Governor tweet on Hyderabad boy death in dogs attack : హైదరాబాద్లో బాగ్అంబర్పేట డివిజన్ ఎరుకల బస్తీలో నాలుగేళ్ల బాలుడిపై వీధి శునకాలు విచక్షణారహితంగా దాడిచేయడం బాధాకరమని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన జరగడం విచారకరమని ట్వీట్ చేశారు. బాలుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ముప్పును ఎదుర్కోవడానికి ఇప్పటికే ఉన్న ఏర్పాట్లు ఏమాత్రం సరిపోవడంలేదని ఈ ఘటన నిరూపించిందని గవర్నర్ అన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే పరిష్కారాలు వెతకకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. భవిష్యత్లో ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని గవర్నర్ కోరారు.
Revanth Reddy tweet on Hyderabad boy death in dogs attack :వీధికుక్కలు మనుషులను పీక్కుతినే పరిస్థితి ఈ ప్రభుత్వ హయాంలో రావడం దురదృష్టకరమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నాలుగేళ్ల చిన్నారిని కుక్కలు కరిచి చంపితే మానవత్వం లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ మేయర్ కుక్కలకు ఆకలేసిందని మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్లో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు చనిపోయినా సర్కారు పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బాలుడు మరణిస్తే మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వకుండా కేవలం సారీ చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నందుకు చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.