తెలంగాణ

telangana

ACCIDENTS: హైదరాబాద్​లో కొత్తగా 50 బ్లాక్​స్పాట్లు

By

Published : Aug 4, 2021, 11:16 AM IST

ప్రమాదాల సంఖ్య పెరిగిపోతున్న క్రమంలో వాటి గురించి అధ్యయనం చేసి... హైదరాబాద్ పోలీసులు కొత్తగా 50 బ్లాక్​స్పాట్లను గుర్తించారు. ప్రమాదాలను తగ్గించేందుకు మౌలిక సదుపాయాలు కల్పించి... ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు.

ACCIDENTS
బ్లాక్​స్పాట్లు

రద్దీ రహదారులపై దూసుకెళ్లే వాహనదారులు. విశాలమైన రోడ్లపై వంద కిలోమీటర్లకంటే వేగంగా వెళ్తున్న కార్లు.. బైకులు.. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలు చేస్తున్న మందుబాబులు.. కొత్త రోడ్ల నిర్మాణం.. మరమ్మతుల కారణంగా ఏర్పడిన గుంతలు.. రాత్రివేళల్లో కనిపించని సూచికలు.. రాజధాని నగరంలో నమోదవుతున్న ప్రమాదాలకు ప్రధాన కారణాలు. సాధారణ ప్రమాదాలతో పాటూ కొత్త ప్రాంతాల్లోనూ తీవ్ర ప్రమాదాలు జరుగుతుండడంతో హైదరాబాద్‌ పోలీసులు వీటిని తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నారు. లాక్‌డౌన్‌ తొలగించినప్పటి నుంచి ప్రమాదాల సంఖ్య పెరుగుతుండడంతో వాటిని అధ్యయనం చేసి కొత్తగా 50 బ్లాక్‌స్పాట్ల(ప్రమాద ప్రాంతాలు) గుర్తించారు. సాధ్యమైనంత వేగంగా అక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు.

ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

రహదారులపై గుంతలు, మరమ్మతులు, విభాగినులు, బ్యారికేడ్లు.. ఇలా వివిధ కారణాలతో ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్‌స్పాట్లను ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో కొత్తగా 50 ప్రమాద ప్రాంతాలను గుర్తించారు. అక్కడ రోడ్డు ప్రమాదాలు జరగకుండా సూచికలు ఏర్పాటు చేశారు. వాహనాల వేగాన్ని తగ్గించేందుకు రంబుల్‌స్ట్రిప్స్‌ను రోడ్లపై అమర్చారు. తరచూ ప్రమాదాలు నమోదవుతున్న జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, సికింద్రాబాద్‌, మెట్టుగూడ, అబిడ్స్‌, కోఠి, అంబర్‌పేట, మలక్‌పేట ప్రాంతాల్లో ట్రాఫిక్‌ కూడళ్ల వద్దే కాకుండా ఇతర ప్రాంతాల్లో సిమెంట్‌ పిల్లర్లు, బొల్లార్డ్‌లు ఏర్పాటు చేశారు. జూన్‌, జులై నెలల్లో జరిగిన ప్రమాద ప్రాంతాలకు వెళ్లి ఆ ప్రాంతాల పరిసరాల్లో వాహనదారులకు పగలూ, రాత్రి కనిపించేలా సూచికలు ఏర్పాటు చేశారు.

మరణాలు తగ్గించేందుకు..

నగరం, శివారు ప్రాంతాల్లోని రహదారులపై నమోదవుతున్న ప్రమాదాలు, మరణాలను ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ పోలీసులు పరిశీలిస్తున్నారు. వీటిని తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి అక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయించారు. పాతబస్తీలో చాంద్రాయణగుట్ట, కంచన్‌బాగ్‌, సంతోష్‌నగర్‌, ధాతునగర్‌ రహదారులపై ప్రమాదాల సంఖ్య పెరగడంతో అక్కడ మూడు కిలోమీటర్ల విభాగినిని నియమించారు. దీంతో 15 రోజుల్లో 30 శాతం ప్రమాదాలు తగ్గిపోయాయి. మరోవైపు జాతీయ రహదారులపై దృష్టి కేంద్రీకరించి అక్కడ ప్రమాదాలు తగ్గేలా ప్రస్తుతం చర్యలు చేపడుతున్నారు. జూపార్క్‌ నుంచి ఆరాంఘర్‌ వరకు, అంబర్‌పేట నుంచి రామంతాపూర్‌ వరకు రహదారులపై బొల్లార్డ్స్‌ విభాగినులు ఏర్పాటు చేయనున్నారు.

ఇదీ చూడండి:GACHIBOWLI ACCIDENT: ఆ పబ్ యజమాని, మేనేజర్​ అరెస్ట్..

accident: బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details