TU VC Ravinder Caught by ACB Officials in Hyderabad : ఓ ప్రైవేటు కళాశాలలో పరీక్షా కేంద్రానికి అనుమతి ఇచ్చేందుకు రూ.50 వేల లంచం తీసుకుంటూ తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి దాచేపల్లి రవీందర్ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడటం కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా భీంగల్లో శ్రీ షిర్డీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీలో గతంలో డిగ్రీ పరీక్ష నిర్వహణ కేంద్రముండేది. కొంతకాలం క్రితం రద్దు చేయగా.. దాన్ని పునరుద్ధరించాలంటూ వీసీ రవీందర్ను సొసైటీ అధ్యక్షుడు దాసరి శంకర్ కలిశారు. ఇందుకు వీసీ రూ.50 వేలు డిమాండ్ చేయగా... వారి మధ్య ఒప్పందం కుదరడంతో పరీక్ష కేంద్రం నిర్వహణకు అనుమతి లభించింది.
ACB Officials Inspected TU VC Ravinder's House : ఈ క్రమంలో లంచం సొమ్మును హైదరాబాద్ తార్నాక కమిటీ కాలనీలోని తన ఇంటికి తీసుకురావాలని రవీందర్ సూచించారు. లంచం విషయమై ఉప్పందడంతో అనిశా అధికారులు తార్నాకలో మాటువేశారు. నిన్న ఉదయం శంకర్ నుంచి రవీందర్ డబ్బు తీసుకున్న వెంటనే అనిశా అధికారులు రంగప్రవేశం చేసి... సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సాయంత్రం వరకు దాదాపు ఎనిమిది గంటల పాటు అనిశా అధికారులు సోదాలు నిర్వహించి.. పలు కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రవీందర్ను అరెస్ట్ చేసి.. రిమాండ్కు తరలించారు.
పాలనను గాలికొదిలి.. అక్రమాలకు అడ్డాగా మార్చారు : హైదరాబాద్లో అనిశా అధికారుల తనిఖీలు జరుగుతుండగానే... మరో బృందం నిజామాబాద్ జిల్లాలోని విశ్వవిద్యాలయంలో సోదాలు నిర్వహించింది. వర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ అరుణ నుంచి అధికారులు సమాచారం సేకరించారు. పరీక్ష కేంద్రానికి అనుమతి ఇచ్చిన అంశానికి సంబంధించిన వివరాలు తీసుకున్నట్లు తెలిసింది. కాగా, తనపై జరిగిన అనిశా దాడులపై ప్రస్తుతానికేమీ మాట్లాడలేనని ఉపకులపతి రవీందర్ పేర్కొన్నారు.
రాష్ట్ర చరిత్రలో ఒక ఉపకులపతి అరెస్ట్ కావడం ఇదే తొలిసారి. ఉపకులపతి రవీందర్తీరు ఆది నుంచీ వివాదాస్పదంగా ఉంది. విశ్వవిద్యాలయంలో పాలనను గాలికొదిలేశారని.. అక్రమాలకు అడ్డాగా మార్చారని ఆయనపై విమర్శలున్నాయి. సామగ్రి కొనుగోళ్లతో పాటు పొరుగు సేవల సిబ్బంది నియామకాల్లో కమీషన్లు తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.