ETV Bharat / bharat

రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కుమార్తె.. ఆ వివాదంతో వెలుగులోకి! బాన్సురీ నేపథ్యం ఇదే

author img

By

Published : Mar 27, 2023, 10:47 AM IST

daughter-bansuri-appointed-co-convenor-
sushma-swaraj-daughter-bansuri bjp

దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సురీ స్వరాజ్ క్రియాశీల రాజకీయాల దిశగా అడుగు వేశారు. దిల్లీ బీజేపీ న్యాయ విభాగానికి కో కన్వీనర్​గా నియమితులయ్యారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు బాన్సురీ. ఈ నేపథ్యంలో ఆమె జీవిత విశేషాలు, వృత్తి, వివాదాలు వంటి వివరాలు మీకోసం.

కేంద్ర మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సురీ స్వరాజ్ క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆదివారం దిల్లీ బీజేపీకి చెందిన న్యాయ విభాగానికి కో కన్వీనర్​గా నియమితులయ్యారు. రాజకీయాల్లో ఆమెకు ఇది తొలి అడుగుగా విశ్లేషకులు చెబుతున్నారు. బాన్సురీ.. ప్రస్తుతం సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. దిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన వీరేంద్ర సచ్​దేవ.. తన తొలి నియామకాల్లో భాగంగా బాన్సురీని పార్టీ లీగల్ సెల్​లోకి చేర్చుకున్నారు.

"గతంలోనూ నేను పార్టీకి న్యాయపరంగా సహాయం చేశా. ఇది కేవలం అధికారికంగా అవకాశం ఇవ్వడం లాంటిది. పార్టీకి సేవ చేసేందుకు వచ్చిన అవకాశం ఇది. దిల్లీ బీజేపీ లీగల్ డిపార్ట్​మెంట్ కో-కన్వీనర్​గా క్రియాశీలంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్, వీరేంద్ర సచ్​దేవకు కృతజ్ఞతలు."
-బాన్సురీ స్వరాజ్, దిల్లీ బీజేపీ లీగల్ డిపార్ట్​మెంట్ కో- కన్వీనర్, సుప్రీంకోర్టు న్యాయవాది

సుష్మా స్వరాజ్​కు ఉన్న ఏకైక సంతానం బాన్సురీ. తండ్రి స్వరాజ్ కౌశల్ బాటలోనే నడిచి క్రిమినల్ లాయర్​గా గుర్తింపు తెచ్చుకున్నారు బాన్సురీ స్వరాజ్. న్యాయవాదిగా బాన్సురీకి 16 సంవత్సరాల అనుభవం ఉంది. దిల్లీ బార్ కౌన్సిల్​లో ఆమెకు సభ్యత్వం ఉంది. ప్రస్తుతం దిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులలో కేసులు వాదిస్తున్నారు. ఇంగ్లాండ్​లోని యూనివర్సిటీ ఆఫ్ వార్​విక్​లో ఇంగ్లిష్ లిటరేచర్ అభ్యసించారు. అక్కడి నుంచి బీఏ ఆనర్స్ డిగ్రీ పొందిన తర్వాత.. లండన్​లోని బీపీపీ లా స్కూల్​లో న్యాయవాద వృత్తిని అభ్యసించారు. 'బారిస్టర్ ఎట్ లా'లో అర్హత సాధించిన బాన్సురీ.. లండన్​లోని 'ఇన్ ఆఫ్ ఇన్నర్ టెంపుల్' బార్ అసోసియేషన్​లో చేరారు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్​ఫర్డ్​లోని సెయింట్ కేథరిన్స్ కళాశాలలో మాస్టర్స్ చదివారు.

sushma-swaraj-daughter-bansuri
ఎల్​కే అడ్వాణీ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంటికి కేక్ తీసుకెళ్లిన బాన్సురీ (పాత చిత్రం)
sushma-swaraj-daughter-bansuri
బాన్సురీ నియామకపత్రం

లలిత్ మోదీ వివాదం
బాన్సురీ పలు వివాదాల్లోనూ చిక్కుకున్నారు. ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్​ మోదీకి పాస్​పోర్ట్ తిరిగి ఇప్పించడంలో సాయం చేశారని ఆమెపై విమర్శలు ఉన్నాయి. లలిత్ మోదీకి పాస్​పోర్ట్ తిరిగి ఇవ్వాలని దిల్లీ హైకోర్టు 2014 ఆగస్టు 27న ఆదేశాలు జారీ చేసింది. అప్పుడు ఆయన.. తన లీగల్ టీమ్​కు ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్​లో ఉన్న ఎనిమిది మంది పేర్లలో బాన్సురీ పేరు సైతం ఉంది. అప్పుడే ఆమె పేరు చర్చనీయాంశమైంది. బాన్సురీపై పలు విమర్శలు వచ్చాయి. ఆ సమయంలోనూ బీజేపీ ఆమెకు అండగా నిలిచింది. బాన్సురీ తన వృత్తిధర్మాన్ని మాత్రమే పాటించారని చెప్పుకొచ్చింది.

sushma-swaraj-daughter-bansuri
బాన్సురీ స్వరాజ్
విశేష జనాదరణ పొందిన మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్.. 2019 ఆగస్టు 6న అకాల మరణం చెందారు. గుండెపోటుతో 67 ఏళ్ల వయసులో సుష్మా స్వరాజ్ కన్నుమూశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.