ETV Bharat / state

"ఫోన్లు కూడా పనిచేయడం లేదు.. అక్కడ మా పిల్లలు ఎలా ఉన్నారో.?"

author img

By

Published : Feb 25, 2022, 12:52 PM IST

Updated : Feb 25, 2022, 5:26 PM IST

Adilabad students stuck in Ukraine: తమ పిల్లలకు ఉన్నత విద్య అందించాలని.. ఉన్నతమైన స్థాయిలో చూడాలని ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది. అందుకు రాష్ట్రాలే కాదు దేశాన్ని సైతం వదిలి ఇతర దేశాల్లో చదివించేందుకు సిద్ధపడుతున్నారు. కానీ అది వాళ్లను కన్నీరుపెట్టిస్తుందని ఎవరూ ఉహించరు. ప్రస్తుతం ఉక్రెయిన్​పై రష్యా బాంబు దాడులు.. విద్యార్థుల తల్లిదండ్రులను కన్నీరు పెట్టిస్తోంది.

Adilabad students stuck in Ukraine
ఉక్రెయిన్​లో ఆదిలాబాద్​ విద్యార్థులు

Adilabad students stuck in Ukraine: ఉక్రెయిన్​పై రష్యా యుద్ధం.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వాసులను కలవరానికి గురిచేస్తోంది. ఇక్కడి విద్యార్థులు వైద్య విద్య కోసం అక్కడి వెళ్లడంతో వారి తల్లిదండ్రుల్లో ఆందోళన ఉద్ధృతమవుతోంది. నిన్న, మొన్నటి వరకు తమ పిల్లలతో ఫోన్‌లో మాట్లాడినవారికి.. ఇంటర్‌నెట్‌ సౌకర్యం తొలగించడంతో క్షేమ సమాచారం తెలుసుకోలేక.. మరింత ఆవేదనకు గురవుతూ కన్నీటి పర్యంతమవుతున్నారు. వారిని "ఈటీవీ భారత్"​ పలకరించింది.

కన్నీటి పర్యంతం

నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవార్​పేట్​ వీధికి చెందిన మునిపల్లి సాయికృష్ణ(27).. ఎంబీబీఎస్ పూర్తి చేసి ఎంఎస్ చదివేందుకు గతేడాది మార్చిలో ఉక్రెయిన్​కు వెళ్లారు. సాయికృష్ణ ఉక్రెయిన్ రాజధాని.. కీవ్​లో ఉంటూ ఎంఎస్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ దేశంపై.. రష్యా యుద్ధానికి దిగడంతో సాయికృష్ణ కుటుంబసభ్యులు ఆందోళన చెందుతూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురవతున్నామని వాపోయారు. 24 గంటలు మీడియా ఛానళ్లలో వార్తలు చూస్తూ గడపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సాయి కృష్ణ.. తమతో నిరంతరం ఫోన్​లో మాట్లాడుతూనే ఉన్నాడని, నిన్నటి వరకు పరిస్థితులు బాగానే ఉన్నాయని చెప్పాడని పేర్కొన్నారు. అర్ధరాత్రి నుంచి బాంబుల వర్షం కురుస్తోందని.. సాయి కృష్ణ ఉన్న ప్రాంతానికి వందమీటర్ల దూరంలో బాంబులు పడ్డాయని తెలిపినట్లు పేర్కొన్నారు. తమ కుమారుడిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని వేడుకుంటున్నారు. అమ్మా ఆకలేస్తుంది.. చేతిలో చిల్లి గవ్వ లేదు: యుద్ధభూమిపై విద్యార్థుల ఆవేదన

ఎప్పుడు ఏం జరుగుతుందోనని

సాయికృష్ణ వీడియో కాల్ ద్వారా మాట్లాడుతూ తాము ఉన్న ప్రదేశానికి సమీపంలోనే బాంబులు పడుతున్నాయని.. అంతకుముందు సూపర్​ మార్కెట్​లో రెండుమూడు రోజులకు సరిపడే వస్తువులు తెచ్చుకున్నామని వివరించారు. ఇప్పటికే అన్నీ మూతపడ్డాయని ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎలాగైనా తమను స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు.

