తెలంగాణ

telangana

ఉక్రెయిన్​లో చిక్కుకున్న ఉమ్మడి పాలమూరు జిల్లా వాసులు

By

Published : Feb 25, 2022, 2:15 PM IST

Updated : Feb 25, 2022, 2:52 PM IST

Mahaboobnagar Students Stuck in Ukraine : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో తెలుగు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అని టెన్షన్ పడుతున్నారు. కేంద్రం చొరవ చూపి... పిల్లలను అతిత్వరగా.. క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Telugu students in Ukraine, Mahaboobnagar Students Stuck in Ukraine
ఉక్రెయిన్​లో చిక్కుకున్న ఉమ్మడి పాలమూరు జిల్లా వాసులు

Mahaboobnagar Students Stuck in Ukraine : ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసంలో భాగంగా ఉక్రెయిన్‌లో ఉన్నారు. ఊహించని రీతిలో ఉక్రెయిన్-రష్యా యుద్ధ నేపథ్యంలో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల్ని సురక్షితంగా.. వేగంగా స్వదేశానికి తీసుకురావాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

విద్యార్థి గోవర్ధన్

చిక్కుకున్న పాలమూరు వాసులు

Telugu students in Ukraine : వైద్యవిద్యాభ్యాసం కోసం జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం భీంపురం గ్రామానికి చెందిన రాఘవేంద్ర కుమారుడు గోవర్ధన్ ఉక్రెయిన్​లో ఉన్నారు. ఆ దేశంలోని జాఫ్రజియా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. యుద్ధం నేపథ్యంలో ఇండియాకు వచ్చేందుకు టికెట్లు బుక్ చేసుకున్నా... విమానాలు అందుబాటులో లేకపోవడంతో గోవర్ధన్ అక్కడే ఉండిపోయాడు. యుద్ధ నేపథ్యంలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఫోన్ చేసి ఎప్పటికప్పుడు.. అక్కడి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఇదీ చదవండి: క్షేమంగానే ఉన్నా.. వెంటాడుతున్న బాంబుల భయం..

'ఏ క్షణమైనా విద్యుత్, గ్యాస్ నిలిచిపోయే ప్రమాదం ఉంది. గదిలో ఉన్న- ఆహారం రెండు రోజులకే సరిపోతుంది. తినడానికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే బ్యాంకింగ్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. బయటకు వెళ్లడానికి వీలులేదు. ఏటీఎంలో డబ్బులు దొరకడం లేదు' అని గోవర్ధన్ తెలిపాడని తల్లిదండ్రులు చెప్పారు.

'మెడిసిన్ కోసం మా బాబు ఉక్రెయిన్ వెళ్లాడు. ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. యుద్ధం నేపథ్యంలో ఇక్కడికి రావడానికి టికెట్లు బుక్ చేసుకున్నాడు. కానీ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ప్రభుత్వం దీనిపై త్వరితగతిన స్పందించాలి. బియ్యం, కూరగాయలు, పండ్లు దొరకడం లేదట. ఏటీఎంలో పైసలు కూడా లేవంటా. ఈరోజు వరకు మాత్రమే ఆహార పదార్థాలు ఉన్నాయని చెప్పారు. చాాలామంది తెలుగు విద్యార్థులు అక్కడ ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి. వీలైనంత త్వరగా పిల్లలను క్షేమంగా స్వదేశానికి తీసుకురావాలని కోరుతున్నాం.

-రాఘవేంద్ర, విద్యార్థి తండ్రి

ఉక్రెయిన్​లో చిక్కుకున్న రాహుల్

ఉక్రెయిన్​లో చిక్కుకున్న విద్యార్థులు

students problems with Ukraine War 2022 : అదేవిధంగా గట్టు మండలానికి చెందిన రాహుల్ ఎంబీబీఎస్ కోసం 2016లో ఆ దేశానికి వెళ్లాడు. జూన్​లో కోర్సు పూర్తి చేయాల్సి ఉంది. ఆ దేశంలో యుద్ధం నేపథ్యంలో స్వదేశానికి తిరిగి రాలేని పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విమానాలు రద్దయ్యాయని.. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవ తీసుకొని పిల్లలను క్షేమంగా స్వదేశానికి రప్పించేందుకు త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే గద్వాల మండలం జమ్మి చేడు గ్రామానికి చెందిన రవిప్రకాశ్ కుమారుడు ప్రణయ్... ఎంబీబీఎస్ నాలుగో సంపత్సరం చదువుతున్నాడు. యుద్ధం నేపథ్యంలో ఖతార్ విమానం ఎక్కి... దోహా మీదుగా గురువారం రాత్రి 7 గంటలకు హైదరాబాద్ చేరుకున్నాడు. కుమారుడు క్షేమంగా స్వదేశానికి రావడంతో అతడి తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదీ చదవండి: 'సురక్షితంగానే ఉన్నాం.. కానీ.. ఏం జరుగుతుందో?'

