తెలంగాణ

telangana

‘వందే భారత్‌’ వచ్చేస్తోందోచ్‌.. 19న రాష్ట్రానికి ప్రధాని మోదీ

By

Published : Jan 7, 2023, 7:49 PM IST

Updated : Jan 8, 2023, 7:30 AM IST

Narendra Modi
Narendra Modi

19:45 January 07

‘వందే భారత్‌’ వచ్చేస్తోందోచ్‌.. 19న రాష్ట్రానికి ప్రధాని మోదీ

‘వందే భారత్‌’ వచ్చేస్తోందోచ్‌.. 19న రాష్ట్రానికి ప్రధాని మోదీ

PM Modi Telangana Tour: సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ మధ్య వందే భారత్‌ రైలును.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 19న ప్రారంభించనున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య తొలిసారి వందేభారత్‌ రైలు పరుగులు పెట్టనుంది. తొలుత సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ మధ్య నడవనున్న వందే భారత్‌ రైలును... ఆ తర్వాత విశాఖ వరకూ పొడిగించే అవకాశాలున్నాయని సమాచారం. 699కోట్ల రూపాయలతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పునర్‌నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. వందే భారత్‌ రైలులో సికింద్రాబాద్‌ నుంచి విజయవాడకు సుమారు నాలుగు గంటల్లో చేరుకునే అవకాశం ఉంది.

వందేభారత్‌ రైలును ప్రారంభించిన తర్వాత సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పునర్‌నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం 699 కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ భవానాల్ని కూల్చి... అంతర్జాతీయ ప్రమాణాలు, పూర్తిస్థాయి వసతులతో కొత్తగా నిర్మిస్తారు. గుత్తేదారు ఎంపిక గత ఏడాది అక్టోబరులోనే పూర్తయింది. రైల్వేశాఖ దేశంలోని ప్రధాన రైల్వేస్టేషన్లను పునరభివృద్ధి చేస్తోంది. రాష్ట్రంలో ఈ జాబితాలో ఉన్న మొదటి స్టేషన్‌ సికింద్రాబాద్‌. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ ప్రధాన కేంద్రం కూడా ఇక్కడే ఉంది.

స్థానిక ఎంపీ, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ రీడెవలప్‌మెంట్​తో పాటు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని మోదీని గత నెలలోనే ఆయన ఆహ్వానించారు. 36 నెలల్లో పునరభివృద్ధి పనులు చేస్తామని దక్షిణ మధ్య రైల్వే ఇటీవల ప్రకటించింది. నిత్యం ఇక్కడి నుంచి 200 రైళ్లు, 1.80 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రానున్నరోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో 2040 నాటికి ఉండే అవసరాలు, రద్దీని తట్టుకునేలా ప్రణాళిక రూపొందించారు.

ఇవీ చూడండి..

త్వరలోనే అందుబాటులోకి వైద్య కళాశాలలు: హరీశ్​రావు

పవర్​ఫుల్​గా 'వాల్తేరు వీరయ్య' ట్రైలర్​.. చిరుకు రవితేజ వార్నింగ్​.. బాక్స్​లు బద్దలైపోతాయంటూ..

Last Updated :Jan 8, 2023, 7:30 AM IST

ABOUT THE AUTHOR

...view details