BJP Focus on Operation Akarsh: రాష్ట్రంలో బలమైన రాజకీయ పక్షంగా ఎదిగేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని భాజపా భావిస్తోంది. ఇందులో భాగంగా సందర్భంగా వచ్చినప్పుడుల్లా పార్టీ అగ్రనేతల పర్యటనలతో క్యాడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తోంది. ఉపఎన్నికల్లో తమ బలాన్ని చాటుతూ, తెరాసకు ప్రత్యామ్నాయం అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అయితే పార్టీ బలానికి తోడు దుబ్బాకలో రఘునందన్రావు, హుజూరాబాద్లో ఈటల రాజేందర్ వంటి బలమైన అభ్యర్థుల వల్లే విజయం దక్కిందనే అభిప్రాయం ఉంది. ఇటీవల మునుగోడు ఉపపోరులోనూ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వంటి వారి వల్లే కమలదళం భారీగా ఓట్లు సాధించించేందనే విశ్లేషణలూ ఉన్నాయి. ఈ అంచనాలతోనే అన్ని నియోజకవర్గాలోనూ బలమైన అభ్యర్థుల కోసం కమలదళం అన్వేషణ సాగిస్తోంది.
ఇందులో భాగంగా అధికార తెరాసతో పాటు కాంగ్రెస్లోని అసంతృప్త నేతలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సాధారణ ఎన్నికలకు ఏడాది సమయం ఉండటంతో పార్టీ బలహీనంగా ఉన్న చోట ఆర్థిక, అంగబలం ఉన్న అభ్యర్థుల కోసం కాషాయదళం ఆన్వేషిస్తోంది. కాంగ్రెస్లోని అసంతృప్త నేతలతో పాటు రేవంత్రెడ్డి వ్యతిరేక వర్గంపై భాజపా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. వారిని కాషాయగూటికి చేర్చే పనిలో పడింది. కాంగ్రెస్కు చెందిన మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 25న దిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో కాషాయతీర్థం పుచ్చుకోనున్నారు. మర్రి శశిధర్ రెడ్డితో పాటు నిర్మల్ జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రామారావు పటేల్ కూడా చేరుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.