మల్లారెడ్డి సంస్థలపై ఐటీ దాడుల్లో నాటకీయ పరిణామాలు.. అర్ధరాత్రి హైడ్రామా..

author img

By

Published : Nov 24, 2022, 6:38 AM IST

Updated : Nov 24, 2022, 8:32 AM IST

మల్లారెడ్డి సంస్థలపై ఐటీ దాడుల్లో నాటకీయ పరిణామాలు.. అర్ధరాత్రి హైడ్రామా..

కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంస్థలపై ఆదాయ పన్ను శాఖ చేపట్టిన సోదాల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒక దశలో ఉద్రిక్తతలకు దారితీశాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత మంత్రి మల్లారెడ్డి ఇంటి వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. తన కుమారుడు మహేందర్ రెడ్డిపై ఒత్తిడి చేసి ఐటీ అధికారులు కొన్ని కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారని మల్లారెడ్డి పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఐటీ అధికారులు రెండు రోజుల సోదాల్లో రూ.8 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

మల్లారెడ్డి సంస్థలపై ఐటీ దాడుల్లో నాటకీయ పరిణామాలు.. అర్ధరాత్రి హైడ్రామా..

కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, బంధువుల ఇళ్లలో ఐటీ శాఖ అధికారులు రెండో రోజూ సోదాలు చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత హైడ్రామా చోటుచేసుకుంది. ఆసుపత్రిలో ఉన్న తన కుమారుడు మహేందర్ రెడ్డితో కొన్ని కాగితాలపై ఐటీ అధికారులు బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. బోయిన్​పల్లిలోని కుమారుడు చికిత్స తీసుకుంటున్న సూరారంలోని ఆసుపత్రికి హుటాహుటిన వెళ్లిన మల్లారెడ్డి.. తనకు తెలియకుండా బలవంతంగా ఎందుకు సంతకాలు పెట్టించుకున్నారని ప్రశ్నించారు. తాను తిరిగి ఇంటికి చేరుకునే సరికి అధికారులు డాక్యుమెంట్లు తీసుకుని చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారని మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడికి మాయమాటలు చెప్పి సంతకాలు పెట్టించుకున్నారని ఆరోపిస్తూ స్థానిక బోయిన్​పల్లి పోలీస్ స్టేషన్​లో మల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. ఆసుపత్రికి వచ్చిన ఐటీ శాఖ అధికారిని తనతో పాటు తీసుకువచ్చి కుమారుడితో సంతకం చేయించుకున్నారని తెలిపారు.

పోలీసులు సదరు ఐటీ అధికారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతలోనే మిగిలిన ఐటీ అధికారులు కూడా పోలీస్ స్టేషన్​కు తరలివచ్చారు. కొద్ది సేపటికే సీఆర్​పీఎఫ్​ పోలీసులు భారీ ఎత్తున బోయిన్​పల్లి పోలీస్ స్టేషన్​కుచేరుకున్నారు. మంత్రి మల్లారెడ్డి నివాసంలో బుధవారం అర్ధరాత్రి వరకు ఐటీ అధికారులు సోదాలు చేశారు. మంత్రితో పాటు ఆయన సోదరుడు గోపాల్​రెడ్డి అల్లుడు రాజశేఖర్​రెడ్డి నివాసాలతో పాటు న్యూబోయినపల్లి సీతారాంపురంలోని సీఎంఆర్​ మోడల్ హై స్కూల్లో సోదాలు జరిగాయి. తొలుత పాఠశాల సిబ్బంది ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సమీపంలోని మల్లారెడ్డి వ్యాపార భాగస్వామి నర్సింహ యాదవ్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో మంత్రి నివాసంలో పని మనిషి రమకు మూర్ఛ వచ్చి ఇంట్లోనే కుప్పకూలింది. చికిత్స నిమిత్తం సూరారంలోని నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. మంత్రికి సంబంధించి పలు స్థలాల క్రయ, విక్రయాలకు సంబంధించిన పత్రాలు, విద్యా వ్యాపారాలకు సంబంధించిన పత్రాలను అధికారులు క్షుణ్నంగా తనిఖీలు చేస్తుండడంతో ఎక్కువ సమయం పడుతున్నట్లు తెలుస్తోంది.

మంత్రి అల్లుడు రాజశేఖర్​రెడ్డి కుమార్తె శ్రేయారెడ్డిని కోఠిలోని ఎస్బీఐ బ్యాంకుకు తీసుకువెళ్లారు. కొంపల్లిలో నివాసముంటున్న మంత్రి రెండో కోడలు ప్రీతిరెడ్డిని అధికారులు విచారణలో భాగంగా న్యూ బోయిన్​పల్లి జయనగర్ కాలనీలోని మంత్రి నివాసానికి తీసుకువచ్చారు. రెండు రోజులుగా జరుగుతున్న సోదాలను పర్యవేక్షించడానికి దిల్లీ నుంచి డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారి ఒకరు బుధవారం హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజులు తనిఖీలు జరిగే అవకాశం ఉండటంతో సిబ్బందికి మార్గదర్శకం చేసేందుకే ఆయన వచ్చినట్లు సమాచారం. 2 రోజుల సోదాల్లో రూ.8 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

బాలానగర్​లోని క్రాంతి సహకార బ్యాంకు సంస్థల ఛైర్మన్​ బి.రాజేశ్వరరావు గుప్తా నివాసంతో పాటు ఇదే ప్రాంతంలోని బ్యాంకులోనూ బుధవారం కూడా ఐటీ సోదాలు జరిగాయి. మంత్రి మల్లారెడ్డికి చెందిన పలు వ్యాపార సంస్థల్లో ఈయన భాగస్వామిగా ఉండటంతో బ్యాంకు లావాదేవీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి..

ఆస్తులు, వ్యాపారాలకు సంబంధించి అన్ని లెక్కలు సరిగ్గానే ఉన్నాయి: మల్లారెడ్డి

రెండోరోజూ మల్లారెడ్డి ఇళ్లలో సోదాలు.. ఇంతకీ ఐటీ ఏం తేల్చిందంటే?

Last Updated :Nov 24, 2022, 8:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.