తెలంగాణ

telangana

నేడు హైదరాబాద్​కు ప్రధాని రాక.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

By

Published : Apr 8, 2023, 6:03 AM IST

PM Modi Hyderabad Tour Today: రాష్ట్రంలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్‌కు వస్తున్నారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు. హైదరాబాద్-సికింద్రాబాద్ సబర్బన్ విభాగంలో 13 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులకు పచ్చజెండా ఊపనున్నారు. సికింద్రాబాద్-మహబూబ్​నగర్ డబ్లింగ్ విద్యుదీకరణనూ ప్రధాని నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు. రూ.720 కోట్ల నిధులతో చేపట్టనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు.

PM Hyderabad Tour Today
PM Hyderabad Tour Today

నేడు హైదరాబాద్​కి ప్రధాని రాక.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం..!

PM Hyderabad Tour Today: ప్రధాని నరేంద్రమోదీ నేడు హైదరాబాద్‌లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభిస్తారు. తిరుపతికి వెళ్లే భక్తుల ప్రయాణ సమయం దాదాపు మూడున్నర గంటలు తగ్గనుంది. సికింద్రాబాద్‌ నుంచి చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు ద్వారా వందే భారత్‌ రైలు తిరుపతికి వెళ్లనుందని రైల్వే అధికారులు తెలిపారు. హాల్టింగ్‌ మాత్రం సికింద్రాబాద్‌, నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో మాత్రమే ఉండనుంది.

PM Narendra Modi Will Visit Hyderabad Today: హైదరాబాద్ సబర్బన్ విభాగంలో 13 కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రధాని ప్రారంభించనున్నారు. జంట నగరాల్లోని ప్రయాణికులకు వేగం, సురక్షితం, చౌక, సౌకర్యవంతమైన ప్రయాణం అందనుంది. ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టులో భాగంగా సికింద్రాబాద్‌-మేడ్చల్ మార్గంలో 28 కిలోమీటర్ల మేర కొత్త సబర్బన్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. లాలాగూడ గేట్‌, మాల్కాజ్‌గిరి, సఫిల్‌గూడ, ఆర్కేపురం, అల్వాల్‌, బొల్లారం బజార్‌, గుండ్లపోచంపల్లి, గౌడవల్లి, శివరాంపల్లి, బుద్వేల్‌ స్టేషన్లు వినియోగంలోకి రానున్నాయి. సికింద్రాబాద్-మహబూబ్​నగర్ డబ్లింగ్ విద్యుదీకరణనూ ప్రధాని నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు.

రూ. 1410 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టులో దాదాపు 85 కిలోమీటర్లు మేర పనులు పూర్తయ్యాయి. ప్రయాణికుల భద్రత, రైలు నిర్వహణ కోసం 17 లెవెల్ క్రాసింగ్ గేట్లను తొలగించారు. రైళ్ల సగటు వేగాన్ని పెంచడానికి ఈ మార్గం సహాయపడుతుందని అధికారులు చెబుతున్నారు. రూ.720 కోట్లతో శ్రీకారం చుట్టనున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రయాణికులకు స్టేషన్‌లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆధునిక సౌకర్యాలు, సాంకేతికత, సదుపాయాలు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. మొత్తం పనుల్ని మూడు దశల్లో 36 నెలల్లో పూర్తి చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

పరేడ్​ గ్రౌండ్​లో బహిరంగసభ: 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, ట్రావెలేటర్ల సదుపాయాలు ఉండనున్నాయి. ప్రయాణికుల రాకపోకలపై నిఘానేత్రం ఉండేలా ప్రత్యేక ఎంట్రీ, ఎగ్జిట్ బ్లాక్‌ సదుపాయాలు కల్పించనున్నారు. మల్టీ లెవల్, అండర్ గ్రౌండ్ కార్ పార్కింగ్ మరో ప్రత్యేకత. 5 వేల కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్‌ ప్లాంట్‌, 16 లక్షల లీటర్ల నీరు నిల్వ చేసేలా సంపులు ఏర్పాటు చేయనున్నారు. అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం తర్వాత పరేడ్‌ గ్రౌండ్‌ బహిరంగసభలో ప్రధాని పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి దిల్లీకి పయనం కానున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details