తెలంగాణ

telangana

వాస్తవాలను వక్రీకరించడం కేంద్ర హోంమంత్రి స్థాయికి తగదు: కేటీఆర్

By

Published : Mar 27, 2023, 1:45 PM IST

Minister KTR Responded on Amit Shah Comments : హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్​కు మనసు రావడం లేదన్న కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్​ తీవ్రంగా స్పందించారు. అమిత్‌షా వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆక్షేపించారు. వాస్తవాలను వక్రీకరించడం కేంద్ర హోంమంత్రి స్థాయికి తగదని వ్యాఖ్యానించారు.

Minister KTR   Union Minister Amit Shah
మంత్రి కేటీఆర్​ కేంద్ర మంత్రి అమిత్​షా

Minister KTR Responded on Amit Shah Comments : ముఖ్యమంత్రి కేసీఆర్​కు​ హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు మనసు రావడం లేదన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్​ ట్విటర్​ వేదికగా స్పందించారు. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిందని అమిత్ షాకు గుర్తు చేసిన ఆయన.. అందుకు సంబంధించిన వార్తా కథనాలను ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 17పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వాస్తవాలను వక్రీకరిస్తున్నారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. తెలంగాణ.. భారత్‌లో కలిసిపోయిన నాటి నుంచే సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుతున్నట్లు కేటీఆర్‌ స్పష్టం చేశారు.

వాస్తవాలను వక్రీకరించడం కేంద్ర హోంమంత్రి స్థాయికి తగదని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబరు 17ను విమోచన దినంగా ఎందుకు జరపట్లేదని అడుగుతున్న వారు.. ఆగస్టు 15ను దేశ స్వాతంత్య్ర దినోత్సవంగా ఎందుకు నిర్వహిస్తున్నామో ఆలోచించాలని ప్రశ్నించారు. అమరుల త్యాగాలను, పోరాటాలను గౌరవ ప్రదంగా స్మరించుకోవడానికి బదులుగా.. గతించిపోయిన కాలానికి ఖైదీగా బంధీ కావడం మంచిది కాదన్నారు. వివాదాలను పక్కన పెట్టి, భవిష్యత్ నిర్మాణంపై దృష్టి పెట్టాలని కేటీఆర్‌ ట్విటర్‌లో కేంద్ర మంత్రికి హితవు పలికారు.

అసలు అమిత్​షా ఏమన్నారంటే:దేశ స్వాతంత్య్రం కోసం నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసి.. అమరవీరులైన వారిని కాంగ్రెస్‌ పార్టీ ఒక్కసారి కూడా స్మరించుకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ధ్వజమెత్తారు. కర్ణాటక రాష్ట్రం బీదర్‌ జిల్లాలో సర్దార్‌ వల్లభ్‌బాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని, 103 అడుగుల ఎత్తైన స్తంభానికి అమర్చిన జాతీయ పతాకాన్ని అమిత్‌ షా ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో అమిత్​ షా మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​కు హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు మనసు రావడం లేదని ఆరోపించారు.

గోరాట దక్షిణ భారతదేశ జలియన్‌ వాలాబాగ్‌ అని షా పేర్కొన్నారు. గోరాటలో జాతీయ పతాకాన్ని పట్టుకున్న వారిని నిజాం సైనికులు చంపేశారని.. ప్రస్తుతం ఇదే ప్రాంతంలో 103 అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని ఎగురవేయడం గర్వకారణమని తెలిపారు. కర్ణాటకకు యడియూరప్ప సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్‌ కర్ణాటకను కల్యాణ కర్ణాటకగా పేరు పెట్టి మంచి పని చేశారని అభివర్ణించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details