలో తెలియడం లేదని శ్రీనివాస్‌ నాయక్‌ భోరున విలపిస్తున్నారు.

కలలు నెరవేరకుండానే..మాడ్గుల మండలం నర్సాయపల్లిలో ఉండే మమత, మల్లేష్‌గౌడ్‌లకు అయిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు వర్షిత్‌(4), విహాన్‌(2) ఉన్నారు. పేద కుటుంబానికి చెందిన మల్లేష్‌గౌడ్‌ వ్యవసాయం చేసుకుంటూ.. డీసీఎం వ్యాన్‌ నడుపుకొంటున్నాడు. వ్యవసాయంలో భర్తకు చేదోడువాదోడుగా మమత ఉండేది. పిల్లలను మంచి చదువులు చదివించాలన్న కలలు తీరకుండానే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.

ఇవీ చదవండి:ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రి ఘటనలో 4కు చేరిన మృతులు

వికటించిన కుని ఆపరేషన్, ఇద్దరు మృతి, ఒకరి పరిస్థితి విషమం

నలుగురిని పొట్టనబెట్టుకున్న 'కుని' శస్త్రచికిత్సలు.. కారణాలేంటి..?

'భర్త పనిచేసే ఆఫీసుకెళ్లి మరీ భార్య వేధించడం క్రూరత్వమే'

ABOUT THE AUTHOR

...view details