ఆదిలాబాద్‌ పట్టణం కైలాస్‌నగర్‌కి చెందిన ఎడమల నారాయణరెడ్డి- జయశ్రీ దంపతుల కూతురు ఎడమల నేత్రారెడ్డి, న్యూహౌజింగ్‌బోర్డుకాలనీకి చెందిన పోలిపెల్లి గజానన్‌-శారద దంపతుల కుమారుడు పోలిపెల్లి వంశీ కృష్ణ, వికలాంగుల కాలనీకి చెందిన బిశ్వాస్‌- మీర దంపతుల కుమారుడు మిరిన్మయ్‌ బిశ్వాస్‌ ఉక్రెయిన్‌లో ఆయా యూనివర్సిటీల్లో వైద్యవిద్యను అభ్యసిస్తున్నారు. యుద్ధం కారణంగా తమ పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారని, వారిని వెంటనే భారత్‌కు రప్పించాలని కోరుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని టీవీల ముందు కూర్చుని నిద్రాహారాలు మాని మనోవేదనకు గురవుతున్నారు.

Adilabad students stuck in Ukraine
నేత్రా రెడ్డి

ఆందోళనకు గురవుతున్నాం

పోలిపెల్లి వంశీ కృష్ణ

"మా అబ్బాయి పోలిపెల్లి వంశీక‌ృష్ణ.. ఉక్రెయిన్‌లో జపోర్‌ఝై స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీలో నాలుగో సంవత్సరం చదువుతున్నారు. ఈ పట్టణం ఆ దేశ రాజధానికి 800 కి.మీ.ల దూరంలో ఉంది. యుద్ధ వాతావరణం నెలకొనడంతో మేమంతా ఆందోళనకు గురవుతున్నాం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో భయమేస్తోంది. మాట్లాడాలంటే ఫోన్లు కలవడం లేదు. ఎలాగైనా అక్కడి నుంచి మా అబ్బాయిని మన దేశానికి సురక్షితంగా తీసుకురావాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. తినడానికి సైతం ఏం దొరకని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఏటీఎంలలో డబ్బు దొరక్క అవస్థలు పడుతున్నారు. ఎలాగైనా ప్రభుత్వం వారిని క్షేమంగా స్వదేశానికి తరలించాలి." -పోలిపెల్లి గజానన్​, ఎదులాపురం ఆదిలాబాద్‌ (కొత్త హౌసింగ్‌బోర్డు కాలనీ)

సురక్షితంగా ఉన్నా

మిరిన్మయ్​ బిశ్వాస్​

"మాది ఆదిలాబాద్‌లోని వికలాంగుల కాలనీ. నాన్న బిశ్వాస్‌, అమ్మ మీర. నేను ఉక్రెయిన్‌లోని వినిష్టియా నేషనల్‌ మెడికల్‌ యూనివర్సిటీలో మూడో సంవత్సరం చదువుతున్నా. ఇక్కడ యుద్ధం ప్రారంభమైంది. ఈ రోజే నాన్నతో వీడియో కాల్‌లో మాట్లాడా. బాగానే ఉన్నామని ధైర్యం చెప్పా. సెకెండ్‌ సెమిస్టర్‌ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని మెడికల్‌ కళాశాల యాజమాన్యాన్ని మేమంతా కోరాం. ఈ పరిస్థితుల్లో కుదరదని వారంటున్నారు. బయట రహదారులన్నీ నిర్మానుష్యంగా ఉంటున్నాయి. భారత ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడి నుంచి త్వరగా స్వదేశానికి తీసుకువెళ్లాలని కోరుతున్నా." - మిరిన్మయ్‌ బిశ్వాస్‌

"అక్కడ పరిస్థితి ఏం బాగాలేదని మా బాబు వాపోతున్నాడు. నిన్నటి నుంచి నిద్రాహారాలు లేక నరకం చూస్తున్నారు. బాంబు శబ్దాలతో భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ మాకు కూడా వారి గురించి చాలా ఆందోళనగా ఉంది. ఎలాగైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుని.. వారిని స్వదేశానికి తరలించాలి." -మీనా, బిశ్వాస్​ తల్లి

"తొందరగా మా పిల్లలను పంపించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. బాంబు శబ్ధాలతో అక్కడ వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తిండి, నిద్రా, చేతిలో డబ్బులు లేక వాళ్లు అవస్థలు ఎదుర్కొంటున్నారు." -జయశ్రీ, నేత్రారెడ్డి తల్లి

జాగ్రత్తగానే ఉన్నాను..!

రష్యా- ఉక్రెయిన్‌ల యుద్ధంతో.. మంచిర్యాల జిల్లా వాసుల్లో ఆందోళన నెలకొంది. మంచిర్యాల పట్టణ సీఐ నారాయణ నాయక్‌ కుమారుడు బుక్య అఖిల్‌ ఉక్రెయిన్‌లోని విన్నిస్తీయా మెడికల్‌ వర్సిటీలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మూడు నెలల క్రితమే ఆయన మంచిర్యాల నుంచి వైద్యవిద్య కోసం ఉక్రెయిన్‌ వెళ్లారు. ఈ సందర్భంగా "ఈటీవీ భారత్​"తో ఫోన్​లో మాట్లాడిన అఖిల్‌.. ప్రస్తుతం యూనివర్సిటీ వసతిగృహంలో మిత్రులతో కలిసి భద్రంగా ఉన్నట్లు తెలిపారు. గంటగంటకు పరిస్థితి తెలుసుకుంటున్నామని, ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయుల భద్రతపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని వేచి చూస్తున్నామని అఖిల్‌ తండ్రి నారాయణ నాయక్‌ చెప్పారు.

