తెలంగాణ

telangana

భాజపా ముక్త్ భారత్‌ కోసం సన్నద్ధం కావాలని కేసీఆర్‌ పిలుపు

By

Published : Aug 29, 2022, 5:04 PM IST

Updated : Aug 29, 2022, 10:30 PM IST

CM KCR Fires on pm modi in peddapally trs public meeting

CM KCR Fires on MODI సీఎం కేసీఆర్ మరోసారి ప్రధాని మోదీపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. భాజపాను పారద్రోలి రైతు ప్రభుత్వం రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా తెరాస బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్, మోదీపై విరుచుకుపడ్డారు. గోల్‌మాల్‌ ప్రధాని చెప్పేవన్నీ అబద్ధాలే అని విరుచుకుపడ్డారు.

భాజపా ముక్త్ భారత్‌ కోసం సన్నద్ధం కావాలని కేసీఆర్‌ పిలుపు

CM KCR Fires on MODI: తెలంగాణ ఏర్పడ్డాక కలలో కూడా ఊహించని అనేక కార్యక్రమాలు నిర్వహించామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలో తెరాస బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్... పెద్దపల్లిలో ఉద్యమ సమయంలో అనేకసార్లు జెండా ఎగురవేశానని గుర్తు చేసుకున్నారు. సింగరేణిలో వేల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయని తెలిపారు. సింగరేణి కార్మికులకు భారీగా బోనస్‌ అందజేస్తున్నామన్నారు. పెద్దపల్లిలో మున్సిపాలిటీలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ఇదే సందర్భంగా మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

''ఇటీవల జాతీయ రైతు నాయకులు నన్ను కలిశారు. జాతీయ పార్టీలోకి రావాలని కోరుతున్నారు. గుజరాత్‌ మోడల్ అని చెప్పి దేశ ప్రజలను దగా చేస్తున్నారు. గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు అడ్డగోలుగా పెంచారు. రూ.లక్షల కోట్ల మేర కుంభకోణాలు చేస్తున్నారు. మద్యపానం నిషేధం విధించిన రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారింది. కల్తీ మద్యంతో 70 మంది మృతికి కేంద్రం జవాబు చెప్పాలి. కేంద్ర ప్రభుత్వ హయాంలో దోపిడీ తప్ప మరొకటి లేదు. 60 ఏళ్లు కొట్లాడి తెలంగాణ ఆత్మగౌరవం సాధించాం. దేశ ఆర్థిక విలువ దిగజార్చి.. రూపాయి విలువ పతనం చేశారు. మోసపోతే గోసపడుతాం..'' -కేసీఆర్, ముఖ్యమంత్రి

CM KCR Fires on BJP భాజపాను పారద్రోలి రైతు ప్రభుత్వం రాబోతోందన్న కేసీఆర్... గోల్‌మాల్‌ ప్రధాని చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. దేశంలోని రైతులు సాగుకు వాడే విద్యుత్‌ 20.8 శాతమేనని తెలిపారు. దేశంలో సాగుకు వాడే విద్యుత్‌ ఖరీదు రూ.1.45 లక్షల కోట్లు అని వెల్లడించారు. కార్పొరేట్‌ దొంగలకు దోచి పెట్టినంత సొమ్ము కాదని విమర్శించారు. మోటార్లకు మీటర్లు పెట్టాలన్న మోదీకే మీటర్‌ పెట్టాలని కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

''జాతీయ రాజకీయాల్లోకి రావాలని రైతు సంఘాల నేతలు కోరారు. మీటర్లు లేని విద్యుత్‌ సరఫరా చేయాలని రైతులు కోరారు. ఎన్‌పీఏల పేరుతో రూ.12 లక్షల కోట్లు దోచి పెట్టారు. రైతులకు ఇవ్వడానికి మాత్రం కేంద్రానికి చేతులు రావట్లేదు. సింగరేణి ప్రైవేటీకరణ కుట్రను భగ్నం చేయాలి. భాజపా ముక్త్ భారత్‌ కోసం అందరూ సన్నద్ధం కావాలి'' -కేసీఆర్, ముఖ్యమంత్రి

CM KCR Comments పెద్దపల్లిలోని ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు అందుతాయని తెలిపారు. గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. రామగుండం కార్పొరేషన్‌కు రూ.కోటి మంజూరు చేసినట్లు చెప్పారు. మూడు మున్సిపాలిటీలకు రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు.

అంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి జిల్లాలో రూ. 48 కోట్లతో నిర్మించిన సమీకృత కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించారు. పెద్దపల్లి శివారులోని పెద్దబొంకూరు వద్ద 21 ఎకరాల సువిశాల విస్తీర్ణ స్థలంలో నిర్మించిన కార్యాలయాల సముదాయంలో ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో పాటు ఉన్నతాధికారులు వచ్చారు. అనంతరం మంథని రోడ్డులో నిర్మించనున్న తెరాస కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఇవీ చూడండి:

Last Updated :Aug 29, 2022, 10:30 PM IST

ABOUT THE AUTHOR

...view details