ETV Bharat / spiritual

కోర్కెలు తీర్చే 'కురుడుమలై' గణపతి! జీవితంలో ఒక్కసారైనా బుధవారం రోజు అక్కడికి వెళ్లాల్సిందే!! - KURUDUMALE GANESHA TEMPLE

author img

By ETV Bharat Telugu Team

Published : May 1, 2024, 6:40 AM IST

Kurudumale Ganesha Temple
Kurudumale Ganesha Temple

How To Reach Kurudumale Ganesha Temple : గణపతిని ప్రార్థిస్తే విఘ్నాలు తొలగి సకల కార్యసిద్ధి కలుగుతుందని నమ్మకం. గణపతి ప్రార్థన లేనిదే ఏ శుభకార్యం మొదలుపెట్టరు. కోరిన కోర్కెలు వెంటనే తీరాలన్నా, పనుల్లో ఆటంకాలు తొలగాలన్నా జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా కురుడుమలై గణపతిని దర్శించుకోవాల్సిందే! ఇంతకూ ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ క్షేత్ర విశేషాలేంటో తెలుసుకుందాం!

How To Reach Kurudumale Ganesha Temple : వినాయకుని ప్రార్థిస్తే విఘ్నాలు తొలగి పోతాయని అంటారు. కొన్నేళ్లుగా అనుకున్న పనులు జరగక ఆటంకాలతో విసిగిపోయి ఉంటే 'కురుడుమలై' గణపతి ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం. అంతేకాదు ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించి స్వామి ఆశీస్సులు తీసుకుంటే ఎంత కష్టమైన పని అయినా నిర్విఘ్నంగా జరుగుతుందని ఆలయ చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది.

ఈ ఆలయం ఎక్కడ ఉంది?
కురుడుమలై గణపతి ఆలయం బెంగళూరు విమానాశ్రయం నుంచి సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఉంది. బెంగళూరు నుంచి 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత కోలూరు జిల్లా ముళబాగిలు సమీపంలో కురుదుమలె గణపతి ఆలయం వెలసి ఉంది.

త్రిమూర్తి ప్రతిష్ఠిత శక్తి గణపతి!
కురుడుమలై ఆలయంలోని గణపతి విగ్రహం ఏక సాలగ్రామ శిలపై చెక్కిన 14 అడుగుల భారీ విగ్రహం. ఈ విగ్రహాన్ని సాక్షాత్తు త్రిమూర్తులు ప్రతిష్ఠించారని స్థల పురాణం ద్వారా మనకు తెలుస్తుంది.

ఆలయ స్థల పురాణం
త్రిపురాసుర సంహారానికి ముందు త్రిమూర్తులు ఈ గణపతిని దర్శించుకొని విఘ్నాలు తొలగించుకున్నారని స్థలపురాణం ద్వారా మనకు తెలుస్తోంది. అలాగే త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, పాండవులు కూడా కురుదుమలె గణపతిని దర్శించి సేవించినట్లుగా స్థల పురాణం ద్వారా తెలుస్తుంది.

కృష్ణదేవరాయల ప్రాకారం
ఒకానొకప్పుడు శ్రీ కృష్ణదేవరాయలకు ఈ గణపతి స్వప్నంలో కనిపించి తన ఆలయానికి ప్రాకారం నిర్మించమని చెప్పాడట! లంబోదరుని ఆదేశం మేరకు రాయలవారు ఇక్కడ ఆలయానికి ప్రాకారం నిర్మించారని ఇక్కడ ఉన్న శాసనాల ద్వారా తెలుస్తుంది.

ప్రాచీన మందిరం
కురుడుమలై గణపతి ఆలయం అతి ప్రాచీనమైనదని, ఈ గుడి సుమారు 2000 ఏళ్ల కిందటిదని ఆర్కియాలజీ వారు నిర్ధరించారు. పూర్వంలో ఈ ఆలయాన్ని కూటాద్రి అని పిలిచేవారని, కాలక్రమేణా ఇదే కురుదుమలె గా మారిందని అంటారు.

నడిరాతిరి ఓంకార నాదం
ఈ ప్రాంతంలోని భక్తుల విశ్వాసం ప్రకారం కౌండిన్య మహాముని ఇప్పటికీ ఈ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నారని, కురుడుమలై గణపతి ఆలయానికి ప్రతిరోజూ రాత్రి సమయంలో వచ్చి స్వామిని దర్శంచుకుంటారని అంటారు. ఇందుకు నిదర్శనంగా ఇప్పటికీ అర్థరాత్రి సమయంలో గుడి లోపలి నుంచి స్తోత్రాలు వినిపిస్తాయని, ఓంకారం ప్రతిధ్వనిస్తుందని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఇక విశేష పర్వదినాలలో ముక్కోటి దేవతలంతా వచ్చి గణపయ్యను సేవిస్తారని చెబుతుంటారు.

సోమేశ్వర ఆలయం
కురుడుమలై ఆలయం సమీపంలో కౌండిన్య మహర్షి ప్రతిష్ఠించిన సోమేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలో సోమేశ్వర స్వామి, అమ్మవారిని కూడా దర్శించుకొని వారి అనుగ్రహాన్ని పొందవచ్చు.

స్వామి అనుజ్ఞ లేనిదే వెళ్లలేని ఏకైక ఆలయం
కురుడుమలై గణపతి ఆలయం విశిష్టత ఏమిటంటే ఈ ఆలయానికి మనం వెళ్లాలని అనుకుని బయల్దేరితే వెళ్లలేము. ఈ ఆలయానికి వెళ్లాలన్నా, స్వామిని దర్శించాలన్నా స్వామి ఆజ్ఞ అయితేనే వెళ్లగలమట! మనం అనుకుంటే ఇక్కడకు వెళ్లలేమట! కేవలం బొజ్జ గణపయ్య అనుగ్రహం ఉంటేనే వెళ్లగలం అని పెద్దలు చెబుతారు.

ఈ ఆలయానికి ఎలా చేరుకోవచ్చు?
ఈ ఆలయం చేరుకోవడానికి నిత్యం బెంగళూరు, కోలార్ సమీప ప్రాంతాల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు, ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి.

గణపతి ఆజ్ఞ కోసం ప్రార్థిద్దాం!
జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించవలసిన క్షేత్రం కురుదుమలె గణపతి దేవాలయం. గణపయ్య మనందరినీ అనుగ్రహించి ఈ ఆలయానికి వచ్చేలా ఆజ్ఞ ఇవ్వాలని ప్రార్థిద్దాం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.