ఉక్రెయిన్​లో విద్యార్థుల పరిస్థితిపై తల్లిదండ్రుల ఆందోళన

అండర్‌ గ్రౌండ్‌ గదుల సౌకర్యం ఉంది

బెల్లంపల్లి మండలం సోమగూడెం గ్రామానికి చెందిన నర్సయ్య, వాణి దంపతుల కుమార్తె రవళి ఉక్రెయిన్‌లో చిక్కుకుంది. నాలుగేళ్ల క్రితం ఎంబీబీఎస్‌ చదువుకునేందుకు ఉక్రెయిన్‌కు వెళ్లింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అక్కడి వసతిగృహంలో తాను సురక్షితంగానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందొద్దని చరవాణి ద్వారా ‘ఈటీవీ భారత్​’కు తెలిపింది. ఎలాంటి దాడులు జరిగినా తలదాచుకునేందుకు అండర్‌ గ్రౌండ్‌ గదుల సౌకర్యం కల్పించారన్నారు. ఎప్పటికప్పుడు అక్కడి అధికారులు తమకు సమాచారం ఇస్తున్నారని తెలిపారు. యుద్ధ విమానాల గర్జన, బాంబుల మోత.. బిక్కుబిక్కుమంటున్న హైదరాబాదీ విద్యార్థులు

గదికే పరిమితమయ్యాం..

తాండూరు మండలం మాదారం టౌన్‌షిప్‌నకు చెందిన మందనపు రామారావు, సరిత దంపతుల కూతురు స్ఫూర్తి ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ 5వ సంవత్సరం చదువుతోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా ఉండడంతో.. వారం రోజులకు సరిపడా సరకులు తెచ్చుకొని కళాశాలకు వెళ్లకుండా గదిలోనే ఉంటున్నట్లు తల్లిదండ్రులకు చరవాణిలో సమాచారం అందించారు. తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు, ఖమ్మంకు చెందిన ఒక మిత్రురాలితో కలిసి ఉన్నట్లు ఆమె తెలిపింది. మాదారంలో ఉన్న తల్లిదండ్రులు, ఉక్రెయిన్‌లో ఉన్న కూతురు నిత్యం సామాజిక మాధ్యమాలతో పాటు మీడియా ప్రసారాలను చూస్తూ చరవాణుల ద్వారా క్షేమ సమాచారాలను తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఇంటర్​ నెట్​ సదుపాయం తొలగించడంతో ఆందోళన చెందుతున్నారు.

ఎంబీబీఎస్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న హరిప్రసాద్‌

కుమురంభీం జిల్లా రెబ్బెన మండల కేంద్రానికి చెందిన ఎంబీబీఎస్‌ చదువుతున్న గుండు హరిప్రసాద్‌ ఉక్రెయిన్​లో ఉన్నారు. రెబ్బెనలో ఉంటున్న గుండు రవీందర్‌- స్వరూపరాణి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు హరిప్రసాద్‌ ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. రెండో కుమారుడు శ్రీశాంత్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో నీట్‌ శిక్షణ తీసుకుంటున్నారు. విద్యార్థి తండ్రిని గురువారం రాత్రి ‘ఈటీవీ భారత్’ సంప్రదించగా.. తమ కుమారుడు తెలంగాణలో నీట్‌ ప్రవేశ పరీక్ష రాసి అర్హత సాధించారని తెలిపారు. 2020లో ఉక్రెయిన్‌లో ఎంబీబీఎస్‌ కోర్సును చదివేందుకు పంపించినట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లోని ప్రస్తుతం తూర్పు ప్రాంతంలో దాడులు కొనసాగుతున్నాయని, తమ కుమారుడు మాత్రం పడమర ప్రాంతంలో ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఎలాంటి భయం లేదు కానీ ముందుముందు ఏం జరుగుతుందోని ఆందోళన చెందుతున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి: ఉక్రెయిన్‌లో యుద్ధం.. స్వస్థలాలకు రావడానికి తెలుగు విద్యార్థుల బెంబేలు

Last Updated :Feb 25, 2022, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.