Bhatti Vikramarka Meet MP Venkat Reddy: పార్టీ అధిష్ఠానం అనుమతితోనే రాష్ట్రంలో నేతల పాదయాత్రలు కొనసాగుతున్నాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. ఈనెల 16 నుంచి భట్టి పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులతో పాటు.. పార్టీలో స్థితిగతులపై ఇరువురూ చర్చించారు. ఇందులో భాగంగానే తన పాదయాత్రలో పాల్గొనాలని కోమటిరెడ్డిని ఆహ్వానించానని భట్టి విక్రమార్క తెలిపారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. దీంతో పాటు యాత్రకు సంబంధించి వెంకట్రెడ్డి కొన్ని సూచనలు చేశారని పేర్కొన్నారు.
పార్టీలో టికెట్లకు సంబంధించి ఒక విధానం ఉంటుంది:టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పాదయాత్ర వేరేమార్గంలో... తన పాదయాత్ర మరో మార్గంలో ఉంటుందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్లో అరవై శాతం టిక్కెట్లు ఇప్పటికే ఖరారు అయ్యాయన్న విషయం తనకు తెలియదని వివరించారు. పార్టీలో టికెట్లకు సంబంధించి ఒక విధానం ఉంటుందని.. దాని ప్రకారమే టికెట్ల ఎంపికని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
రేవంత్రెడ్డి పాదయాత్రకు పిలవలేదు: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండుటెండలో పాదయాత్ర చేయబోతున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. గతంలో వైఎస్ఆర్ పాదయాత్ర చేసిన సమయంలో దగ్గరగా చూసిన అనుభవం తనకు ఉందని వివరించారు. మండుటెండలో భట్టి పాదయాత్ర చేపడుతున్నారని.. అందుకే జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చానని తెలిపారు. పెద్ద పెద్ద సెంటర్లలో బహిరంగ సభలు పెట్టమని సూచించానని పేర్కొన్నారు. రేవంత్రెడ్డి పాదయాత్రకు తనను పిలవలేదని వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు.
పాదయాత్రలో పాల్గొంటాను: ఈ పాదయాత్రలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. మంచిర్యాలతో పాటు జడ్చర్ల లేదా షాద్నగర్లో బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నట్లు భట్టి తెలిపారని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే నల్గొండలో కూడా బహిరంగ సభ పెట్టాలని కోరానని అన్నారు. వారు అందుకు ఒప్పుకున్నారని వివరించారు. ఆ తర్వాత నకిరేకల్, సూర్యాపేటలో కూడా మినీ పబ్లిక్ మీటింగ్ పెట్టమని కోరానని వెల్లడించారు.
పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయని.. అందుకే శని, ఆదివారాలు తాను తప్పకుండా పాదయాత్రలో పాల్గొంటానని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. అనంతరం గాంధీభవన్లో పార్టీ అనుబంధ విభాగాల ఛైర్మన్లు, జనరల్ సెక్రటరీలతో భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. పాదయాత్ర విజయవంతం కోసం 52 మంది కో-ఆర్డినేటర్లను ఆయన నియమించారు.