తెలంగాణ

telangana

Water Flow Telangana Projects : వానొచ్చే.. ప్రాజెక్టుల్లో భారీ వరదను తీసుకొచ్చే

By

Published : Jul 19, 2023, 1:28 PM IST

Massive Water Flow in Telangana Projects : రాష్ట్రవ్యాప్తంగా గత 3 రోజులుగా కురుస్తోన్న విస్తారమైన వర్షాలతో ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకుంటున్నాయి. మొన్నటి వరకు ఎడారులను తలపించిన జలాశయాలన్నీ.. ప్రస్తుతం అంతకంతకూ పెరుగుతోన్న వరద ప్రవాహాలతో నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. అధికారులు పలు ప్రాజెక్టుల వద్ద గేట్లను ఎత్తి.. నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Projects Water Levels in Telangana
Projects Water Levels in Telangana

Huge Water Flow in Telangana Projects :వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత 3 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని చోట్ల వరద ప్రవాహానికి రహదారులు దెబ్బతిని.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వీటికి తోడు ఎగువ ప్రాంతాల్లోనూ కురుస్తోన్న అధిక వానలతో కుంటలు, చెరువులు, ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. అంతకంతకూ పోటెత్తుతోన్న వరద ప్రవాహాలతో జలాశయాల్లో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మొన్నటి వరకు నీరు లేక వెలవెలబోయిన ప్రాజెక్టులన్నీ.. ప్రస్తుత వర్షాలతో మళ్లీ పూర్వ కళను సంతరించుకుంటున్నాయి.

Telangana Projects Water Flow 2023 : ఎడతెరిపి లేని వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత నీటి నిల్వ 29 అడుగులుగా ఉండగా.. రాత్రికి 35 అడుగులకు చేరే అవకాశం ఉందని కలెక్టర్‌ ప్రియాంక పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులను అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన పాలనాధికారి.. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

రాత్రికి మరింత పెరిగే అవకాశం..: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, నిజాంసాగర్ ప్రాజెక్టులకూ వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 1071.60 అడుగుల నీటిమట్టం ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 90.3 టీఎంసీలుగా ఉండగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 32.274 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు నిజాంసాగర్ జలాశయంలోకి ప్రస్తుతం 1500 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా.. ప్రస్తుతం నిజాంసాగర్ జలాశయం నీటి మట్టం 1388.32 అడుగులు చేరింది. ప్రస్తుతం కురుస్తోన్న ఏకతాటి వర్షాలతో రాత్రికి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

నిర్మల్ జిల్లాలోని స్వర్ణ, కడెం జలాశయాలూ జలకళను సంతరించుకున్నాయి. స్వర్ణ జలాశయానికి 890 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. కడెం జలాశయానికి 4,280 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. స్వర్ణ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1189 అడుగులు ఉండగా.. ప్రస్తుతం ఇందులో 1164 అడుగుల నీటిమట్టం ఉంది. కడెం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా.. కడెం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 689.42 అడుగులుగా ఉంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్ర సహా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టు నిండుకుండలా కళకళలాడుతుంది. ప్రాణహిత నుంచి 2,58,530 క్యూసెక్కుల మేర లక్ష్మీ బ్యారేజీకి ప్రవాహం కొనసాగుతుండగా.. లక్ష్మీ బ్యారేజీలో 35 గేట్లు ఎత్తి 2,85,340 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు.. ఛత్తీస్​గఢ్​లో కురిసిన వర్షాలకుభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు, ములుగు జిల్లాలోని పాలెం ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. ఫలితంగా అధికారులు తాలిపేరు ప్రాజెక్టు 21 గేట్లు ఎత్తి.. 49,244 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. పాలెం ప్రాజెక్టు 4 గేట్ల ద్వారా 6750 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.

ఇవీ చూడండి..

ఉత్తరాదిలో మళ్లీ భారీ వర్షాలు.. తాజ్​మహల్​ను తాకిన 'యమున'! 45 ఏళ్ల తర్వాత..

singareni coal production suspended : భారీ వర్షాలు.. ఆగిన పనులు.. సింగరేణికి కోట్లల్లో నష్టం

ABOUT THE AUTHOR

...view details