'తాగడానికి నీళ్లు లేవంటా'

Russia Ukraine war updates : నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మెర్సి వసంత- శ్రీనివాస్ దంపతుల కుమారుడు అభిషేక్ ఉక్రెయిన్ రాజధానిలోని మెడిసిడీ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఉక్రెయిన్​లో తమ కుమారుడు ఉంటున్న హాస్టల్ బాంబుదాడిలో దెబ్బతిన్నదని... అక్కడి విద్యార్ధులు బంకర్లలో తలదాచుకున్నట్లుగా సమాచారం వచ్చిందని మెర్సి వసంత తెలిపారు. తాగేందుకు నీరు దొరకని భయానక వాతావరణంలో వాళ్లంతా ఉన్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా వారిని స్వదేశానికి తీసుకు రావాలని ఆమె ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి:'సైరన్‌ మోగితే బంకర్లలోకి వెళ్లమన్నారు'.. ఉక్రెయిన్​లో తెలుగు విద్యార్థి

మా బాబు అభిషేక్ ఉక్రెయిన్ రాజధానిలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. యుద్ధ వాతావరణం నేపథ్యంలో బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. గురువారం రాత్రి వాళ్లు ఉండే ప్రాంతానికి సమీపంలో బాంబు దాడి జరిగిందట. 40 మంది విద్యార్థులు బంకర్లలో ఉన్నారట. నైటంతా భయంతో గడిపారట. వాళ్లకు ఫుడ్, కనీసం వాటర్ కూడా లేదట. చాలా భయంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని వేడుకుంటున్నాం. వీలైనంత త్వరగా పిల్లలను ఇండియాకు రప్పించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

-మెర్సి వసంత, విద్యార్థి తల్లి

'వీలైనంత త్వరగా తీసుకురండి'

Ukraine news : నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన జ్యోతిరాణి- కరుణాకర్ దంపతుల కుమారుడు నిఖిల్ స్టీవెన్ సన్... సుమ్మిలోని జాఫ్రజియా విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నారు. ప్రస్తుతానికి క్షేమంగా ఉన్న.. వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నారు.

మా బాబు నిఖిల్ జాఫ్రజియా యూనివర్శిటీలో ఐదో సంవత్సరం చదువుతున్నాడు. యుద్ధం నేపథ్యంలో అక్కడే చిక్కుకుపోయాడు. యుద్ధం నేపథ్యంలో మా బాబుతో పాటు పిల్లలందరినీ క్షేమంగా ఉక్కడికి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వీలైనంత త్వరగా వచ్చేలా చొరవ చూపాలని వేడుకుంటున్నాం.

-నిఖిల్ తల్లిదండ్రులు

పిల్లల కోసం వేయికళ్లతో..

మహబూబ్​నగర్ పట్టణానికి చెందిన సత్యనారాయణ- సూర్యకళ దంపతుల కూతురు సాయి స్పందన 2017లో ఎంబీబీఎస్ చదువుకునేందుకు ఉక్రెయిన్​కు వెళ్లారు. జాఫ్రజియా విశ్వవిద్యాలయంలో వైద్యవిద్యనభ్యసిస్తున్న సాయిస్పందన... మరో మూడు నెలలైతే కోర్సు ముగించుకుని స్వదేశానికి తిరిగి రావాల్సి ఉంది. ఈలోపే యుద్ధం తలెత్తడంతో అక్కడే చిక్కుకుపోయారు. ప్రస్తుతం ఉక్రెయిన్ రాజధానికి దూరంలో సురక్షితంగా ఉన్నా.. ఏం జరుగుతోందన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. కూతురు రాక కోసం తల్లిదండ్రులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కొండేరు గ్రామానికి చెందిన అశోక్ సైతం సాయి స్పందనతో పాటే ఉన్నట్లుగా సత్యనారాయణ దంపతులు తెలిపారు. అశోక్ ప్రస్తుతం ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నారు.

మా పాప ఫైనల్ ఇయర్ చదువుతోంది. మూడు నెలలు అయితే పరీక్షలు రాసి వచ్చేది. యుద్ధం వల్ల భయంభయంగా ఉంది. ఉక్రెయిన్ రాజధానికి దగ్గర్లోనే మా పాప చదివే జాఫ్రజియా యూనివర్శిటీ ఉంటుంది. అయితే పిల్లలు ఇప్పుడు హాస్టల్​లోనే ఉన్నారట. తెలుగు విద్యార్థులు దాదాపు ఓ రెండు వేల మంది ఉంటారు.

-సత్యనారాయణ, విద్యార్థి తండ్రి

మహబూబ్​నగర్ పట్టణానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి-చంద్రకళ దంపతుల కుమారుడు అక్షయ్ కుమార్ రెడ్డి ఒడెస్సా నేషనల్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. అక్షయ్ కుమార్ రెడ్డితో పాటు మరో ఆరుగురు విద్యార్ధులు ఓ గదిలో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారని... వీలైనంత త్వరగా వారిని స్వదేశానికి తిరిగి తీసుకురావాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. అక్కడి పరిస్థితులు ముందే గమనించి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నా, విమానాలు నిలిచిపోవడంతో అక్కడే ఆగిపోవాల్సి వచ్చిందని అంటున్నారు.

మా అబ్బాయిని 2018లో ఉక్రెయిన్​కి పంపించాం. అక్కడ గొడవల వల్ల మా బాబు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. వాళ్లను తొందరగా ఇక్కడికి తీసుకొస్తే చాలు. వీలైనంత త్వరగా పిల్లలను క్షేమంగా తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

-చంద్రకళ, విద్యార్థి తల్లి

మా బాబు ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదుపుతున్నాడు. మా పిల్లలను బయట తిరగవద్దు అని చెప్పినం. అక్కడి గవర్నమెంట్ చెప్తేనే కదలమని అన్నాం. అక్కడ ఏం జరిగిన ఎవరూ బాధ్యులు కాదు. మా పిల్లలు అందరు కూడా రూములోనే ఉన్నారు. ఎలా ఉన్నారో ఏమో తెలియదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నాం. మా పిల్లలు, భారతీయులందరినీ వెంటనే తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

-శ్రీనివాస్ రెడ్డి, విద్యార్థి తండ్రి

ఇదీ చదవండి:

Last Updated :Feb 25, 2022, 2:52 PM IST

ABOUT THE AUTHOR

...view details